FIFA World Cup 2026 : 48 జట్లు, 104 మ్యాచ్లు.. ఫిఫా వరల్డ్ కప్ 2026 ద్వారా రూ.86 వేల కోట్ల సంపాదన ఎలాగో తెలుసా?
FIFA World Cup 2026 : ఫిఫా వరల్డ్ కప్ 2026లో 48 జట్లు, 104 మ్యాచ్లతో భారీ ఆదాయ రికార్డులు నమోదుకానున్నాయి. టీవీ రైట్స్, స్పాన్సర్షిప్స్, టికెట్ విక్రయాలు, హాస్పిటాలిటీ ప్యాకేజీల ద్వారా ఫిఫా రూ.86 వేల కోట్లకు పైగా సంపాదించనుందని అంచనాలు చెబుతున్నాయి.

FIFA World Cup 2026 : ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది ఆరాధించే క్రీడ ఏదైనా ఉందంటే అది ఫుట్బాల్ మాత్రమే. కోట్లాది మంది అభిమానులు తమకు నచ్చిన దేశాలు, స్టార్ ప్లేయర్ల ఆటను బుల్లితెరపై, స్టేడియాలలో లైవ్గా చూస్తుంటారు. అయితే ఈ మెగా టోర్నమెంట్ను నిర్వహించే అంతర్జాతీయ ఫుట్బాల్ సమాఖ్య (FIFA) ఈ ఒక్క టోర్నీ ద్వారా ఎంత సంపాదిస్తుందో తెలుసా ? రాబోయే ఫిఫా వరల్డ్ కప్ 2026 కేవలం ఆట పరంగానే కాదు, బిజినెస్, కమర్షియల్ సంపాదన పరంగానూ సరికొత్త ప్రపంచ రికార్డులను సృష్టించబోతోంది.
మూడు దేశాల వేదికగా సరికొత్త రికార్డుల వేట
ఈసారి ఫిఫా వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ను అమెరికా, కెనడా, మెక్సికో దేశాలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఈ టోర్నీలో చరిత్రలోనే మొదటిసారిగా 10కి బదులు ఏకంగా 48 జట్లు పాల్గొనబోతున్నాయి. జట్ల సంఖ్య పెరగడంతో మ్యాచ్ల సంఖ్య కూడా గతంలో కంటే భారీగా పెరిగి మొత్తం 104 మ్యాచ్లు జరగనున్నాయి. ఎక్కువ జట్లు, ఎక్కువ మ్యాచ్లు, భారీ సంఖ్యలో వచ్చే ప్రేక్షకుల వల్ల ఫిఫాకు డైరెక్ట్గా భారీ లాభాలు రానున్నాయి. ఈ 2026 వరల్డ్ కప్ ద్వారా ఫిఫా ఏకంగా 8.9 బిలియన్ డాలర్లు అంటే మన భారతీయ కరెన్సీలో సుమారు రూ.86 వేల కోట్లకు పైగా రికార్డు స్థాయి ఆదాయాన్ని ఆర్జించబోతోందని అంచనా.
టికెట్ సేల్స్, టీవీ రైట్స్తోనే అసలు ఆట
ఫిఫా సంపాదనలో అత్యధిక భాగం టీవీ ప్రసార హక్కులు, డిజిటల్ రైట్స్ అమ్మకం ద్వారానే వస్తుంది. ఈ ఒక్క విభాగం నుంచే ఫిఫాకు దాదాపు 4 బిలియన్ డాలర్లు (సుమారు రూ.38 వేల కోట్లు) సమకూరనుంది. దీనితో పాటు వివిధ గ్లోబల్ బ్రాండ్ల స్పాన్సర్షిప్స్ ద్వారా మరో 1.8 బిలియన్ డాలర్లు రానున్నాయి. ఇక స్టేడియం మ్యాచ్ టికెట్ల అమ్మకాలు, విఐపి హాస్పిటాలిటీ ప్యాకేజీల ద్వారా ఏకంగా 3 బిలియన్ డాలర్లకు పైగా ఆదాయం రాబోతోంది. ఈసారి ఫిఫా అధికారికంగా టికెట్ రీసేల్ ప్లాట్ఫామ్ను కూడా ప్రారంభించింది, దీని ద్వారా టికెట్లు కొనేటప్పుడు, అమ్మేటప్పుడు కూడా ఫిఫాకు అదనపు కమీషన్ రూపంలో భారీగా లాభాలు రానున్నాయి.
ఎక్కువ మ్యాచ్లు.. మరిన్ని కోట్ల రూపాయల వర్షం
గతంలో జరిగిన 2022 ఖతార్ వరల్డ్ కప్లో కేవలం 64 మ్యాచ్లు మాత్రమే జరిగాయి. కానీ ఈసారి అదనంగా మరో 40 మ్యాచ్లు కలిసి రావడంతో మొత్తం మ్యాచ్ల సంఖ్య 104కి చేరింది. మ్యాచ్లు పెరిగే కొద్దీ టీవీ వీక్షకుల సంఖ్య పెరుగుతుంది, ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయం పెరుగుతుంది. టికెట్ విక్రయాలు కూడా రెట్టింపు అవుతాయి. 2023 నుంచి 2026 వరకు ఉన్న పూర్తి కమర్షియల్ సైకిల్లో ఫిఫా మొత్తం ఆదాయం దాదాపు 13 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు, ఇందులో కేవలం 2026 వరల్డ్ కప్ వాటానే 72 శాతం ఉండటం విశేషం.
ఖర్చులన్నీ ప్రభుత్వాలవి.. లాభాలన్నీ ఫిఫా ఖాతాలోకి
ఈ బిజినెస్ మోడల్లో అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. టోర్నీ ద్వారా వచ్చే ఆదాయంలో సింహభాగం ఫిఫా జేబుల్లోకి వెళ్తుంది. కానీ మ్యాచ్లు జరిగే నగరాల్లో స్టేడియంల ఆధునికీకరణ, భద్రతా ఏర్పాట్లు, రవాణా సౌకర్యాలు, ఫ్యాన్ జోన్లు, పబ్లిక్ సర్వీసెస్ వంటి భారీ ఖర్చులన్నీ ఆయా దేశాల ప్రభుత్వాలే భరించాల్సి ఉంటుంది. ఉదాహరణకు కెనడా ప్రభుత్వం ఈ వరల్డ్ కప్ ఆతిథ్యం కోసం దాదాపు 1 బిలియన్ కెనడియన్ డాలర్ల ప్రజా ధనాన్ని ఖర్చు చేస్తోంది. టోర్నమెంట్ ముగిసిన తర్వాత కూడా అక్కడ పర్యాటకం, మౌలిక సదుపాయాలు దీర్ఘకాలం పాటు కొనసాగితేనే ఆయా దేశాల ప్రభుత్వాలకు పెట్టిన పెట్టుబడికి న్యాయం జరుగుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.
మరిన్ని క్రికెట్ మ్యాచ్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
