Yuvraj Singh : గంభీర్, అగర్కర్ డైరెక్టుగా చెప్పాలి.. రోహిత్ శర్మ రిటైర్మెంట్ రచ్చపై క్లారిటీ ఇచ్చిన యువీ

Yuvraj Singh : రోహిత్ శర్మ రిటైర్మెంట్ ఊహాగానాల పై యువరాజ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. 2027 వన్డే ప్రపంచకప్ ప్రణాళికలపై గంభీర్, అగర్కర్ నేరుగా మాట్లాడాలని సూచించాడు. రోహిత్, విరాట్ భవిష్యత్తుపై స్పష్టత ఇవ్వాల్సిన సమయం వచ్చిందని పేర్కొన్నాడు.

Yuvraj Singh : గంభీర్, అగర్కర్ డైరెక్టుగా చెప్పాలి.. రోహిత్ శర్మ రిటైర్మెంట్ రచ్చపై క్లారిటీ ఇచ్చిన యువీ
Yuvraj Singh

Updated on: Jul 20, 2026 | 11:41 AM

Yuvraj Singh : భారత్, ఇంగ్లాండ్ మధ్య జరిగిన మూడో, ఆఖరి వన్డే మ్యాచ్ సమయంలో మీడియాలో జరిగిన చర్చ ఎన్నడూ లేని విధంగా తీవ్ర ఉత్కంఠను రేకెత్తించింది. దానికి ప్రధాన కారణం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ భవిష్యత్తుపై వస్తున్న ఊహాగానాలే. ఈ వారం ఆరంభంలో రోహిత్ శర్మకు లార్డ్స్ వేదికగా జరిగే మ్యాచ్ ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్ కానుందని, వచ్చే ఏడాది సౌతాఫ్రికా, నమీబియా, జింబాబ్వే వేదికలుగా జరిగే వన్డే ప్రపంచకప్ 2027 ప్రణాళికల్లో ఆయనకు స్థానం లేదని సెలెక్షన్ కమిటీ చెప్పినట్లు నివేదికలు వచ్చాయి. అయితే ఈ వార్తలను బీసీసీఐ కార్యదర్శి వెంటనే ఖండించారు. ఈ నేపథ్యంలో భారత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ స్పందిస్తూ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్‌లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలతో పారదర్శకంగా మాట్లాడాలని సూచించారు.

ఆదివారం జరిగిన మూడో వన్డే మిడ్-ఇన్నింగ్స్ బ్రేక్ సమయంలో స్టార్ స్పోర్ట్స్ టీవీ ఛానెల్‌తో మాట్లాడిన యువరాజ్ సింగ్, జట్టు మేనేజ్‌మెంట్ వ్యవహరించాల్సిన తీరుపై స్పష్టమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రాబోయే 2027 వన్డే ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల పాత్ర ఉందో లేదో గౌతమ్ గంభీర్ మరియు అజిత్ అగర్కర్ ఇద్దరూ నేరుగా వారికి స్పష్టం చేయాలని పేర్కొన్నారు. ఏదైనా నిర్ణయం ఉంటే ముఖాముఖి చర్చించి, ఆటగాళ్లకు మానసిక ప్రశాంతతను అందించడం మేనేజ్‌మెంట్ బాధ్యత అని యువీ గుర్తుచేశారు.

2027 వన్డే ప్రపంచకప్ ప్రణాళికలపై సస్పెన్స్ వద్దు

యువరాజ్ సింగ్ మాట్లాడుతూ.. “టీమ్‌లో ఏ ఆటగాళ్లను కొనసాగించాలో నిర్ణయించాల్సింది మేనేజ్‌మెంటే. సాధారణంగా పెద్ద టోర్నీలు గెలవాలంటే జట్టులో అనుభవం చాలా ముఖ్యం. కేవలం యువ ఆటగాళ్లతో మాత్రమే లేదా కేవలం అనుభవజ్ఞులతో మాత్రమే మనం ముందుకు వెళ్లలేం. అనుభవం, యంగ్ బ్లడ్ రెండింటి సరైన కలయిక అవసరం. ఒకవేళ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు 2027 ప్రపంచకప్ ఆడాలని మీరు భావిస్తే, వారికి ఇప్పటి నుంచే ఆ నమ్మకాన్ని, భరోసాని ఇవ్వాలి” అని విశ్లేషించారు.

ఫామ్ లేనప్పుడు విమర్శలు సహజమే

ఆటగాళ్లు ఫామ్‌లో లేనప్పుడు లేదా వయసు పైబడినప్పుడు మీడియాలో ఎన్నో వార్తలు వస్తుంటాయని, వాటిని బయటే ఉంచాలని యువీ హితవు పలికారు. “మీ ప్లాన్స్ ఏవైనా సరే, ఆ ఆటగాళ్లు ప్రపంచకప్‌కు వెళ్లాలని మీరు కోరుకుంటే నిరభ్యంతరంగా వెళ్లిపోండి, దేని గురించి చింతించకండి అని భరోసా ఇవ్వండి. ఒకవేళ వారు మీ ప్రణాళికలకు సరిపోరని భావిస్తే, ఆ విషయాన్ని కూడా స్పష్టంగా ముందే చెప్పేయండి. అది వినడానికి కొంచెం కష్టంగా, బాధగా అనిపించినప్పటికీ, మీరు ఇచ్చిన స్పష్టతను ఆ ఆటగాడు తప్పకుండా గౌరవిస్తాడు” అని యువరాజ్ సింగ్ పేర్కొన్నారు. అదే సమయంలో మైదానంలో రోహిత్ శర్మ, గౌతమ్ గంభీర్ ఇద్దరూ తీవ్రంగా చర్చించుకుంటున్న ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది.

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us