
Shocking Incident : ఐసీసీ మహిళల క్రికెట్ ప్రపంచ కప్ మ్యాచ్ కోసం ఇండోర్కు వచ్చిన ఆస్ట్రేలియా మహిళల జట్టు క్రికెటర్లకు చేదు అనుభవం ఎదురైంది. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఒక మోటార్సైకిల్పై వచ్చిన వ్యక్తి, ఆస్ట్రేలియాకు చెందిన ఇద్దరు క్రికెటర్లను వేధించడంతో పాటు, వారిలో ఒకరిని లైంగికంగా వేధించిన సంఘటన కలకలం సృష్టించింది. ఈ ఘటన గురువారం ఉదయం ఖజ్రానా రోడ్లో జరిగిందని, జట్టు ఫిర్యాదు మేరకు నిందితుడిని పోలీసులు తక్షణమే అరెస్టు చేశారు. దేశంలో కీలకమైన ప్రపంచ కప్ టోర్నమెంట్ జరుగుతున్న సమయంలో విదేశీ క్రీడాకారిణుల పట్ల ఇలాంటి దుశ్చర్య జరగడం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఐసీసీ మహిళల క్రికెట్ ప్రపంచ కప్లో పాల్గొనేందుకు ఇండోర్కు వచ్చిన ఆస్ట్రేలియా మహిళా జట్టుకు చెందిన ఇద్దరు క్రికెటర్లు గురువారం ఉదయం ఈ వేధింపులను ఎదుర్కొన్నారు. ఖజ్రానా రోడ్ వెంబడి ఉన్న హోటల్ నుండి బయటికి వచ్చి సమీపంలోని ఒక కేఫ్కు నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. మోటార్సైకిల్పై వచ్చిన ఒక వ్యక్తి వారిని వెంబడించడం ప్రారంభించాడు. ఆ తర్వాత వారిలో ఒక క్రికెటర్ను అనుచితంగా తాకి అక్కడి నుంచి పారిపోయాడు.
ఆటగాళ్లు వెంటనే తమ జట్టు భద్రతా అధికారి డానీ సిమ్మన్స్కు ఈ విషయం తెలియజేశారు. ఆయన వెంటనే స్థానిక భద్రతా అధికారులను సంప్రదించి, వారికి సహాయం అందించడానికి వాహనాన్ని ఏర్పాటు చేశారు. ఘటన గురించి ఫిర్యాదు అందిన వెంటనే ఏసీపీ హిమానీ మిశ్రా ఆటగాళ్లను కలిసి వారి వాంగ్మూలాలను నమోదు చేశారు. చట్టపరమైన చర్యలు ప్రారంభించారు.
ఎంఐజీ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ సమయంలో దగ్గరలో ఉన్న ఒక వ్యక్తి ఆ మోటార్సైకిల్ రిజిస్ట్రేషన్ నంబర్ను నోట్ చేసుకున్నాడు. ఈ నంబర్ ఆధారంగా పోలీసులు నిందితుడైన అఖిల్ ఖాన్ను శుక్రవారం నాడు గుర్తించి అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఖాన్పై గతంలో కూడా క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఈ ఘటనపై మరింత లోతుగా దర్యాప్తు జరుగుతోంది.
ఈ వార్త ఆస్ట్రేలియా జట్టు దక్షిణాఫ్రికాతో తమ చివరి గ్రూప్-దశ మ్యాచ్ ఆడటానికి కొన్ని గంటల ముందు వెలువడింది. ఈ మ్యాచ్ ఇండోర్లోని హోల్కర్ స్టేడియంలో జరగనుంది. ఇప్పటికే ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా రెండూ సెమీ-ఫైనల్కు అర్హత సాధించాయి. అయితే, ఈరోజు జరిగే మ్యాచ్ ఫలితం గ్రూప్-ఏలో టేబుల్ టాపర్ను నిర్ణయిస్తుంది. ఆస్ట్రేలియా ప్రస్తుతం 11 పాయింట్లతో గ్రూప్లో అగ్రస్థానంలో ఉంది. దక్షిణాఫ్రికా 10 పాయింట్లతో రెండవ స్థానంలో ఉంది. దక్షిణాఫ్రికా మహిళల జట్టు గెలిస్తే, వారు అగ్రస్థానంలో నిలుస్తారు.. లేదంటే ఆస్ట్రేలియానే టేబుల్ టాపర్గా కొనసాగుతుంది. ఈ మ్యాచ్ భారత మహిళల జట్టుకు కూడా చాలా కీలకం, ఎందుకంటే గ్రూప్ ఛాంపియన్గా నిలిచిన జట్టుతోనే భారత జట్టు సెమీ-ఫైనల్లో తలపడుతుంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..