IPL 2026: నల్ల బ్యాండ్‌లతో బరిలోకి ఎల్‌ఎస్‌జీ, సీఎస్‌కే ఆటగాళ్లు.. కారణం ఏంటో తెలుసా?

LSG vs CSK Players Wearing Black Armbands: ఐపీఎల్ 2026లో భాగంగా లక్నోలోని ఏకానా స్టేడియంలో జరుగుతున్న కీలక పోరులో లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లు నల్ల బ్యాండ్‌లు ధరించి మైదానంలోకి దిగారు. ఉత్తరప్రదేశ్‌ను వణికించిన ప్రకృతి వైపరీత్యంలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళిగా ఇరు జట్ల క్రీడాకారులు ఈ నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు అందరినీ కలచివేస్తోంది.

IPL 2026: నల్ల బ్యాండ్‌లతో బరిలోకి ఎల్‌ఎస్‌జీ, సీఎస్‌కే ఆటగాళ్లు.. కారణం ఏంటో తెలుసా?
Lsg Vs Csk Players Wearing Black Armbands

Updated on: May 15, 2026 | 8:23 PM

LSG vs CSK Players Wearing Black Armbands: గత బుధవారం మధ్యాహ్నం ఉత్తరప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో భయంకరమైన గాలివాన, పిడుగులు బీభత్సం సృష్టించాయి. ముఖ్యంగా ప్రయాగ్‌రాజ్ వంటి నగరాల్లో తుపాను తరహా పరిస్థితులు నెలకొన్నాయి. అత్యంత వేగంతో కూడిన గాలులు, భారీ వర్షం, పిడుగుల ధాటికి రాష్ట్రవ్యాప్తంగా సుమారు 117 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఇటీవలి కాలంలో సంభవించిన అత్యంత ఘోరమైన ప్రకృతి వైపరీత్యాలలో ఇది ఒకటిగా నిలిచింది. ఈ విషాదం రాష్ట్ర ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

బాధితులకు క్రికెట్ దిగ్గజాల నివాళి..

రాష్ట్రంలో సంభవించిన ఈ భారీ ప్రాణ నష్టానికి సంతాపంగా, లక్నో వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో ఇరు జట్లూ తమ సానుభూతిని ప్రకటించాయి. మ్యాచ్ ప్రారంభానికి ముందు లక్నో సూపర్ జెయింట్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లు, సహాయక సిబ్బంది మైదానంలో వరుసగా నిలబడి ఒక నిమిషం పాటు మౌనం పాటించారు. మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, బాధితుల కుటుంబాలకు అండగా ఉంటామని ఈ సందర్భంగా సందేశం ఇచ్చారు.

మైదానంలో నల్ల బ్యాండ్‌లతో ఆటగాళ్లు..

లక్నో కెప్టెన్ రిషభ్ పంత్ టాస్ గెలిచిన సమయంలోనే ఆయన చేతికి ఉన్న నల్ల బ్యాండ్‌ను అభిమానులు గమనించారు. కేవలం లక్నో జట్టు మాత్రమే కాకుండా, రుతురాజ్ గైక్వాడ్ నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లు కూడా తమ చేతులకు నల్ల బ్యాండ్‌లు ధరించి మ్యాచ్ ఆడుతున్నారు. ఆట కంటే మానవత్వం గొప్పదని చాటిచెప్పేలా క్రీడాకారులు ప్రదర్శించిన ఈ తీరుకు సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున ప్రశంసలు దక్కుతున్నాయి.

మ్యాచ్ అప్‌డేట్..

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన లక్నో కెప్టెన్ రిషభ్ పంత్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నారు. ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించిన లక్నోకు ఇది నామమాత్రపు మ్యాచ్ అయినప్పటికీ, ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే చెన్నై జట్టుకు ఈ విజయం ఎంతో కీలకం. అయితే, స్టేడియంలో ఉన్న వేలాది మంది అభిమానులు సైతం మరణించిన బాధితుల స్మృత్యర్థం మౌనం పాటించి తమ సంఘీభావాన్ని తెలియజేశారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us