
ఐపీఎల్ 2026 మెగా సమరానికి సర్వంగా సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో ఈ సీజన్లో చివరి మ్యాచ్ మొదలుకానుంది. రెండో టైటిల్ కోసం రెండు జట్లు.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ రంకెలు వేస్తున్నాయి. మరి ఆ రెండో కప్పు ఎవరికి దక్కుతుందో ఈ రోజు తేలిపోనుంది. ఐపీఎల్లోకి ఎంట్రీ ఇచ్చిన తొలి సీజన్లోనే కప్పు కొట్టిన టీమ్ గుజరాత్ అయితే, 18 ఏళ్ల నిరీక్షణ తర్వాత కప్పును ముద్దాడిన టీమ్ ఆర్సీబీ. అలాంటి జట్ల మధ్య జరిగే ఈ పోరు కచ్చితంగా హోరాహోరీగా సాగనుంది. ఇప్పటికే ఈ సీజన్లో తొలి క్వాలిఫైయర్లో ఈ రెండు టీమ్స్ పోటీ పడగా ఆర్సీబీ విజయం సాధించి నేరుగా ఫైనల్గా దూసుకెళ్లింది.
మరోవైపు గుజరాత్ తొలి క్వాలిఫైయర్లో ఓడి గాయపడ్డ సింహాంలా రెండో క్వాలిఫైయర్లో ఆర్ఆర్ను చిత్తుచేసి మరోసారి ఆర్సీబీతో ఫైట్కు రెడీ అయింది. అయితే ఈ మ్యాచ్లో ఆర్సీబీనే హాట్ ఫేవరేట్గా బరిలోకి దిగుతోంది. పైగా ఆ జట్టు ఒక్క విషయంలో మాత్రం గట్టి నమ్మకంగా ఉంది. అదేంటంటే.. గుజరాత్ టైటాన్స్ బ్యాటర్లలో టాప్3ని వీలైనంత త్వరగా అవుట్ చేయగలిగితే కప్పు తమదే అనే ధీమాతో ఉంది. నిజానికి ఈ విషయాన్ని తొలి క్వాలిఫైయర్లోనే చేసి చూపింది. గుజరాత్ బలం మొత్తం ఓపెనర్లు సాయి సుదర్శన్, కెప్టెన్ శుబ్మన్ గిల్, వన్డౌన్ బ్యాటర్ జోష్ బట్లర్తోనే ఉంది.
ఈ ముగ్గురు ఆడితేనే గుజరాత్ గెలుస్తుంది. వీరు విఫలం అయితే గుజరాత్కు ఓటమి ఖాయంలా కనిపిస్తోంది. తొలి క్వాలిఫైయర్లో అదే జరిగింది. ఆర్సీబీ బౌలర్లు చెలరేగి పవర్ప్లేలోనే వీరిని పెవిలియన్ చేర్చడంతో చాలా ఈజీగా మ్యాచ్ గెలిచి ఫైనల్కు చేరుకుంది. ఇప్పుడు మళ్లీ అదే సీన్ రిపీట్ చేస్తే కప్పు తమదే అనే నమ్మకంతో ఉంది. అయితే గుజరాత్ టైటాన్స్ మరోసారి అదే తప్పు చేస్తుందా అంటే కాస్త కష్టంగానే కనిపిస్తోంది. ఫైనల్ మ్యాచ్ జరగబోయేది అహ్మాదాబాద్లో.. అది గుజరాత్కు హోమ్ గ్రౌండ్, కెప్టెన్ శుబ్మన్ గిల్కు బాగా కలిసివచ్చే గ్రౌండ్. సో.. ఇలాంటి గ్రౌండ్లో జీటీ టాప్ 3 అంత ఈజగా చిక్కుతారని అనుకోలేం. కానీ ఆర్సీబీలో భువీ, హెజల్వుడ్, జాకబ్ డఫీ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారు. చూడాలి మరి ఈ రోజు ఎవరు పైచేయి సాధిస్తారో. జీటీ టాప్ 3 బ్యాటర్లా? ఆర్సీబీ టాప్ 3 బౌలర్లా? వీరిలో ఎవరు పైచేయి సాధిస్తే వారిదే కప్పు అన్నట్లు ఉంది పరిస్థితి.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి