
Punjab Kings : ఐపీఎల్ 2026 వేట మొదలైంది. గత సీజన్లో తృటిలో చేజారిన టైటిల్ను ఈసారి ఎలాగైనా ముద్దాడాలని పంజాబ్ కింగ్స్ (Punjab Kings) కంకణం కట్టుకుంది. ఈ క్రమంలోనే జట్టు కొత్త హెడ్ కోచ్, ఆస్ట్రేలియా దిగ్గజం రికీ పాంటింగ్ రంగంలోకి దిగారు. చండీగఢ్ వేదికగా జరుగుతున్న ప్రాక్టీస్ క్యాంప్లో చేరిన పాంటింగ్, అడుగు పెట్టడమే ఆలస్యం ఆటగాళ్లకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. నెట్స్లో కేవలం బంతులు విసరడం, బ్యాట్ ఊపడం మాత్రమే సరిపోదని, మానసికంగా, శారీరకగా యుద్ధానికి సిద్ధం కావాలని కుండబద్దలు కొట్టారు.
మార్చి 31న న్యూ చండీగఢ్ వేదికగా గుజరాత్ టైటాన్స్తో పంజాబ్ కింగ్స్ తన తొలి మ్యాచ్ ఆడబోతుంది. ఈ నేపథ్యంలో రికీ పాంటింగ్ ఆటగాళ్లకు దిశానిర్దేశం చేశారు. “కేవలం నెట్స్లో సమయం గడపడం వల్ల ఎలాంటి ప్రయోజనం అనేది ఉండదు. టెక్నికల్ గా, ఫిజికల్ గా, అంతకంటే ముఖ్యంగా మెంటల్ గా మ్యాచ్కి సిద్ధంగా ఉండాలి” అని ఆయన తేల్చి చెప్పారు. ట్రైనింగ్ సెషన్లు అంటే కేవలం అలవాటు కోసం చేసేవి కాదని, మనల్ని మనం ఒక విజేతగా మలచుకునే సమయం అని గుర్తు చేశారు. జట్టులో ఐక్యత ఉంటేనే అద్భుతాలు జరుగుతాయని గతేడాది ప్రదర్శనను ఉదాహరణగా చూపారు.
క్రికెట్లో తప్పులు చేయడం సహజమని, కానీ పక్కా ప్రణాళికతో ఆడటం ముఖ్యమని పాంటింగ్ ప్లేయర్లకు హితబోధ చేశారు. ఎవరైనా క్యాచ్ వదిలేయవచ్చు లేదా బౌలర్ వైడ్ బాల్ వేయవచ్చు, అంత మాత్రాన కంగారు పడాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. ఒక ఆటగాడు తన గేమ్ ప్లాన్ మీద నమ్మకంతో ఉండి, సరైన ఆలోచనతో ఆడుతున్నప్పుడు పొరపాట్లు జరిగితే అది పెద్ద సమస్య కాదని ఆయన అభిప్రాయపడ్డారు. టోర్నమెంట్ ఫలితాల మీద ఒత్తిడి పెంచుకోకుండా, ప్రతి రోజూ అనుసరించే పద్ధతి మీద దృష్టి పెడితే సక్సెస్ ఆటోమేటిక్ గా వస్తుందని పాంటింగ్ భరోసా ఇచ్చారు.
గత ఐపీఎల్ సీజన్లో పంజాబ్ కింగ్స్ ఫైనల్ వరకు దూసుకెళ్లింది. కానీ, నిర్ణయాత్మక పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) చేతిలో కేవలం 6 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో ఆర్సీబీ తన తొలి ఐపీఎల్ టైటిల్ గెలుచుకోగా, పంజాబ్ కింగ్స్ నిరాశతో వెనుదిరగాల్సి వచ్చింది. ఆ చేదు జ్ఞాపకాలను చెరిపివేసి, ఈసారి టైటిల్ సాధించడమే లక్ష్యంగా పంజాబ్ అడుగులు వేస్తోంది. అందుకే ఈసారి జట్టు కూర్పులో కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు.
ఈసారి పంజాబ్ కింగ్స్ టీమ్ చాలా బలంగా కనిపిస్తోంది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో జట్టులో టాలెంటెడ్ ఆటగాళ్లు ఉన్నారు. బౌలింగ్లో అర్ష్దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్ ధాటిగా బంతులు వేయడానికి సిద్ధంగా ఉండగా.. మార్కస్ స్టోయినిస్, మార్కో జాన్సెన్ లాంటి ఆల్రౌండర్లు జట్టుకు వెన్నెముకగా నిలుస్తున్నారు. లోకీ ఫెర్గూసన్ వేగం, ప్రభ్సిమ్రాన్ సింగ్, నెహాల్ వధేరాల మెరుపులు జట్టుకు అదనపు బలం. ఇవన్నీ చూస్తుంటే ఐపీఎల్ 2026లో పంజాబ్ కింగ్స్ ఒక బలమైన టైటిల్ ఫేవరెట్గా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..