PM Modi: కామన్వెల్త్‌ విజేతలతో ప్రధాని మోడీ ఆత్మీయ సమావేశం..స్పెషల్‌ గిఫ్ట్‌తో సర్‌ప్రైజ్‌ చేసిన తెలంగాణ బాక్సర్‌

CWG 2022: బర్మింగ్‌హామ్ వేదికగా జరిగిన కామన్వెల్త్ గేమ్స్ 2022 లో భారత ఆటగాళ్లు తమ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. తమపై ఉన్న అంచనాలను నిజం చేస్తూ పతకాలు కొల్లగొట్టారు.

PM Modi: కామన్వెల్త్‌ విజేతలతో ప్రధాని మోడీ ఆత్మీయ సమావేశం..స్పెషల్‌ గిఫ్ట్‌తో సర్‌ప్రైజ్‌ చేసిన తెలంగాణ బాక్సర్‌
Nikhat Zareen

Updated on: Aug 14, 2022 | 6:56 PM

CWG 2022: బర్మింగ్‌హామ్ వేదికగా జరిగిన కామన్వెల్త్ గేమ్స్ 2022 లో భారత ఆటగాళ్లు తమ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. తమపై ఉన్న అంచనాలను నిజం చేస్తూ పతకాలు కొల్లగొట్టారు. ఈసారి కామన్వెల్త్ గేమ్స్‌కు భారతదేశం నుంచి 200 మందికి పైగా అథ్లెట్లు వెళ్లారు. 22 బంగారు పతకాలతో సహా మొత్తం 61 మెడల్స్ గెల్చుకుని పతకాల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచారు. కాగా కామన్వెల్త్‌లో భారత ఆటగాళ్ల ప్రదర్శనను కొనియాడిన ప్రధాని నరేంద్ర మోడీ (PM Narendra Modi) వారితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. శనివారం (ఆగస్ట్ 13) మోడీ తన నివాసంలో ఆటగాళ్లు, సహాయక సిబ్బంది, అధికారులందరికీ ఆతిథ్యం ఇచ్చారు. ఈ సందర్భంగా, పతక విజేతలపై ప్రశంసలు కురిపించారు. అదే సమయంలో రిక్తహస్తాలతో తిరిగొచ్చిన ఆటగాళ్లు ఈసారి మరింత మెరుగ్గా రాణించాలని వెన్నుతట్టారు. కాగా ఈ సందర్భంగా కొంతమంది ఆటగాళ్లు ప్రధానికి సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌లను అందించారు.

తెలంగాణకు చెందిన స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ మోడీ సన్మానం పట్ల సంతోషం, కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా నిఖత్ తన బాక్సింగ్ గ్లోవ్స్‌ను ప్రధానమంత్రికి బహుమతిగా ఇచ్చింది. అనంతరం వాటి ఫొటోలను ట్విట్టర్‌లో షేర్‌ చేస్తూ ..’గౌరవనీయమైన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సర్‌కు బాక్సర్లందరూ సంతకం చేసిన బాక్సింగ్ గ్లోవ్‌లను బహుమతిగా ఇవ్వడం గౌరవంగా ఉంది. ఈ అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. దేశం గర్వించేలా చేసిన నా తోటి ఆటగాళ్లతో అద్భుతమైన రోజు గడిపాను’ అంటూ మురిసిపోయింది మన తెలుగుతేజం. నిఖత్ మాత్రమే కాదు స్టార్ స్ప్రింటర్ హిమ దాస్ కూడా ప్రధానికి ప్రత్యేక బహుమతిని ఇచ్చింది. గాయం నుంచి తిరిగి వచ్చిన హిమ దాస్ మహిళల 200 మీటర్ల విభాగంలో సెమీ ఫైనల్‌ వరకు చేరుకుంది. ఈ సందర్భంగా ప్రధానికి అస్సాం సంప్రదాయ గమ్చాను గిఫ్ట్‌గా ఇచ్చింది. అలాగే బర్మింగ్‌హామ్‌లో బంగారు పతకాలు సాధించిన భారత స్టార్ రెజ్లర్లు వినేష్ ఫోగట్, సాక్షి మాలిక్ కూడా ప్రధానమంత్రికి జెర్సీలను బహూకరించారు. ఇందులో మొత్తం 12 మంది రెజ్లర్లు సంతకం చేశారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి

 

Loading...
Unable to load recommendations.
Follow Us