
IPL 2026 Tragedy: ముల్లంపూర్ వేదికగా మంగళవారం రాత్రి పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన పోరులో పరుగుల సునామీ కురిసింది. సిక్సర్లు, ఫోర్ల వర్షంతో స్టేడియం హోరెత్తిపోయింది. అయితే, ఈ ఉత్సాహం మధ్య ఒక విషాదకర సంఘటన చోటుచేసుకుంది. మైదానంలో ఆటగాళ్లు బాదుతున్న సిక్సర్లు చూసి ఎంజాయ్ చేస్తున్న ఒక అభిమాని, అనుకోకుండా బంతి తగలడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ప్రమాదం ఒకవైపు ఆందోళన కలిగిస్తుంటే, అక్కడే ఉన్న కొందరు వ్యక్తుల ప్రవర్తన నెటిజన్లకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పిస్తోంది.
ములంపూర్లో ఏం జరిగింది?
పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన ఈ మ్యాచ్లో మొత్తం 26 సిక్సర్లు నమోదయ్యాయి. ఈ సిక్సర్ల సునామీలో ఒక బంతి నేరుగా గ్యాలరీలోకి వెళ్లి అక్కడ మ్యాచ్ చూస్తున్న ఒక అభిమాని కంటి పక్కన బలంగా తగిలింది. దీంతో అతని కంటి భాగం నుంచి విపరీతంగా రక్తం కారడం మొదలైంది. రక్తంతో తడిసిన చొక్కాతో ఉన్న ఆ అభిమానిని వెంటనే ప్రాథమిక చికిత్స అందించి ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన ఏ బ్యాటర్ కొట్టిన షాట్ వల్ల జరిగిందనేది స్పష్టంగా తెలియకపోయినా, ఈ వీడియో ఇప్పుడు వైరల్గా మారింది. అయితే గాయపడిన వ్యక్తి పక్కనే ఉన్న ఒక వ్యక్తి నవ్వుతూ కనిపించడం నెటిజన్లకు ఆగ్రహం తెప్పిస్తోంది.
పంజాబ్ కింగ్స్ భారీ స్కోరు
ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 222 పరుగుల భారీ స్కోరు సాధించింది. ప్రభసిమ్రన్ సింగ్ 59 పరుగులతో రాణించగా, ఆఖరిలో మార్కస్ స్టోయినిస్ విధ్వంసం సృష్టించాడు. కేవలం 22 బంతుల్లోనే 62 పరుగులు చేసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. రాజస్థాన్ బౌలర్లను ముప్పుతిప్పలు పెడుతూ పంజాబ్ బ్యాటర్లు సిక్సర్ల వర్షం కురిపించారు.
రాజస్థాన్ రాయల్స్ ఛేజింగ్
223 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్కు యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చాడు. కేవలం 16 బంతుల్లో 43 పరుగులు చేసి పంజాబ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఆ తర్వాత యశస్వి జైస్వాల్ 27 బంతుల్లో 51 పరుగులతో తన ఫామ్ను కొనసాగించాడు. మధ్యలో వికెట్లు పడినా, రాజస్థాన్ జట్టు ఏమాత్రం తలవంచకుండా లక్ష్యం దిశగా దూసుకుపోయింది.
A fan got injured after the ball hit near his eye during PBKS vs RR match, He was immediately taken to the hospital, and I hope his eye and nose will be fine.
But I’m furious to know why that guy in the white shirt was shamelessly laughing, as if he were watching any comedy show… pic.twitter.com/uYe4ARYI2G
— TEJASH (@Tejashyyyyy) April 28, 2026
రాజస్థాన్ చారిత్రాత్మక విజయం
చివర్లో డోనోవన్ ఫెరీరా 26 బంతుల్లో అజేయంగా 52 పరుగులు చేసి రాజస్థాన్ను గెలుపు తీరాలకు చేర్చాడు. అతనికి ఇంపాక్ట్ ప్లేయర్ శుభమ్ దూబే (12 బంతుల్లో 31 నాటౌట్) చక్కటి సహకారం అందించాడు. దీంతో ఈ సీజన్లో పంజాబ్ కింగ్స్ను ఓడించిన మొదటి జట్టుగా రాజస్థాన్ రాయల్స్ రికార్డు సృష్టించింది. 6 వికెట్ల తేడాతో రాజస్థాన్ అద్భుత విజయాన్ని అందుకుంది. అయితే ఈ గెలుపు సంబరాల కంటే, గాయపడిన అభిమాని పరిస్థితి గురించే ఇప్పుడు అందరూ చర్చిస్తున్నారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..