Team India: ‘సఫారీలతో మ్యాచ్ ఓడిపోవడానికి అతడే కారణం.. టీమిండియాకి వెన్నుపోటు పొడిచాడుగా’
దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 ప్రపంచకప్ మ్యాచ్లో టీమిండియా ఓటమికి బౌలింగ్ కోచ్ మోర్నీ మార్కెలే కారణమంటూ అభిమానులు మండిపడుతున్నారు. దక్షిణాఫ్రికాకు కీలక సమాచారం చేరవేశాడని, గూఢచారిగా వ్యవహరించాడని ఆరోపణలు చేస్తున్నారు. ఈ విషయమై సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఆ వివరాలు ఇలా..

టీ20 ప్రపంచకప్ సూపర్ 8లో భాగంగా టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య జరిగిన మ్యాచ్ తీవ్ర చర్చనీయాంశమైంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో టీమిండియాపై దక్షిణాఫ్రికా 76 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. టీమిండియా ఈ మ్యాచ్లో దారుణంగా ఓడిపోవడంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. మ్యాచ్ ఓటమికి గల కారణాలపై చర్చ మొదలుపెట్టిన అభిమానులు, టీమిండియా బౌలింగ్ కోచ్ మోర్నీ మార్కెల్పై తీవ్ర ఆరోపణలు గుప్పిస్తున్నారు.
సోషల్ మీడియాలో మోర్నీ మార్కెల్ను లక్ష్యంగా చేసుకుని అనేక పోస్టులు వైరల్ అవుతున్నాయి. మోర్నీ మార్కెల్ దక్షిణాఫ్రికాతో చేతులు కలిపి టీమిండియాకు వెన్నుపోటు పొడిచాడని, గూఢచారిగా వ్యవహరించాడని అభిమానులు ఆరోపిస్తున్నారు. ఇండియాకు సేవలు అందిస్తూనే, తన స్వదేశమైన దక్షిణాఫ్రికాకు అనుకూలంగా వ్యవహరించాడని మండిపడుతున్నారు. టీమిండియా బలహీనతలను, వ్యూహాలను దక్షిణాఫ్రికా జట్టుకు చేరవేశాడని తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఆరోపణలకు బలం చేకూర్చుతూ, దక్షిణాఫ్రికాకు స్పెషల్ కోచ్గా ఉన్న మోర్నీ మార్కెల్ సోదరుడు అల్బి మార్కెల్ పేరు కూడా తెరపైకి వచ్చింది. అల్బి మార్కెల్ కోసం మోర్నీ మార్కెల్ టీమిండియా బలహీనతలను మొత్తం దక్షిణాఫ్రికాకు చేరవేశాడని అభిమానులు పోస్టులు పెడుతున్నారు. ఇలా ఈ ఇద్దరు అన్నదమ్ములు కలిసి ఇండియాను ఓడించారని సోషల్ మీడియాలో కొత్త చర్చ మొదలైంది. ప్రస్తుతం మోర్నీ మార్కెల్ను అందరూ టార్గెట్ చేస్తున్నారు.
టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, కోచ్ గౌతమ్ గంభీర్తో మోర్నీ మార్కెల్ డగౌట్లో కూర్చుని చర్చిస్తున్న ఫోటో ఒకటి ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ ఫోటోను కూడా అభిమానులు తమ వాదనకు ఉపయోగిస్తున్నారు. మోర్నీ మార్కెల్ నియామకం 2024లో జరిగింది. గౌతమ్ గంభీర్ కోచ్గా బాధ్యతలు చేపట్టిన సమయంలో దక్షిణాఫ్రికాకు చెందిన మోర్నీ మార్కెల్కు బౌలింగ్ కోచ్గా బాధ్యతలు అప్పగించారు. మోర్నీ మార్కెల్ 2027 వన్డే ప్రపంచకప్ వరకు టీమిండియాకు తన సేవలను అందించనున్నాడు. అయితే, ఇప్పటివరకు అతని సేవలు టీమిండియాకు మంచి ఫలితాలనే ఇచ్చాయని రికార్డులు చెబుతున్నాయి. కానీ దక్షిణాఫ్రికాతో జరిగిన నిన్నటి మ్యాచ్ తర్వాత మోర్నీ మార్కెల్ అనూహ్యంగా విమర్శలకు, ఆరోపణలకు గురవుతున్నాడు.
