
Shubman Gill Comments on IND vs ENG 3rd ODI: లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో భారత జట్టు హోరాహోరీగా పోరాడి ఓటమి పాలైంది. 388 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో రోహిత్ శర్మ సాధించిన అద్భుత శతకం ఉన్నప్పటికీ, భారత్ 27 పరుగుల తేడాతో ఓడిపోయి సిరీస్ను 1-2తో ఇంగ్లాండ్కు అప్పగించింది. ఈ పరాజయంపై కెప్టెన్ శుభ్మన్ గిల్ స్పందిస్తూ అసలు లోపం ఎక్కడ ఉందో ఎత్తిచూపాడు.
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఓపెనర్లు శుభ్మన్ గిల్, రోహిత్ శర్మ తొలి వికెట్కు 147 పరుగుల శుభారంభం అందించారు. గిల్ నిష్క్రమించిన తర్వాత విరాట్ కోహ్లీతో కలిసి రోహిత్ ఇన్నింగ్స్ను ముందుకు నడిపాడు. వీరిద్దరూ రెండో వికెట్కు 113 పరుగులు జోడించారు. ఈ క్రమంలో కెప్టెన్సీ కోల్పోయిన తర్వాత ఓపెనర్గా చెలరేగిన రోహిత్ శర్మ 138 పరుగుల అద్భుత శతకంతో లార్డ్స్ మైదానంలో వన్డే శతకం బాదిన తొలి భారత ఆటగాడిగా సరికొత్త చరిత్ర సృష్టించాడు. అయితే మ్యాచ్ కీలక దశలో కండరాల పట్టేత (క్రాంప్స్) సమస్యతో ఇబ్బంది పడిన రోహిత్, వేగంగా పరుగులు రాబట్టే ప్రయత్నంలో వికెట్ సమర్పించుకున్నాడు.
రోహిత్ అవుట్ కాగానే భారత ఇన్నింగ్స్ ఒక్కసారిగా నెమ్మదించింది. వరుసగా వికెట్లు కోల్పోవడంతో భారత్ తీవ్ర ఒత్తిడిలోకి వెళ్లిపోయింది. మిడిలార్డర్ బ్యాటర్లు ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ క్రీజులో నిలదొక్కుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారు. ఇంగ్లాండ్ పేసర్ సామ్ కర్రన్ నాలుగు వికెట్లతో విరుచుకుపడి భారత పతనాన్ని శాసించాడు. ఒక దశలో సునాయాసంగా గెలిచేలా కనిపించిన మ్యాచ్ క్రమంగా చేయిదాటిపోయింది. ఆఖరి ఓవర్లలో భారత బ్యాటర్లు పోరాడినప్పటికీ 50 ఓవర్లలో 7 వికెట్లకు 360 పరుగులు మాత్రమే చేయగలిగారు.
ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 387 పరుగుల కొండంత స్కోరు సాధించింది. భారత బౌలర్లు తీవ్రంగా పరుగులు సమర్పించుకున్నారు. ముఖ్యంగా ఆఖరి ఓవర్లలో ఇంగ్లాండ్ బ్యాటర్లు ఉతికేశారు. జోస్ బట్లర్ కేవలం 13 బంతుల్లోనే 41 పరుగులు చేసి ఆధిపత్యం చెలాయించాడు. యంగ్ పేసర్ గుర్నూర్ బ్రార్ తన 10 ఓవర్లలో ఏకంగా 97 పరుగులు సమర్పించుకున్నాడు. 49వ ఓవర్లోనే 23 పరుగులు రాబట్టడం మ్యాచ్ గమనాన్ని మార్చేసింది. జట్టులోని ప్రతీ బౌలర్ ఓవర్కు 6 కంటే ఎక్కువ సగటుతో పరుగులు ఇవ్వడం జట్టును దెబ్బతీసింది.
సిరీస్ ఓటమి అనంతరం కెప్టెన్ శుభ్మన్ గిల్ మాట్లాడుతు: “మేము 45వ ఓవర్ వరకు విజయ రేసులోనే ఉన్నాం. కానీ బౌలింగ్ సమయంలో చివరి మూడు ఓవర్లలో ధారాళంగా పరుగులు ఇవ్వడమే మా కొంపముంచింది. అలాగే రన్ చేజ్లో 40 ఓవర్ల తర్వాత చేతిలో వికెట్లు ఉండి ఉంటే ఖచ్చితంగా గెలిచేవాళ్ళం. వరుసగా వికెట్లు కోల్పోవడం, మిడిలార్డర్ విఫలం కావడం ఓటమికి ప్రధాన కారణం. వికెట్ కూడా కాస్త నెమ్మదించింది. రోహిత్ భాయ్ ఆడిన 138 పరుగుల అద్భుత ఇన్నింగ్స్ మమ్మల్ని మ్యాచ్లో నిలబెట్టింది, ఈ మ్యాచ్ గెలిచి ఉంటే ఆ ఇన్నింగ్స్కు అసలైన గౌరవం దక్కేది” అని గిల్ పేర్కొన్నాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..