IND vs SA: సూర్య, గంభీర్ తీసుకున్న ఈ ఒక్క నిర్ణయమే.. టీమిండియా ఓటమికి కారణం: అశ్విన్
Team India: గ్రూప్ దశలో భారత జట్టు వరుస విజయాలతో సూపర్ 8 చేరుకుంది. అయితే, సూపర్ 8లో తొలి మ్యాచ్లోనే పరాజయం పాలైంది. దీంతో సెమీస్ చేరే అవకాశాలు దిగజారాయి. అయితే, సౌతాఫ్రికాతో ఓటమి వెనుక టీమిండియా మాజీ ప్లేయర్ అశ్విన్ కీలక విషయాలు బయటపెట్టాడు.

IND vs SA: టీ20 వరల్డ్ కప్ 2026లో ఒక్క ఓటమి తర్వాత పరిస్థితులు ఎంత వేగంగా మారతాయో టీమిండియా అనుభవించింది. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో 76 పరుగుల భారీ ఓటమి తర్వాత భారత్ తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితిలోకి వెళ్లింది. ఈ ఓటమికి కారణమైన వ్యూహాత్మక తప్పును మాజీ భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ బహిర్గతం చేశాడు. ఈ మ్యాచ్లో వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్ను పక్కన పెట్టి వాషింగ్టన్ సుందర్ను ప్లేయింగ్ XIలోకి తీసుకోవడమే ప్రధాన తప్పిదమని అశ్విన్ అభిప్రాయపడ్డాడు.
“మనం టాక్టికల్గా ఓడిపోయాం. సుందర్ను ఆడిస్తే, అతడిని ఎడమచేతి బ్యాటర్లపై ఉపయోగించాల్సింది. క్వింటన్ డికాక్, ర్యాన్ రికెల్టన్ ఇద్దరూ తొందరగానే ఔట్ అయ్యారు. డేవిడ్ మిల్లర్పై ఒక ఓవర్లో 11 పరుగులు ఇచ్చాడు – ఇది సహజమే. కానీ అతడు క్రమం తప్పకుండా ఆడటం లేదు. తర్వాత అతడిని బౌలింగ్ నుంచి తొలగించారు. ఫలితంగా ఒక స్పిన్నర్ను పూర్తిగా ఉపయోగించలేకపోయాం,” అని అశ్విన్ ‘ఆష్ కి బాత్’ కార్యక్రమంలో వ్యాఖ్యానించాడు.
అయితే, జస్ప్రీత్ బుమ్రా ప్రదర్శనను అశ్విన్ ఘనంగా ప్రశంసించాడు. నాలుగు ఓవర్లలో 15 పరుగులిచ్చి 3 వికెట్లు తీసిన బుమ్రా మ్యాచ్లో భారత్ తరఫున ఉత్తమ బౌలర్గా నిలిచాడు. “నాలుగు ఓవర్లలో కేవలం 15 పరుగులిచ్చి మూడు వికెట్లు తీసే బౌలర్ మీ వద్ద ఉంటే, అంతకంటే అదృష్టం ఏం ఉంటుంది? గొప్ప ఆటగాళ్ల విలువను వారు రిటైర్ అయిన తర్వాతే గుర్తిస్తాం,” అని అశ్విన్ చెప్పుకొచ్చాడు.
భారత్ నెట్ రన్ రేట్ (-3.80)పై అశ్విన్ పెద్దగా ఆందోళన వ్యక్తం చేయలేదు. ముందు మిగిలిన రెండు మ్యాచ్లను గెలవడమే ముఖ్యం అని సూచించాడు. “నెట్ రన్ రేట్ గురించి ఇప్పుడే ఆందోళన అవసరం లేదు. మిగిలిన రెండు మ్యాచ్ల్లో రెండింటినీ గెలవాలి. పరిస్థితులను గౌరవిస్తూ కొంత సమయం తీసుకుని బ్యాటింగ్ చేయాలి. ఇది యువ జట్టు – ఒత్తిడిని మెరుగ్గా హ్యాండిల్ చేయాలి. హార్దిక్, రింకు ఉన్నారు. భాగస్వామ్యాలు కట్టి వారికి వేదిక సిద్ధం చేయాలి. అనవసరంగా తొందరపడాల్సిన అవసరం లేదు,” అని సూచించాడు.
పరిస్థితులను గౌరవించాలి..
“జింబాబ్వేతో మ్యాచ్లో భారత్ మరింత మెరుగ్గా ఆడగలదని నమ్ముతున్నాను. కానీ రెండు విషయాలు గుర్తుంచుకోవాలి. ఐసీసీ ఇస్తున్న పిచ్లు బ్యాటర్లకే కాదు బౌలర్లకూ సహకరిస్తున్నాయి – పోటీ న్యాయంగా ఉంది. ద్వైపాక్షిక సిరీస్ల్లో మనకు అలవాటైన షాట్లను ఇక్కడ కూడా అదే విధంగా ఆడలేం. బ్యాటింగ్ యూనిట్గా కొంత సంయమనం అవసరం,” అని అశ్విన్ స్పష్టం చేశాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
