Racism Row : తిలక్ వర్మపై అర్ష్‌దీప్ వివాదాస్పద వ్యాఖ్య.. క్రికెట్‌లో మళ్ళీ వర్ణ వివక్ష మొదలైందా ?

Racism Row : ముంబై ఇండియన్స్ స్టార్ తిలక్ వర్మపై పంజాబ్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ చేసిన అంధేరే వ్యాఖ్య ఇప్పుడు ఐపీఎల్ 2026లో పెద్ద వివాదంగా మారింది.ఈ పదం జాత్యహంకార ధోరణిలో (Racism) ఉందంటూ నెటిజన్లు అర్ష్‌దీప్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.

Racism Row : తిలక్ వర్మపై అర్ష్‌దీప్ వివాదాస్పద వ్యాఖ్య.. క్రికెట్‌లో మళ్ళీ వర్ణ వివక్ష మొదలైందా ?
Arshdeep Singh

Updated on: May 15, 2026 | 10:03 AM

Racism Row : ఐపీఎల్ 2026 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ ఇప్పుడు ఒక వివాదంలో చిక్కుకున్నారు. ధర్మశాల వేదికగా ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌కు ముందు ఒక వీడియో వైరల్ అయ్యింది. అందులో అర్ష్‌దీప్ సింగ్, ముంబై ఇండియన్స్ బ్యాటర్ తిలక్ వర్మను ఉద్దేశించి ఓయ్ అంధేరే అని పిలవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈ పదం జాత్యహంకార ధోరణిలో (Racism) ఉందంటూ నెటిజన్లు అర్ష్‌దీప్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.

ఏమిటా వివాదం? వైరల్ వీడియోలో ఏముంది?

సాధారణంగా అర్ష్‌దీప్ సింగ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. రీల్స్, వ్లాగ్స్ చేస్తూ సరదాగా కనిపిస్తుంటారు. అయితే, మ్యాచ్‌కు ముందు ప్రాక్టీస్ సెషన్ సమయంలో తిలక్ వర్మను పిలిచే క్రమంలో ఆయన వాడిన అంధేరే అనే పదం వివాదానికి దారితీసింది. హిందీలో అంధేరే అంటే చీకటి అని అర్థం. ఒక వ్యక్తి శరీర రంగును ఉద్దేశించి ఇలాంటి పదాలు వాడటం సరైంది కాదని, ఇది వర్ణ వివక్ష కిందికే వస్తుందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

స్నేహమా? లేక వివక్షా?

అర్ష్‌దీప్ సింగ్, తిలక్ వర్మ ఇద్దరూ టీమిండియా తరపున కలిసి ఆడారు. వారిద్దరి మధ్య మైదానం వెలుపల మంచి స్నేహం ఉంది. ఆ చనువుతోనే సరదాగా అలా పిలిచి ఉంటారని కొందరు అర్ష్‌దీప్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. కానీ, మెజారిటీ నెటిజన్లు మాత్రం దీన్ని తప్పుబడుతున్నారు. “స్నేహితులైనా సరే.. బహిరంగంగా రంగును ఉద్దేశించి వ్యాఖ్యలు చేయడం ఒక తప్పుడు సంకేతాన్ని పంపిస్తుంది” అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. గతంలో కూడా క్రికెట్‌లో ఇలాంటి వర్ణ వివక్ష వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి.

తిలక్ వర్మ గట్టి కౌంటర్ ఇచ్చాడా?

వివాదాలు ఎలా ఉన్నా, మైదానంలో మాత్రం తిలక్ వర్మ తన బ్యాట్‌తోనే అర్ష్‌దీప్ జట్టుకు సమాధానం చెప్పాడు. 201 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో తిలక్ వర్మ కేవలం 33 బంతుల్లోనే 75 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అర్ష్‌దీప్ వేసిన 19వ ఓవర్‌లో కూడా తిలక్ ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడి ముంబైని గెలిపించాడు. దీంతో సోషల్ మీడియాలో “బయట అంధేరే అని పిలిచావేమో కానీ, గ్రౌండ్లో తిలక్ నీకు చీకట్లు చూపించాడు” అంటూ మీమ్స్ పేలుతున్నాయి.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us