- Telugu News Sports News Other sports Top badminton stars set to launch Grand Prix Badminton League in Karnataka
Badminton: పీబీఎల్కు పోటీగా భారత బ్యాడ్మింటన్లో కొత్త లీగ్.. 8 జట్లతో ప్రారంభం.. ఎవరెవరున్నారంటే?
Grand Prix Badminton League: గ్రాండ్ ప్రిక్స్ బ్యాడ్మింటన్లో 8 జట్లు పాల్గొంటాయి. దీని మొత్తం ప్రైజ్ మనీ రూ. 60 లక్షలు. కాగా, ఇందులో విజేతకు రూ.24 లక్షలు, రన్నరప్కు రూ. 12 లక్షలు దక్కనున్నాయి.
Updated on: Jun 04, 2022 | 6:51 AM

పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్, సాయి ప్రణీత్, జ్వాలా గుత్తా, అశ్విని పొన్నప్ప, చిరాగ్ శెట్టి వంటి భారత బ్యాడ్మింటన్ స్టార్లు శనివారం ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ తరహాలో కర్ణాటక సొంత గ్రాండ్ ప్రిక్స్ బ్యాడ్మింటన్ లీగ్ ప్రారంభోత్సవ వేడుకలో భాగం కానున్నారు. కర్ణాటక బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఈ లీగ్ను నిర్వహిస్తున్నట్లు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది.

జులై 1 నుంచి 10 వరకు జరిగే లీగ్లో టైటిల్ కోసం ఎనిమిది జట్లు తలపడతాయి. ఈ ఎనిమిది జట్లు - బెంగళూరు లయన్స్, మంగళూరు షార్క్స్, మాండ్య బుల్స్, మైసూర్ పాంథర్స్, మల్నాడ్ ఫాల్కన్స్, బందీపూర్ టస్కర్స్, కెజిఎఫ్ వోల్వ్స్, కొడగు టైగర్స్. ఒక్కొక్క టీంలో 10 మంది ఆటగాళ్లు ఉంటారు. ఇందులో కనీసం ఐదుగురు కర్ణాటక ఆటగాళ్లు ఉంటారు. వీరిలో ఇద్దరు క్రీడాకారులు విదేశాలకు చెందిన వారు కాగా, ముగ్గురు మహిళలు షట్లర్లకు చోటు దక్కనుంది.

టోర్నమెంట్ మొత్తం ప్రైజ్ మనీ రూ. 60 లక్షలుగా ప్రకటించారు. ఇందులో విజేతకు రూ. 24 లక్షలు, రన్నరప్కు రూ. 12 లక్షలు అందించనున్నారు. లాంచ్ సందర్భంగా జట్టు జెర్సీ, ట్రోఫీని ఆవిష్కరించనున్నారు.

కనీసం 400 మంది ఆటగాళ్లు నమోదు చేసుకున్న ఈ లీగ్ కోసం వేలం వచ్చే వారం జరగనుంది. కర్ణాటక బ్యాడ్మింటన్ అసోసియేషన్ సింధు, శ్రీకాంత్, సేన్, కోచ్ విమల్ కుమార్లను శనివారం సన్మానించనుంది. ఈ సందర్భంగా ఆయనకు గౌరవ జీవిత సభ్యత్వం కూడా ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.
