ప్లీజ్‌.. హార్ధిక్‌ పాండ్యాను తిట్టకండి! తిలక్‌ రిటైర్డ్‌ అవుట్‌పై అసలు విషయం బయటపెట్టిన హెడ్‌ కోచ్‌ జయవర్దనే

తిలక్ వర్మను రిటైర్డ్ అవుట్ చేయడంపై తీవ్ర వివాదం నెలకొంది. ముంబై ఇండియన్స్ కోచ్ మహేల జయవర్ధనే ఈ నిర్ణయం తనదని, పాండ్యాకు సంబంధం లేదని స్పష్టం చేశాడు. తిలక్ చివరి ఓవర్లలో పరుగులు చేయడంలో ఇబ్బంది పడటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించాడు. ఈ నిర్ణయంపై క్రికెట్ అభిమానులు విమర్శలు గుప్పిస్తున్నారు.

ప్లీజ్‌.. హార్ధిక్‌ పాండ్యాను తిట్టకండి! తిలక్‌ రిటైర్డ్‌ అవుట్‌పై అసలు విషయం బయటపెట్టిన హెడ్‌ కోచ్‌ జయవర్దనే
Jayawardene

Updated on: Apr 05, 2025 | 12:48 PM

లక్నో సూపర్‌ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తిలక్‌ వర్మ రిటైర్డ్‌ అవుట్‌ తీవ్ర వివాదాస్పదమైంది. తిలక్‌ను అలా వెనక్కి పంపడంపై ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ హార్ధిక్‌ పాండ్యా విమర్శలు ఎదుర్కొంటున్నాడు. 7 బంతుల్లో 24 పరుగులు అవసరమైన సమయంలో సాంట్నర్‌ కోసం తిలక్‌ వర్మను రిటైర్డ్‌ అవుట్‌ చేయడంతో క్రికెట్‌ అభిమానులు ఆగ్రహంగా ఉన్నారు. అయితే.. ఈ విషయంలో ముంబై ఇండియన్స్‌ హెడ్‌ కోచ్‌ మహేల జయవర్దనే తాజాగా స్పందించాడు. ఈ విషయంలో కెప్టెన్‌ హార్ధిక్‌ పాండ్యా తప్పేమీ లేదని, తిలక్‌ వర్మను రిటైర్డ్‌ అవుట్‌గా బయటికి రావాల్సిందిగా నేను కోరానంటూ వెల్లడించాడు. అది తాను తీసుకున్న నిర్ణయమని, ఈ నిర్ణయంతో పాండ్యాకు ఎలాంటి సంబంధం లేదంటూ క్లారిటీ ఇచ్చాడు.

నిజానికి తిలక్‌ వర్మ మిడిల్‌ ఓవర్స్‌లో చాలా బాగా బ్యాటింగ్‌ చేశాడని, సూర్యకుమార్‌ యాదవ్‌తో కలిసి మంచి పార్ట్నర్‌షిప్‌ నెలకొల్పాడని, కానీ, చివర్లో గేర్‌ మార్చి వేగంగా ఆడతాడని చాలా సేపు ఎదురు చేశామని, అందుకోసం తిలక్‌ కూడా చాలా ప్రయత్నించినా.. అతనికి షాట్లు కనెక్ట్‌ అవ్వలేదని జయవర్దనే పేర్కొన్నాడు. ఎంత ప్రయత్నించినా.. షాట్లు కనెక్ట్‌ కాకపోవడంతో, ఒక ఒక్క బ్యాటర్‌ ఫ్రెష్‌ మైండ్‌తో క్రీజ్‌లో ఉంటే బాగుంటుందని భావించి, తిలక్‌ను వెనక్కి పిలిచి సాంట్నర్‌ను బ్యాటింగ్‌కు పంపినట్లు హెడ్‌ కోచ్‌ వెల్లడించాడు. 19వ ఓవర్‌ ఐదో బంతి తర్వాత తిలక్‌ వర్మ రిటైర్డ్‌ అవుట్‌గా బయటికి రావడంతో అంతా షాక్‌ అయ్యారు. అతని స్థానంలో సాంట్నర్‌ బ్యాటింగ్‌కి ఎందుకు వస్తున్నాడో ఎవరికీ అర్థం కాలేదు. అప్పటికీ ముంబై విజయానికి 7 బంతుల్లో 24 పరుగులు కావాలి.

అది అసాధ్యం కాకపోయినా.. అంత ఈజీ అయితే కాదు. కానీ, నాన్‌స్ట్రైకింగ్‌లో కెప్టెన్‌ హార్ధిక్‌ పాండ్యా ఉండటంతో అతను బిగ్‌ హిట్స్‌ కొడతాడంటూ ముంబై అభిమానుల్లో కాస్త ఆశ ఉంది. అయితే.. తిలక్‌ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన సాంట్నర్‌ 19వ ఓవర్‌ చివరి బంతికి రెండు పరుగులు తీసి.. చివరి ఓవర్‌లో పాండ్యాకు బ్యాటింగ్‌ ఇచ్చాడు. 6 బంతుల్లో 22 పరుగులు అవసరమైన క్రమంలో లక్నో బౌలర్‌ అవేశ్‌ ఖాన్‌ వేసిన చివరి ఓవర్‌ తొలి బంతికే పాండ్యా సిక్స్‌ కొట్టడంతో ముంబై విజయంపై ఆశలు చిగురించాయి. కానీ ఆ తర్వాత అద్భుతంగా బౌలింగ్‌ చేసిన ఆవేశ్‌.. ఆ తర్వాత చివరి 5 బంతుల్లో కేవలం 3 పరుగులు మాత్రమే ఇచ్చి.. లక్నోకే 12 పరుగుల తేడాతో విజయం అందించాడు. అయితే.. తిలక్‌ వర్మను రిటైర్డ్‌ అవుట్‌గా పంపడం, ఆ పై ముంబై మ్యాచ్‌ ఓడిపోవడంతో క్రికెట్‌ అభిమానులు ఆ నిర్ణయం తీసుకుంది పాండ్యానే అని అతన్ని ట్రోల్‌ చేస్తున్నారు. కానీ, అది హెడ్‌ కోచ్‌ నిర్ణయమని తెలిసి.. ఇప్పుడు జయవర్దనేను టార్గెట్‌గా చేసుకున్నారు.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.