
Vaibhav Suryavanshi Team India Entry: పదిహేనేళ్ల వయసులో పిల్లలు ఆటపాటలతో కాలం గడుపుతారు. కానీ, ఆ పాలబుగ్గల చిన్నారి మాత్రం ప్రపంచ స్థాయి మేటి బౌలర్లను తన బ్యాట్తో చీల్చి చండాడుతున్నాడు. ఐపీఎల్లో పరుగుల విధ్వంసం సృష్టిస్తున్న ఈ సంచలన ఆటగాడిపై తాజాగా క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్రీడా లోకంలో దావానలంలా వ్యాపించాయి.
రాజస్థాన్ రాయల్స్ తరపున బరిలోకి దిగి ఐపీఎల్ 2026 సీజన్ను ఊపేస్తున్న వైభవ్ సూర్యవంశీ ఆటతీరుకు యావత్ క్రికెట్ ప్రపంచం ఫిదా అవుతోంది. మొన్నటి ఎలిమినేటర్ మ్యాచ్లో హైదరాబాద్ జట్టుపై కేవలం 29 బంతుల్లోనే 97 పరుగులు బాది ఈ యువ సంచలనం సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. ప్రపంచంలోనే అత్యుత్తమ కెప్టెన్, బౌలర్ అయిన పాట్ కమిన్స్ సైతం మూడు ప్రత్యేక ప్రణాళికలతో బరిలోకి దిగి కూడా వైభవ్ను కట్టడి చేయలేకపోయానంటూ చేతులెత్తేయడం ఈ కుర్రాడి సత్తాకు నిదర్శనం. ఆ మ్యాచ్లో క్యాచ్ అవుట్ కాకుండా ఒక్క బౌండరీ కొట్టి ఉంటే, క్రిస్ గేల్ పేరిట ఉన్న మరికొన్ని రికార్డులు కరిగిపోయేవి. ఇప్పటికే ఒకే సీజన్లో 65 సిక్సర్లు బాది, గేల్ నెలకొల్పిన 59 సిక్సర్ల రికార్డును ఈ చిచ్చరపిడుగు ఎప్పుడో బద్దలు కొట్టాడు.
ఇది కూడా చదవండి: GT vs RR: 10 ఏళ్ల హిస్టరీ రిపీట్కు అడ్డుగా ఆ 4 ఓవర్లు.. రాజస్థాన్ ఫేట్ మారేనా?
అంతర్జాతీయ క్రికెట్లో కనీసం అడుగు పెట్టకుండానే, ఐపీఎల్ వేదికగా ప్రపంచంలోని అగ్రశ్రేణి బౌలర్లను వణకిస్తున్న వైభవ్ సూర్యవంశీని తక్షణమే భారత జట్టులోకి తీసుకోవాలంటూ సోషల్ మీడియాలో అభిమానులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ఈ తరుణంలో టీం ఇండియా మాజీ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఒక సంచలన విషయాన్ని బయటపెట్టాడు. రాబోయే జులై నెలలో ఇంగ్లాండ్ వేదికగా జరిగే టీ20 సిరీస్ ద్వారా వైభవ్ సూర్యవంశీ భారత జట్టులోకి అరంగేట్రం చేయడం ఖాయమని గవాస్కర్ స్పష్టం చేశాడు. అప్పటివరకు ఈ అద్భుతమైన ఆటగాడిని ప్రత్యర్థి జట్లకు దొరకకుండా బీసీసీఐ ఒక రహస్య ఆయుధంగా దాచిపెడుతోందని గవాస్కర్ పేర్కొనడం గమనార్హం.
ప్రస్తుతం టీ20 క్రికెట్లో టీం ఇండియా ఎంతో బలంగా ఉంది. ఇలాంటి తరుణంలో వైభవ్ సూర్యవంశీ లాంటి విధ్వంసకర బ్యాటర్ కూడా జట్టులోకి వస్తే ఇక భారత జట్టును ఆపడం ఎవరితరమూ కాదని మాజీలు సైతం ముక్కున వేలేసుకుంటున్నారు. ఇంగ్లాండ్ జట్టును వారి సొంత గడ్డపైనే మట్టికరిపించేందుకు బీసీసీఐ ఈ వ్యూహాన్ని సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. భారత జట్టు జూలై మాసంలో ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. జులై 1వ తేదీ నుంచి జులై 11వ తేదీ వరకు ఇరు జట్ల మధ్య ఐదు మ్యాచ్ల భారీ టీ20 సిరీస్ జరగనుంది. ఈ ప్రతిష్టాత్మక సిరీస్ ద్వారానే వైభవ్ బ్లూ జెర్సీలో మైదానంలోకి అడుగుపెట్టబోతున్నాడనే వార్త అభిమానుల్లో ఎనలేని ఉత్సాహాన్ని నింపుతోంది.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..