
PBKS vs MI : ఐపీఎల్ 2026 సీజన్ క్లైమాక్స్కు చేరుకుంది. ప్లే ఆఫ్స్ రేసు ఉత్కంఠగా మారుతున్న వేళ, గురువారం ధర్మశాలలోని అందమైన హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (HPCA) స్టేడియంలో పంజాబ్ కింగ్స్ (PBKS), ముంబై ఇండియన్స్ (MI) తలపడనున్నాయి. శ్రేయాస్ అయ్యర్ సారథ్యంలోని పంజాబ్ జట్టుకు ఈ మ్యాచ్ అత్యంత కీలకం. ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన ముంబై ఇండియన్స్, ఈ మ్యాచ్ గెలిచి పరువు నిలబెట్టుకోవాలని చూస్తోంది. రాత్రి 7:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమరంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
పంజాబ్కు తప్పనిసరి విజయం
పంజాబ్ కింగ్స్ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉన్నప్పటికీ, గత నాలుగు మ్యాచ్లలో వరుసగా ఓడిపోవడం ఆ జట్టును ఆందోళనకు గురిచేస్తోంది. ప్లే ఆఫ్స్ బెర్తును ఖరారు చేసుకోవాలంటే శ్రేయాస్ అయ్యర్ సేనకు కనీసం ఒక విజయం చాలా అవసరం. మరోవైపు, ముంబై ఇండియన్స్ ఈ సీజన్లో ఇప్పటికే ఇంటిదారి పట్టింది. హార్దిక్ పాండ్యా గాయం కారణంగా దూరం కావడంతో ఆ జట్టు మరింత బలహీనపడింది. అయినప్పటికీ, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ వంటి స్టార్లతో ముంబై ఏ క్షణమైనా పుంజుకునే అవకాశం ఉంది.
ముగియని హెడ్-టు-హెడ్ యుద్ధం..
గణాంకాల పరంగా చూస్తే ఈ రెండు జట్ల మధ్య పోరు ఎప్పుడూ రసవత్తరంగానే ఉంటుంది. ఇప్పటివరకు ఈ రెండు జట్లు 34 సార్లు తలపడగా, పంజాబ్ 17 సార్లు, ముంబై 17 సార్లు గెలిచి సమ ఉజ్జీలుగా నిలిచాయి. నేటి మ్యాచ్లో ప్రియాంశ్ ఆర్య వర్సెస్ జస్ప్రీత్ బుమ్రా మధ్య జరిగే పోరు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. అలాగే పవర్ ప్లేలో రోహిత్ శర్మను అడ్డుకోవడానికి పంజాబ్ పేసర్ అర్ష్దీప్ సింగ్ సిద్ధంగా ఉన్నాడు. శ్రేయాస్ అయ్యర్, ముంబై బౌలర్ కార్బిన్ బోష్ మధ్య జరిగే పోరు మిడిల్ ఓవర్లలో కీలకం కానుంది.
టాస్ గెలిచిన జట్టు ఏం చేస్తుంది?
ధర్మశాల పిచ్ సాధారణంగా బ్యాటింగ్కు బాగా సహకరిస్తుంది. ఇక్కడ బౌండరీ లైన్లు చిన్నవిగా ఉండటం వల్ల పరుగుల వర్షం కురిసే అవకాశం ఉంది. ఈ వేదికపై ఇప్పటివరకు జరిగిన 15 ఐపీఎల్ మ్యాచ్లలో 9 సార్లు మొదట బ్యాటింగ్ చేసిన జట్లే విజయం సాధించాయి. అయితే, రాత్రి పూట మ్యాచ్ కావడంతో మంచు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల రెండోసారి బౌలింగ్ చేసే వారికి బంతిపై పట్టు చిక్కడం కష్టమవుతుంది. అందుకే హిస్టరీకి భిన్నంగా, టాస్ గెలిచిన కెప్టెన్ బౌలింగ్ ఎంచుకునే అవకాశమే మెండుగా ఉంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..