Shreyas Iyer : హిస్టరీ క్రియేట్ చేసిన శ్రేయస్ అయ్యర్.. ముగ్గురు దిగ్గజాల రికార్డులపై కన్నేసిన పంజాబ్ కెప్టెన్

Shreyas Iyer : ఐపీఎల్ చరిత్రలో కెప్టెన్‌గా 3000 పరుగులు పూర్తి చేసిన ఆరో ఆటగాడిగా శ్రేయస్ అయ్యర్ అరుదైన రికార్డు సృష్టించి విరాట్ కోహ్లీ, ధోనీ సరసన నిలిచారు. ఐపీఎల్ హిస్టరీలో మూడు వేర్వేరు ఫ్రాంచైజీలను ఫైనల్‌కు నడిపించిన ఏకైక కెప్టెన్‌గా అయ్యర్ చరిత్ర సృష్టించాడు.

Shreyas Iyer : హిస్టరీ క్రియేట్ చేసిన శ్రేయస్ అయ్యర్.. ముగ్గురు దిగ్గజాల రికార్డులపై కన్నేసిన  పంజాబ్ కెప్టెన్
Shreyas Iyer

Updated on: May 24, 2026 | 8:23 AM

Shreyas Iyer : ఐపీఎల్ 2026 సీజన్ లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) పై పంజాబ్ కింగ్స్ సాధించిన అద్భుత విజయం కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కెరీర్‌లో ఒక మరుపురాని మైలురాయిగా నిలిచిపోయింది. ఈ మ్యాచ్‌లో మోహ్సిన్ ఖాన్ బౌలింగ్‌లో భారీ సిక్సర్‌తో మ్యాచ్‌ను ముగించడమే కాకుండా, తన ఐపీఎల్ కెరీర్‌లో తొలి సెంచరీని కూడా నమోదు చేశాడు. ఈ అద్భుత ఇన్నింగ్స్ ద్వారా శ్రేయస్ అయ్యర్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత అరుదైన, ప్రతిష్టాత్మకమైన క్లబ్‌లో అడుగుపెట్టాడు. ఐపీఎల్ చరిత్రలో కెప్టెన్‌గా 3,000 పరుగులు పూర్తి చేసిన ఆరో రథసారథిగా అయ్యర్ సరికొత్త రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు లీగ్ లో అత్యుత్తమ కెప్టెన్లుగా పేరొందిన విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మ వంటి దిగ్గజాల సరసన ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ పేరు కూడా చేరిపోయింది.

మూడు వేర్వేరు ఫ్రాంచైజీలను ఫైనల్‌కు చేర్చిన ఏకైక కెప్టెన్ శ్రేయస్ అయ్యర్

శ్రేయస్ అయ్యర్ కేవలం బ్యాటింగ్‌లోనే కాకుండా తన అద్భుతమైన కెప్టెన్సీతో ఐపీఎల్ చరిత్రలో ఒక ప్రత్యేకమైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్ హిస్టరీలో మూడు వేర్వేరు ఫ్రాంచైజీలను (ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్) ఫైనల్‌కు నడిపించిన ఏకైక కెప్టెన్‌గా అయ్యర్ చరిత్ర సృష్టించాడు. అతను కెప్టెన్‌గా ఆడిన 99 ఇన్నింగ్స్‌లలో 3,058 పరుగులు సాధించాడు. ఇందులో పంజాబ్ కింగ్స్ తరఫున ఆడిన కేవలం 30 ఇన్నింగ్స్‌లలోనే 1,000 కి పైగా పరుగులు రాబట్టగా, కేకేఆర్ తరఫున రెండు సీజన్లలో 752 పరుగులు సాధించి జట్టును ముందుండి నడిపించాడు.

విరాట్ కోహ్లీ టాప్.. జస్ట్ 6 పరుగుల దూరంలో ఆగిపోయిన రికార్డు

ఐపీఎల్‌లో కెప్టెన్‌గా అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రన్ మెషిన్ విరాట్ కోహ్లీ 4,994 పరుగులతో (142 ఇన్నింగ్స్‌లు) అందరికంటే అగ్రస్థానంలో ఉన్నాడు. 2011 నుంచి 2023 వరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన కోహ్లీ, కేవలం 6 పరుగుల దూరంలో కెప్టెన్‌గా 5000 పరుగుల మార్కును అందుకోలేకపోయాడు. ముఖ్యంగా 2016 సీజన్ లో కోహ్లీ కెప్టెన్‌గా ఏకంగా 973 పరుగులు చేసి సృష్టించిన రికార్డు నేటికీ చెక్కుచెదరకుండా ఉంది. ఇక ఈ జాబితాలో మిస్టర్ కూల్ ఎంఎస్ ధోనీ 204 ఇన్నింగ్స్‌లలో 4,753 పరుగులతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ధోనీ చెన్నై సూపర్ కింగ్స్ తో పాటు రైజింగ్ పూణే సూపర్‌జైంట్స్ జట్టుకు కూడా కెప్టెన్‌గా వ్యవహరించాడు.

మూడు, నాలుగు స్థానాల్లో రోహిత్, గంభీర్

ఈ ప్రతిష్టాత్మక జాబితాలో ముంబై ఇండియన్స్‌ను ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిపిన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ 157 ఇన్నింగ్స్‌లలో 3,986 పరుగులతో మూడో స్థానంలో ఉన్నాడు. రోహిత్ ముంబై ఇండియన్స్ జట్టుకు కెప్టెన్‌గాను, బ్యాటర్‌గాను ఎన్నో అద్భుత విజయాలను అందించాడు. అలాగే కోల్‌కతా నైట్ రైడర్స్‌కు రెండుసార్లు ఐపీఎల్ కప్పులు అందించిన మాజీ కెప్టెన్ గౌతమ్ గంభీర్ 127 ఇన్నింగ్స్‌లలో 3,518 పరుగులతో నాలుగో స్థానంలో నిలిచాడు. గంభీర్ కేకేఆర్ తో పాటు ఢిల్లీ డెర్‌డెవిల్స్ (ప్రస్తుత ఢిల్లీ క్యాపిటల్స్) జట్టుకు కూడా కెప్టెన్‌గా సేవలందించాడు.

ఐదో స్థానంలో ఆసీస్ లెజెండ్

భారతదేశానికి చెందిన ఐదుగురు దిగ్గజ కెప్టెన్ల మధ్యలో విదేశీ ఆటగాడిగా సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ రికార్డు సృష్టించాడు. వార్నర్ ఐపీఎల్‌లో కెప్టెన్‌గా ఆడిన 83 ఇన్నింగ్స్‌లలోనే ఏకంగా 3,356 పరుగులు సాధించి ఐదో స్థానంలో నిలిచాడు. వార్నర్ ఎస్‌ఆర్‌హెచ్ జట్టును 2016లో విజేతగా నిలపడమే కాకుండా, ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు కూడా కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక పరుగులు (6,565) చేసిన విదేశీ ఆటగాడిగా రికార్డు సృష్టించిన వార్నర్, కెప్టెన్‌గా కూడా అత్యధిక రన్స్ చేసిన ఓవర్సీస్ ప్లేయర్‌గా చరిత్ర పుటల్లో నిలిచాడు.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us