Kartik Sharma : 21 ఏళ్ల క్రితం ధోనీ చేసిన సెలబ్రేషన్‌ను రిపీట్ చేసిన కార్తీక్ శర్మ.. సోషల్ మీడియాలో వైరల్

Kartik Sharma : ముంబై ఇండియన్స్‌పై హాఫ్ సెంచరీ చేసిన కార్తీక్ శర్మ ధోనీ స్టైల్‌లో 'గన్ సెలబ్రేషన్' చేసి అదరగొట్టాడు. ఈ సెలబ్రేషన్ వెనుక ఉన్న అసలు కారణాన్ని మ్యాచ్ తర్వాత వెల్లడించాడు. 160 పరుగుల లక్ష్య ఛేదనలో సీఎస్‌కే కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 18.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని అందుకుంది.

Kartik Sharma : 21 ఏళ్ల క్రితం ధోనీ చేసిన సెలబ్రేషన్‌ను రిపీట్ చేసిన కార్తీక్ శర్మ.. సోషల్ మీడియాలో వైరల్
Ms Dhoni

Updated on: May 03, 2026 | 1:19 PM

Kartik Sharma : ఐపీఎల్ 2026లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఘనవిజయం సాధించింది. ఈ గెలుపులో హీరోగా నిలిచిన 20 ఏళ్ల యువ సంచలనం కార్తీక్ శర్మ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాడు. తన తొలి ఐపీఎల్ హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్న తర్వాత అతను చేసిన గన్ సెలబ్రేషన్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇది అచ్చం టీమిండియా మాజీ సారథి ఎంఎస్ ధోనీ స్టైల్‌ను గుర్తుకు తెచ్చింది. ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో కార్తీక్ శర్మ కేవలం 40 బంతుల్లో 54 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. తన హాఫ్ సెంచరీ మార్కును అందుకున్న వెంటనే, అతను బ్యాట్‌ను తుపాకీలా పట్టుకుని గన్ సెలబ్రేషన్ చేశాడు. సరిగ్గా 2005లో శ్రీలంకపై ధోనీ 183 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడినప్పుడు ఇలాగే సెలబ్రేట్ చేసుకున్నాడు. ఇప్పుడు 21 ఏళ్ల తర్వాత అదే జట్టులో ఉన్న కార్తీక్, తన ఆరాధ్య దైవం ధోనీ కళ్ళ ముందే ఆ వేడుకను పునరావృతం చేయడం విశేషం.

మ్యాచ్ ముగిసిన తర్వాత ఈ సెలబ్రేషన్ గురించి కార్తీక్ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. “ఇది నా కెరీర్‌లో తొలి ఐపీఎల్ హాఫ్ సెంచరీ. ఈ రోజు గనుక నేను పరుగులు సాధిస్తే, కచ్చితంగా ధోనీ సర్ స్టైల్‌లో సెలబ్రేట్ చేసుకోవాలని ముందే నిర్ణయించుకున్నాను. అదే చేశాను” అని కార్తీక్ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. డ్రెస్సింగ్ రూమ్‌లో ధోనీతో సమయం గడపడం, ఆయన నుంచి టిప్స్ తీసుకోవడం తన బ్యాటింగ్‌ను మెరుగుపరిచిందని అతను తెలిపాడు.

ఒకవైపు వికెట్లు పడుతున్నా, కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌తో కలిసి కార్తీక్ అద్భుతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 98 పరుగులు జోడించి జట్టును విజయతీరాలకు చేర్చారు. “రుతు భయ్యా నాతో ఒకటే చెప్పాడు.. నీ సహజ సిద్ధమైన ఆటను ఆడు, కొత్తగా ఏమీ ట్రై చేయవద్దు. చివరి వరకు క్రీజులో ఉండి మ్యాచ్ ఫినిష్ చేద్దాం అన్నాడు. అదే మమ్మల్ని గెలిపించింది” అని కార్తీక్ చెప్పుకొచ్చాడు. రుతురాజ్ 67 పరుగులతో అజేయంగా నిలిచి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.

160 పరుగుల లక్ష్య ఛేదనలో సీఎస్‌కే కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 18.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని అందుకుంది. ఈ విజయంతో సీఎస్‌కే పాయింట్ల పట్టికలో పైకి ఎగబాకగా, ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్ రేసు నుంచి దాదాపు నిష్క్రమించింది. కార్తీక్ శర్మ వంటి యువ ఆటగాళ్లు ఒత్తిడిలోనూ అద్భుతంగా రాణిస్తుండటంతో ధోనీ సేన ఈ సీజన్‌లో టైటిల్ దిశగా దూసుకుపోతోంది.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us