Video: కోచ్తో గొడవ.. పైపైకి దూసుకెళ్లిన టీమిండియా ఆటగాళ్లు జడేజా కుల్దీప్ సిరాజ్! కారణం ఏంటంటే..?
భారత్, ఇంగ్లాండ్ మధ్య టెస్ట్ సిరీస్కు ముందు టీమిండియా ప్రాక్టీస్ సెషన్లో ఆటగాళ్ళు ఫీల్డింగ్ కోచ్తో గొడవ పడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అయింది. అయితే, ఇది సరదాగా జరిగిన విషయం అని తెలుస్తోంది. ఈ లోగా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ జట్టుతో చేరి సన్నాహాలను పర్యవేక్షిస్తున్నారు.

రేపటి (శుక్రవారం జూన్ 20) నుంచి భారత్, ఇంగ్లాండ్ మధ్య టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. గత కొన్ని రోజులుగా టీమిండియా ఈ సిరీస్ కోసం రెడీ అవుతోంది. ఇప్పటికే హెడింగ్లీలో భారత ఆటగాళ్లు ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. అయితే.. ఈ ప్రాక్టీస్ సెషన్లో అందరినీ షాక్కు గురిచేసే ఒక సంఘటన చోటు చేసుకుంది. అదేంటంటే.. టీమిండియాలోని కొంతమంది ఆటగాళ్లు ఫీల్డింగ్ కోచ్తో గొడవకు దిగారు. దీనికి సంబంధించిన వీడియో సైతం వైరల్ అయింది. గత కొన్ని రోజులుగా బెకెన్హామ్లో ప్రాక్టీస్ చేస్తున్న టీమిండియా జూన్ 17 మంగళవారం లీడ్స్కు చేరుకుంది. మరుసటి రోజు అంటే జూన్ 18 బుధవారం టీమ్ ఈ గ్రౌండ్లో ప్రాక్టీస్ మొదలుపెట్టింది. నెట్స్లో బ్యాటింగ్, బౌలింగ్ ప్రాక్టీస్తో పాటు, ఆటగాళ్ళు ఫిట్నెస్, ఫీల్డింగ్ ప్రాక్టీస్లో పాల్గొన్నారు. ఈ ప్రాక్టీస్ సందర్భంగా కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, మొహమ్మద్ సిరాజ్తో సహా కొంతమంది ఆటగాళ్ళు భారత ఫీల్డింగ్ కోచ్ టీ.దిలీప్తో వాదించుకుంటూ కనిపించారు.
ప్రాక్టీస్ మధ్యలో అకస్మాత్తుగా కుల్దీప్, జడేజా ఏదో విషయంలో కోపంగా ఉండి బిగ్గరగా అరుస్తూ కనిపించారు. సిరాజ్, అర్ష్దీప్ సింగ్ కూడా వారితో ఉన్నారు. ఈ నలుగురూ ఫీల్డింగ్ కోచ్ దిలీప్ వైపు దూసుకెళ్లారు. దిలీప్ కూడా వారికి ఏదో వివరిస్తూ కనిపించాడు. ఇంతలో చాలా మంది ఆటగాళ్ళు కోచ్ను చుట్టుముట్టారు. అక్కడ వాగ్వాదం జరుగుతున్నట్లు అనిపించింది. అయితే వాళ్లంతా ప్రాక్టీస్ రూల్స్ విషయంలో సరదాగా వాదించుకుంటున్నారు. వాస్తవానికి, ఫీల్డింగ్ ప్రాక్టీస్ సమయంలో ఇలాంటి సరదాగా సంఘటనలు తరచుగా జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఆటగాళ్లను రెండు గ్రూపులుగా విభజించి వారి మధ్య పోటీలు నిర్వహిస్తారు. అందుకే జడేజా, కుల్దీప్, సిరాజ్ గ్రూప్ తమకు ఏదో అన్యాయం జరిగిందని సరదాగా దిలీప్తో గొడవకు దిగారు.
టీమ్తో జాయిన్ అయిన హెడ్ కోచ్ గంభీర్
ఈ సరదా సంఘటనతో పాటు టీమిండియా ఒక ఉపశమనం కలిగించే విషయం ఏంటంటే.. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ జట్టులో చేరారు. లీడ్స్లో జరిగిన ఈ శిక్షణలో ఆయన పాల్గొన్నారు. ఆయన పర్యవేక్షణలో ఆటగాళ్లు తమ సన్నాహాలను మరింత పదును పెట్టారు. గంభీర్ కొన్ని రోజుల క్రితం తన తల్లికి గుండెపోటు రావడంతో అకస్మాత్తుగా భారతదేశానికి తిరిగి వచ్చారు. ఆమె పరిస్థితి మెరుగుపడినప్పుడు, గంభీర్ మళ్ళీ ఇంగ్లాండ్కు తిరిగి వచ్చారు.
Team India ke fun kalesh over throwing session 🤣🤣 pic.twitter.com/TI5px9SZBr
— Subhayan Chakraborty (@CricSubhayan) June 18, 2025
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




