Duleep Trophy 2026: గురూజీ ఆశీస్సులు దక్కేశాయిగా.. వికెట్ పడగొట్టి షమీ కాళ్లు పట్టుకున్న యంగ్ స్టర్
Duleep Trophy 2026: దులీప్ ట్రోఫీ 2026 మొదటి సెమీఫైనల్ పోరులో ఈస్ట్ జోన్ వేగవంతమైన బౌలర్లు మహమ్మద్ షమీ, ముకేశ్ కుమార్ కలిసి నిప్పులు చెరిగే బౌలింగ్తో విరుచుకుపడ్డారు. వీరిద్దరి ధాటికి సెంట్రల్ జోన్ జట్టు రెండో ఇన్నింగ్స్లో కేవలం 158 పరుగులకే కుప్పకూలగా, మ్యాచ్లో వికెట్ తీశాక సీనియర్ షమీ కాళ్లకు ముకేశ్ దండం పెట్టడం సోషల్ మీడియాను ఊపేస్తోంది.

Duleep Trophy 2026: దులీప్ ట్రోఫీ తొలి సెమీఫైనల్ మ్యాచ్లో ఈస్ట్ జోన్ పేస్ ద్వయం మహమ్మద్ షమీ, ముకేశ్ కుమార్ ప్రత్యర్థి బ్యాటర్లకు చుక్కలు చూపించారు. స్వింగ్, అద్భుత సీమ్తో ప్రత్యర్థి పతనాన్ని శాసించారు. మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో సెంట్రల్ జోన్ను 266 పరుగులకు నిరోధించిన ఈ జోడీ, రెండో ఇన్నింగ్స్లో మరింత ప్రమాదకరంగా మారింది. ఈ మ్యాచ్ మొత్తంలో షమీ, ముకేశ్ ఇద్దరూ కలిసి ఏకంగా 12 వికెట్లు తమ ఖాతాలో వేసుకుని జట్టుకు కొండంత బలాన్ని ఇచ్చారు.
తొలి ఇన్నింగ్స్లో షమీ రెండు వికెట్లు, ముకేశ్ మూడు వికెట్లు తీసి పట్టు బిగించారు. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్లో ముకేశ్ కుమార్ 12 ఓవర్లలో కేవలం 44 పరుగులు ఇచ్చి 4 కీలక వికెట్లు నేలకూల్చారు. మరోవైపు సీనియర్ షమీ 3 వికెట్లతో మెరిశారు. మిగిలిన వికెట్లను అభిజీత్ సర్కార్, అనుకూల్ రాయ్, కునైన్ ఖురేషి తలా ఒక వికెట్తో పంచుకోవడంతో సెంట్రల్ జోన్ తక్కువ స్కోరుకే పరిమితమైంది.
ఈ పోరులో ఒక మరచిపోలేని మధుర ఘట్టం ఆవిష్కృతమైంది. సెంట్రల్ జోన్ కెప్టెన్ రజత్ పాటిదార్ రెండు ఇన్నింగ్స్ల్లోనూ ముకేశ్ కుమార్ వేసిన లోపలికి వచ్చే బంతికి ప్లేడ్ ఆన్ అయి బౌల్డ్ అయ్యారు. తొలి ఇన్నింగ్స్లో 12, రెండో ఇన్నింగ్స్లో 5 పరుగులకే ఆయన వెనుదిరిగారు. రెండో ఇన్నింగ్స్లో పాటిదార్ వికెట్ పడగొట్టిన వెంటనే ముకేశ్ కుమార్ ఆనందంతో మైదానంలోనే తన సీనియర్ బౌలర్ షమీ కాళ్లను తాకి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ వీడియో నెట్టింట బాగా వైరల్ అవుతోంది.
రెండో ఇన్నింగ్స్లో 158 పరుగులకే ఆలౌట్ అయిన సెంట్రల్ జోన్ బ్యాటర్లలో ఎవరూ నిలకడగా ఆడలేకపోయారు. కేవలం 37 పరుగులకే 3 వికెట్లు, 95 పరుగులకు 7 వికెట్లు కోల్పోయి ఘోరమైన స్థితిలో పడింది. ఆ జట్టులో అమన్ మోఖాడే 41 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా, ఆఖరిలో హర్ష్ దూబే 24, అర్షద్ ఖాన్ 25 పరుగులు చేసి జట్టు స్కోరును 150 దాటించారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
