IPL 2026 : ఊహించని తప్పుకు రూ. 12 లక్షలు కట్.. అక్షర్ పటేల్‌కు బీసీసీఐ భారీ షాక్

IPL 2026 : ఐపీఎల్ 2026లో పంజాబ్ కింగ్స్‌పై గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్‌కు రూ. 12 లక్షల జరిమానా పడింది. నిర్ణీత సమయంలోగా ఓవర్లు పూర్తి చేయడంలో విఫలమైనందుకు ఫైన్ పడింది. ఈ సీజన్‌లో అక్షర్ ఇలా ఫైన్ కట్టడం ఇదే మొదటిసారి.

IPL 2026 : ఊహించని తప్పుకు రూ. 12 లక్షలు కట్.. అక్షర్ పటేల్‌కు బీసీసీఐ భారీ షాక్
Axar Patel

Updated on: May 12, 2026 | 12:40 PM

IPL 2026 : ఐపీఎల్ 2026లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్‌కు చేదు అనుభవం ఎదురైంది. సోమవారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో ఢిల్లీ జట్టు అద్భుత విజయాన్ని అందుకున్నప్పటికీ, కెప్టెన్ అక్షర్ పటేల్‌పై బీసీసీఐ క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. స్లో ఓవర్ రేట్ కారణంగా అతనికి భారీ జరిమానా విధించింది. నిర్ణీత సమయంలోగా ఓవర్లు పూర్తి చేయడంలో విఫలమైనందుకు అక్షర్ పటేల్‌కు రూ. 12 లక్షల ఫైన్ పడింది. ఈ సీజన్‌లో అక్షర్ ఇలా ఫైన్ కట్టడం ఇదే మొదటిసారి.

ఆ కెప్టెన్ల సరసన అక్షర్ పటేల్

ఈ జరిమానాతో అక్షర్ పటేల్ ఇప్పుడు ఐపీఎల్ 2026లో శిక్షకు గురైన ఇతర కెప్టెన్ల క్లబ్‌లో చేరిపోయాడు. అక్షర్ కంటే ముందు శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్ వంటి స్టార్ కెప్టెన్లు కూడా ఇదే స్లో ఓవర్ రేట్ కారణంగా జరిమానాలు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఇప్పటికే రెండుసార్లు ఈ తప్పు చేసి భారీ మూల్యం చెల్లించుకున్నాడు. అక్షర్ పటేల్‌కు ఇది మొదటి తప్పు కావడంతో నిబంధనల ప్రకారం కనీస శిక్ష అయిన రూ.12 లక్షలతో సరిపెట్టారు.

కెప్టెన్ ఇన్నింగ్స్‌తో ఢిల్లీ ఘనవిజయం

ఒకవైపు జరిమానా పడినా, మరోవైపు జట్టును గెలిపించిన ఆనందంలో అక్షర్ ఉన్నాడు. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో ఢిల్లీకి గెలుపు అనివార్యమైన తరుణంలో అక్షర్ పటేల్ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఈ సీజన్‌లో వరుసగా విఫలమవుతున్న అక్షర్, కీలక సమయంలో 56 పరుగుల అద్భుత హాఫ్ సెంచరీతో మెరిశాడు. అంతకుముందు ఆడిన మ్యాచ్‌లలో కనీసం రెండంకెల స్కోరు చేయడానికి ఇబ్బంది పడ్డ అక్షర్, ఒకేసారి 50 ప్లస్ స్కోరు సాధించి విమర్శకుల నోళ్లు మూయించాడు.

ప్లేఆఫ్స్ రేసులో ఢిల్లీ

ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. 211 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్, మరో ఓవర్ మిగిలి ఉండగానే 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. 3 వికెట్ల తేడాతో విజయం సాధించిన ఢిల్లీ, పాయింట్ల పట్టికలో ఎగబాకి ప్లేఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. పంజాబ్ ఓటమి ఆ జట్టు ప్లేఆఫ్స్ ఆశలను దెబ్బతీయగా, ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రం ఇప్పుడు రేసులోకి దూసుకొచ్చింది.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us