AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shubman Gill : టీమిండియా నయా రికార్డ్.. సచిన్, కోహ్లీ, రోహిత్ సరసన చేరిన శుభ్‌మన్ గిల్

Shubman Gill : అఫ్గానిస్తాన్‌పై 154 పరుగుల అద్భుత ఇన్నింగ్స్‌తో శుభ్‌మన్ గిల్ చరిత్ర సృష్టించాడు. వన్డేల్లో కెప్టెన్‌గా 150+ స్కోర్ చేసిన ఏడో భారత కెప్టెన్‌గా నిలిచి, సచిన్, కోహ్లీ, రోహిత్, సెహ్వాగ్ వంటి దిగ్గజాల సరసన చోటు దక్కించుకున్నాడు.

Shubman Gill  : టీమిండియా నయా రికార్డ్.. సచిన్, కోహ్లీ, రోహిత్ సరసన చేరిన శుభ్‌మన్ గిల్
Shubman Gill
Rakesh
|

Updated on: Jun 18, 2026 | 3:37 PM

Share

Shubman Gill : భారత్, అఫ్గానిస్తాన్ జట్ల మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో టీమిండియా అద్భుత విజయాన్ని నమోదు చేసింది. అఫ్గాన్ జట్టును ఏకంగా 170 పరుగుల భారీ తేడాతో చిత్తు చేసి వన్డే సిరీస్‌లో తన పట్టును నిరూపించుకుంది. భారత జట్టు సాధించిన ఈ భారీ విజయంలో జట్టు కెప్టెన్, యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ అత్యంత కీలకమైన పాత్ర పోషించాడు. మైదానంలో అఫ్గాన్ బౌలర్లను ముప్పుతిప్పలు పెడుతూ ఆయన ఆడిన 154 పరుగుల సునామీ ఇన్నింగ్స్ జట్టుకు భారీ స్కోరును అందించింది. ఈ అద్భుత ప్రదర్శనకు గాను గిల్‌ను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా వరించింది.

కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు

ఈ మ్యాచ్‌ ద్వారా శుభ్‌మన్ గిల్ వన్డే క్రికెట్ చరిత్రలో ఒక అరుదైన, చారిత్రాత్మక మైలురాయిని అందుకున్నాడు. వన్డే మ్యాచ్‌లలో కెప్టెన్‌గా ఉంటూ ఒకే ఇన్నింగ్స్‌లో 150 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు సాధించిన ఏడో భారతీయ కెప్టెన్‌గా గిల్ రికార్డు సృష్టించాడు. నిజానికి గిల్ కెరీర్‌లో ఇదివరకు వన్డేల్లో డబుల్ సెంచరీ కూడా సాధించాడు. కానీ, 2023లో వచ్చిన ఆ ఇన్నింగ్స్ సమయంలో గిల్ జట్టుకు కెప్టెన్ కాదు. అక్టోబర్ 2025లో భారత వన్డే జట్టుకు అధికారికంగా సారథి బాధ్యతలు చేపట్టిన తర్వాత గిల్ వన్డేల్లో 150 ప్లస్ స్కోర్ చేయడం ఇదే మొదటిసారి కావడం విశేషం.

లెజెండరీ కెప్టెన్ల సరసన ప్రిన్స్

భారత క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు కేవలం ఆరుగురు కెప్టెన్లకు మాత్రమే వన్డేల్లో 150కి పైగా పరుగులు చేయడం సాధ్యమైంది. ఇప్పుడు గిల్ కూడా ఆ ఎలైట్ క్లబ్‌లో చేరిపోయాడు. గిల్ కంటే ముందు కపిల్ దేవ్, మహ్మద్ అజహరుద్దీన్, సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మాత్రమే ఈ ఘనత సాధించారు. వీరిలో రన్ మెషీన్ విరాట్ కోహ్లీ మాత్రమే కెప్టెన్‌గా వన్డేల్లో రెండు సార్లు 150 ప్లస్ స్కోర్లు సాధించిన ఏకైక భారతీయ సారథిగా రికార్డుల్లో ఉన్నాడు.

కపిల్ దేవ్ మొదలు పెట్టగా.. సెహ్వాగ్ టాప్ రికార్డ్

భారత జట్టు తరఫున వన్డేల్లో కెప్టెన్‌గా ఉంటూ మొట్టమొదటిసారి 150కి పైగా పరుగులు చేసిన ఘనత లెజెండరీ కెప్టెన్ కపిల్ దేవ్‌కు దక్కుతుంది. ఆయన 1983 వన్డే ప్రపంచకప్‌లో జింబాబ్వేపై చారిత్రాత్మకమైన 175 పరుగులు చేశారు. ఇకపోతే వన్డేల్లో కెప్టెన్‌గా అత్యధిక పరుగులు చేసిన రికార్డు డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ పేరిట ఉంది. సెహ్వాగ్ 2011లో వెస్టిండీస్‌పై ఏకంగా 219 పరుగులతో డబుల్ సెంచరీ బాదాడు. ఆ తర్వాత రోహిత్ శర్మ కూడా కెప్టెన్‌గా శ్రీలంకపై 208 పరుగులు సాధించాడు. ఇప్పుడు ఈ దిగ్గజాల సరసన 2026లో గిల్ నిలవడం గర్వకారణం.

వన్డేల్లో 150 కి పైగా పరుగులు చేసిన భారత కెప్టెన్ల పూర్తి జాబితా :

175 పరుగులు (నాటౌట్) – కపిల్ దేవ్ – జింబాబ్వేపై (1983)

153 పరుగులు (నాటౌట్)* – మహ్మద్ అజహరుద్దీన్ – జింబాబ్వేపై (1998)

186 పరుగులు (నాటౌట్)* – సచిన్ టెండూల్కర్ – న్యూజిలాండ్‌పై (1999)

219 పరుగులు – వీరేంద్ర సెహ్వాగ్ – వెస్టిండీస్‌పై (2011)

208 పరుగులు (నాటౌట్)* – రోహిత్ శర్మ – శ్రీలంక పై (2017)

160 పరుగులు (నాటౌట్)* – విరాట్ కోహ్లీ – దక్షిణాఫ్రికాపై (2018)

157 పరుగులు (నాటౌట్)* – విరాట్ కోహ్లీ – వెస్టిండీస్‌పై (2018)

154 పరుగులు – శుభ్‌మన్ గిల్ – అఫ్గానిస్తాన్‌పై (2026)

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us