
Aqib Nabi: దేశవాళీ క్రికెట్లో అదరగొట్టినా కొందరికి జాతీయ జట్టులో అవకాశాలు రావు. రంజీ ట్రోఫీలో జమ్మూకశ్మీర్ను తొలిసారి ఛాంపియన్గా నిలిపిన ఓ యువ పేసర్ పరిస్థితి ఇప్పుడు అలాగే తయారైంది. శ్రీలంక పర్యటనకు ఎంపికైనా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తీసుకుంటున్న నిర్ణయాలతో అతడికి తీవ్ర నిరాశే ఎదురవుతోంది. ఇంతకీ ఎవరా ఆటగాడు?
భారత క్రికెట్ జట్టులోకి రావాలంటే కేవలం ప్రతిభ ఉంటే సరిపోదు, అదృష్టం కూడా కలిసిరావాలి. ఐపీఎల్లో మెరిసిన వెంటనే కొందరికి జాతీయ జట్టు తలుపులు సులువుగానే తెరుచుకుంటాయి. దేశవాళీ టోర్నీల్లో చెమటోడ్చి వికెట్ల పరంపర సృష్టించినా మరికొందరికి మాత్రం అవకాశాలు ఎండమావిగానే మారుతున్నాయి. సరిగ్గా ఇలాంటి గడ్డు పరిస్థితినే ఎదుర్కొంటున్నాడు జమ్మూకశ్మీర్ స్టార్ బౌలర్ ఆకిబ్ నబీ. 2020 జనవరి 3న జార్ఖండ్ జట్టుపై ఫస్ట్ క్లాస్ క్రికెట్ అరంగేట్రం చేసిన ఈ యువ సంచలనం గడిచిన రెండు రంజీ సీజన్లలో అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ఏకంగా 104 వికెట్లు పడగొట్టి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. నిన్నమొన్నటి 2025-26 రంజీ సీజన్లో ఏకంగా 60 వికెట్లు తీసి జమ్మూకశ్మీర్కు చారిత్రక రంజీ ట్రోఫీని అందించడంలో కీలక పాత్ర పోషించాడు. ఇప్పటివరకు 43 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడిన ఆకిబ్ 18.63 సగటుతో 162 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. బ్యాటింగ్లోనూ సత్తా చాటుతూ రెండు హాఫ్ సెంచరీలతో 999 పరుగులు సాధించాడు.
ఇంతటి అద్భుతమైన ఫామ్లో ఉన్న ఆకిబ్ నబీని నేరుగా జట్టులోకి తీసుకోలేదు. శ్రీలంకతో ఆగస్టు 15 నుంచి 27 వరకు జరుగుతున్న రెండు టెస్టుల సిరీస్కు మొదట అతన్ని పక్కనబెట్టారు. ఆ తర్వాత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా స్థానంలో అనూహ్యంగా తుది జట్టులో అవకాశం దక్కింది. దీంతో తన చిరకాల స్వప్నం నెరవేరుతుందని ఆకిబ్ భావించాడు. తీరా శ్రీలంక గడ్డపై అడుగుపెట్టాక పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రాక్టీస్ మ్యాచ్లో అతనికి కేవలం ఐదు ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసే అవకాశం ఇచ్చారు. అప్పుడే ఈ యువ పేసర్కు తుది జట్టులో చోటు దక్కడం కష్టమేననే ఊహాగానాలు మొదలయ్యాయి.
క్రికెట్ వర్గాల్లో ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్న పేరు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్. గంభీర్ శైలి చాలా విభిన్నంగా ఉంటుంది. ఏ ఆటగాడైనా కోచ్ అంచనాలను అందుకోలేకపోతే తుది జట్టులోకి రావడం దాదాపు అసాధ్యం. గాలె వేదికగా ఈరోజు ప్రారంభమైన తొలి టెస్టులో ఆకిబ్ నబీకి మొండిచేయే ఎదురైంది. తుది జట్టులో మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణలకు చోటు దక్కింది. గతంలో డొమెస్టిక్ రికార్డులు బద్దలు కొట్టిన దేశవాళీ దిగ్గజం అభిమన్యు ఈశ్వరన్ సైతం ఇలాగే జట్టుతో పాటు ప్రయాణించి కనీసం ఒక్క మ్యాచ్ ఆడకుండానే వెనుదిరిగాడు. ఆ తర్వాత అతన్ని పక్కనపెట్టేశారు. ఇప్పుడు ఆకిబ్ పరిస్థితి చూస్తుంటే అదే చరిత్ర పునరావృతం అయ్యేలా కనిపిస్తోంది. కోచ్ గంభీర్ వ్యూహాల్లో ఈ కశ్మీర్ కుర్రాడికి చోటు లేదని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..