
Vaibhav Suryavanshi : అండర్-19 ఆసియా కప్ 2025 టోర్నమెంట్లో భారత్, పాకిస్తాన్ మధ్య డిసెంబర్ 14న జరగనున్న మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ఈ ఉత్సాహాన్ని మరింత పెంచేలా రెండు జట్ల ఓపెనర్లు తొలి మ్యాచ్లోనే తూఫాన్ సెంచరీలు నమోదు చేశారు. టీమిండియా తరఫున యువ సంచలనం వైభవ్ సూర్యవంశి 171 పరుగులు చేయగా, పాకిస్తాన్ బ్యాటర్ సమీర్ మిన్హాస్ ఏకంగా 177 పరుగులు సాధించాడు. అయితే ఎక్కువ పరుగులు చేసినప్పటికీ, సమీర్ మిన్హాస్ ఇన్నింగ్స్లో 14 ఏళ్ల భారత బ్యాటర్ చూపించిన విధ్వంసం, వేగం మాత్రం కనిపించలేదు.
యూఏఈ వేదికగా జరుగుతున్న ఈ టోర్నమెంట్లో తొలి మ్యాచ్లోనే భారత బ్యాటర్ వైభవ్ కేవలం 95 బంతుల్లో 171 పరుగులు చేసి రికార్డు సృష్టించాడు. అదే సమయంలో పాకిస్తాన్ తరఫున 19 ఏళ్ల ఓపెనర్ సమీర్ మిన్హాస్ 177 పరుగులు చేసి, ఈ టోర్నమెంట్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించాడు. అయితే ఎక్కువ పరుగులు చేసినప్పటికీ, పరుగులు చేసిన వేగం విషయంలో సమీర్ మిన్హాస్ భారత స్టార్ వైభవ్ సూర్యవంశి కంటే చాలా వెనుకబడి ఉన్నాడు.
రెండు ఇన్నింగ్స్లను పోల్చి చూస్తే, వైభవ్ సూర్యవంశి కేవలం 30 బంతుల్లో హాఫ్ సెంచరీ, 56 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. దీనికి విరుద్ధంగా, పాకిస్తానీ బ్యాటర్ సమీర్ 73 బంతుల్లో 50 రన్స్, 122 బంతుల్లో సెంచరీని పూర్తి చేయగలిగాడు. వైభవ్ స్ట్రైక్ రేట్ విషయానికి వస్తే 95 బంతుల్లో 171 పరుగులతో 180 స్ట్రైక్ రేట్ కలిగి ఉన్నాడు. సమీర్ స్ట్రైక్ రేట్ చూస్తే 148 బంతుల్లో 177 పరుగులు చేశాడు 119 స్ట్రైక్ రేట్ కలిగి ఉన్నాడు. ఈ గణాంకాలను బట్టి, వైభవ్ బ్యాటింగ్ ఎంత విధ్వంసకరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
బౌండరీల విషయంలోనూ వైభవ్ సూర్యవంశి పైచేయి సాధించాడు. వైభవ్ తన ఇన్నింగ్స్లో ఏకంగా 14 సిక్స్లు, 9 ఫోర్లు కొట్టగా (మొత్తం 23 బౌండరీలు), సమీర్ మిన్హాస్ కేవలం 11 సిక్స్లు, 8 ఫోర్లు మాత్రమే కొట్టగలిగాడు. అంటే కేవలం 6 పరుగులు ఎక్కువగా చేసినా మిన్హాస్ మిగతా అన్ని అంశాల్లోనూ భారత యువ బ్యాటర్ కంటే వెనుకబడ్డాడు. అంతేకాకుండా వైభవ్ సూర్యవంశి తూఫాన్ ఇన్నింగ్స్ కారణంగానే భారత జట్టు 433 పరుగుల భారీ స్కోరు సాధించగా, పాకిస్తాన్ జట్టు కేవలం 345 పరుగులు మాత్రమే చేయగలిగింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ చూడండి