WTC Points Table: బంగ్లా ఓటమితో కలసివచ్చిన అవకాశం.. శ్రీలంక పై గెలిస్తే డబ్ల్యూటీసీ పట్టికలో భారత్ ప్లేస్ ఇదే
WTC Points Table: శ్రీలంకతో కొలంబో టెస్టులో భారత్ గెలిస్తే డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో టీమిండియాకు భారీ లాభం చేకూరనుంది. బంగ్లాదేశ్ ఓటమితో ఇప్పటికే అవకాశాలు మెరుగయ్యాయి. కొలంబోలో గెలిస్తే భారత్ పాయింట్ల శాతం 57.57కి చేరి బంగ్లాదేశ్ను వెనక్కి నెట్టి నాలుగో స్థానానికి ఎగబాకనుంది. దీంతో డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో భారత్ ఆశలు మరింత బలపడనున్నాయి.

WTC Points Table: శ్రీలంకతో కొలంబో వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో విజయం సాధిస్తే ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) పాయింట్ల పట్టికలో టీమిండియాకు భారీ ప్రయోజనం చేకూరనుంది. ప్రస్తుతం ఐదో స్థానంలో ఉన్న భారత జట్టు, ఈ మ్యాచ్లో గెలిస్తే ఏకంగా టాప్ 4లోకి దూసుకెళ్లే అవకాశం లభిస్తుంది. తొలిరోజు ఆట ముగిసే సమయానికి దేవదత్ పడిక్కల్ అద్భుత సెంచరీ సాయంతో భారత్ 5 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసి పటిష్ట స్థితిలో నిలిచింది. గాలేలో జరిగిన తొలి టెస్టులో 165 పరుగుల భారీ తేడాతో విజయం సాధించిన టీమిండియా ప్రస్తుతం డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతోంది. ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచుల్లో భారత్ 5 విజయాలు, 4 ఓటములు, ఒక డ్రాతో మొత్తం 64 పాయింట్లు సాధించింది. టీమిండియా పాయింట్ల శాతం 53.33 వద్ద ఉంది. శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులోనూ విజయం సాధించి సిరీస్ను 2-0తో క్లీన్స్వీప్ చేయాలని గిల్ సేన పట్టుదలతో ఉంది.
మరోవైపు ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ 51 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ ఘోర పరాజయంతో బంగ్లాదేశ్ పాయింట్ల శాతం 55.56కు పడిపోయింది. ఈ పరిణామం భారత్కు ఎంతగానో కలిసిరానుంది. కొలంబో టెస్టులో శ్రీలంకపై విజయం సాధిస్తే భారత్ పాయింట్ల శాతం 57.57కు పెరుగుతుంది. దీని ద్వారా బంగ్లాదేశ్ను వెనక్కి నెట్టి టీమిండియా సునాయాసంగా నాలుగో స్థానానికి చేరుకుంటుంది. అయితే మ్యాచ్ వ్యవధిలో జరిమానాలు లేదా స్లో ఓవర్ రేట్ పాయింట్ల కోత పడకుండా చూసుకోవాల్సి ఉంటుంది.
టాప్ 2లో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా హవా
ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ చేరాలంటే పాయింట్ల పట్టికలో మొదటి రెండు స్థానాల్లో నిలవడం అత్యంత ముఖ్యం. ప్రస్తుతం డిఫెండింగ్ విజేత ఆస్ట్రేలియా 10 మ్యాచుల్లో 8 విజయాలతో 80 శాతం పాయింట్లు సాధించి అగ్రస్థానంలో కొనసాగుతోంది. సౌతాఫ్రికా జట్టు 4 మ్యాచుల్లో 3 విజయాలతో 75 శాతం పాయింట్లు సాధించి రెండో స్థానంలో ఉంది. న్యూజిలాండ్ 72.22 శాతంతో మూడో స్థానంలో నిలిచింది.
ఇతర జట్ల పాయింట్ల పరిస్థితి
పాయింట్ల పట్టికలో మిగిలిన జట్లను పరిశీలిస్తే, శ్రీలంక 5 మ్యాచుల్లో 33.33 శాతంతో ఆరో స్థానంలో ఉంది. ఇంగ్లాండ్ 14 మ్యాచుల్లో కేవలం 29.76 శాతం పాయింట్లతో ఏడో స్థానానికి పరిమితమైంది. వెస్టిండీస్ 20.83 శాతంతో ఎనిమిదో స్థానంలో ఉండగా, పాకిస్థాన్ 19.05 శాతంతో చివరి స్థానంలో కొట్టుమిట్టాడుతోంది. రెండో టెస్టులో పట్టు బిగించిన భారత్ ఈ మ్యాచ్ను గెలిచి పాయింట్ల పట్టికలో మెరుగైన స్థానానికి చేరుకోవాలని భావిస్తోంది. డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో నిలవాలంటే టీమిండియాకు ప్రతి విజయం ఎంతో కీలకంగా మారనుంది.
