Nepal Floods: ప్రకృతి ప్రకోపానికి 178 భారతీయులు బలి..సచిన్ టెండూల్కర్ ఆవేదన
Nepal Floods: నేపాల్ దేశాన్ని కుదిపేసిన భీకర వరదలు పెను విషాదాన్ని నింపాయి. ఈ విపత్తులో వందలాది మంది ప్రాణాలు కోల్పోగా, వివిధ దేశాలకు చెందిన 540 మంది ఆచూకీ గల్లంతైంది. ఇందులో అత్యధికంగా 178 మంది భారతీయ పర్యాటకులు ఉండటంతో కుటుంబ సభ్యులలో తీవ్ర ఆందోళన నెలకొంది.

Nepal Floods: హిమాలయ దేశమైన నేపాల్లో కురిసిన భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు సర్వం ధ్వంసం చేశాయి. ఎటు చూసినా నీట మునిగిన ఇండ్లు, కొండచర్యలు విరిగిపడిన దృశ్యాలు భయానకంగా మారాయి. ఈ ఘోర విపత్తులో ఇప్పటివరకు సుమారు 392 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారిక సమాచారం వెల్లడించింది. వరద ఉధృతికి రోడ్లు కొట్టుకుపోవడంతో సహాయక చర్యలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది.
భారతీయుల గల్లంతుతో ఆందోళన
నేపాల్ టూరిజం బోర్డు అందించిన వివరాల ప్రకారం వరద ప్రవాహానికి 31 దేశాలకు చెందిన 540 మంది విదేశీ పర్యటకులు గల్లంతయ్యారు. వీరిలో అత్యధికంగా 178 మంది భారతీయులు ఉండటం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. పొరుగు దేశానికి విహారయాత్రకు వెళ్లిన తమ వారు క్షేమంగా ఉన్నారా లేదా అని తెలుసుకోవడానికి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఇప్పటివరకు వివిధ దేశాలకు చెందిన కేవలం 31 మంది విదేశీయులను మాత్రమే రెస్క్యూ టీమ్స్ రక్షించగలిగాయి.
సచిన్ టెండూల్కర్ భావోద్వేగ స్పందన
ఈ విపత్కర పరిస్థితులపై భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా ఆయన స్పందిస్తూ బాధితులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఒక వ్యక్తి సురక్షితంగా ఉన్నారా లేదా అని తెలియని ఆ అభద్రతాభావం చాలా భయంకరమైనదని ఆయన పేర్కొన్నారు. గల్లంతైన వారి ఆచూకీ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న సహాయక సిబ్బందికి ధైర్యం చెప్పారు. బాధితుల క్షేమం కోరుతూ ఆయన చేసిన ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.
There is perhaps no greater uncertainty than not knowing whether someone you love is safe. My heart goes out to all the families affected by the devastating floods in Nepal, especially those still waiting for news. Praying for their loved ones and for the rescue teams working…
— Sachin Tendulkar (@sachin_rt) August 27, 2026
ముమ్మరంగా కొనసాగుతున్న సహాయక చర్యలు
వరద తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో రక్షణ చర్యలను వేగవంతం చేశారు. నేపాల్ ప్రభుత్వంతో పాటు విదేశీ దౌత్య కార్యాలయాలు సమన్వయం చేసుకుంటూ గల్లంతైన వారిని వెతికే పనిలో నిమగ్నమయ్యాయి. రాకపోకలు పూర్తిగా దెబ్బతిన్న ప్రాంతాలకు హెలికాప్టర్ల ద్వారా ఆహారం, మందులు అందిస్తున్నారు. నేపాల్ వరదల్లో చిక్కుకున్న భారతీయుల క్షేమ సమాచారం కోసం వారి కుటుంబాలు ఎదురుచూస్తున్నాయి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
