AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారత్, జపాన్ మ్యాచ్‌కు భారీ వర్షం ముప్పు.. రద్దయితే టీమిండియా సెమీస్ చేరేనా..?

ఆసియా క్రీడలు (Asian Games 2026) మహిళల క్రికెట్ విభాగంలో భారత క్రికెట్ జట్టు (Team India) శుక్రవారం జపాన్ (Japan) తో క్వార్టర్‌ఫైనల్ సమరానికి సిద్ధమైంది. అయితే ఈ కీలక పోరుకు భారీ వర్షం ముప్పు పొంచి ఉంది. ఒకవేళ మ్యాచ్ పూర్తిగా రద్దయితే సెమీఫైనల్ బెర్త్ ఎవరికి దక్కుతుంది? టోర్నీ నిబంధనలు ఏం చెబుతున్నాయనే అంశం ఇప్పుడు అభిమానుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది.

భారత్, జపాన్ మ్యాచ్‌కు భారీ వర్షం ముప్పు.. రద్దయితే టీమిండియా సెమీస్ చేరేనా..?
Asian Games 2026 Womens Cricket
Venkata Chari
|

Updated on: Sep 18, 2026 | 7:20 AM

Share

హర్మన్‌ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur) సారథ్యంలోని భారత మహిళల క్రికెట్ జట్టు ఇటీవల మహిళల ఆసియా కప్ (Women’s Asia Cup) గెలిచి అద్భుతమైన ఆత్మవిశ్వాసంతో ఆసియా క్రీడల బరిలోకి దిగింది. నిస్షిన్ వేదికగా గల కొరోగీ స్పోర్ట్స్ పార్క్ (Korogi Sports Park) మైదానంలో జపాన్ జట్టుతో జరిగే నాకౌట్ పోరుతో భారత్ తన వేటను ప్రారంభించనుంది. పురుషుల విభాగంలా కాకుండా, మహిళల టోర్నమెంట్‌లో అగ్రశ్రేణి జట్లు నేరుగా క్వార్టర్‌ఫైనల్ మ్యాచ్‌లతోనే పోటీలను మొదలుపెడతాయి. ఇందులో విజయం సాధిస్తే టీమిండియా సెమీఫైనల్ చేరి బంగ్లాదేశ్ జట్టును ఢీకొంటుంది. మొదటి రోజే వర్షం అంతరాయం కలిగించడంతో బంగ్లాదేశ్, చైనా జట్ల పోరు ఒక్క బంతి కూడా పడకుండానే నిలిచిపోయింది. దీంతో నిర్వాహకులు ర్యాంకింగ్స్ ఆధారంగా బంగ్లాదేశ్‌ను విజేతగా ప్రకటించి సెమీస్ చేర్చారు. మరోవైపు పాకిస్థాన్, థాయ్‌లాండ్ సమరం వర్షం కారణంగా 11 ఓవర్లకు కుదించగా, పాక్ విజయం సాధించి ముందంజ వేసింది.

ఐచి (Aichi) ప్రాంతంలో వాతావరణం ఏమాత్రం ఆశాజనకంగా లేదు. మ్యాచ్ జరిగే సమయంలో దాదాపు 86 శాతం వర్షం కురిసే అవకాశం ఉందని అధికారిక నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెల్సియస్ వద్ద కొనసాగుతుండగా, ఆకాశం 39 శాతం మేఘావృతమై ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. ఒకవేళ వరుణుడి ప్రతాపంతో మ్యాచ్ పూర్తిగా రద్దయితే విజేతను ఎలా నిర్ణయిస్తారనే దానిపై టోర్నీ నిబంధనలు స్పష్టత ఇస్తున్నాయి. ఆసియా క్రీడల రూల్స్ ప్రకారం ఏదైనా మ్యాచ్ వర్షార్పణమైతే, ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ (T20I Rankings) ఆధారంగా ఉన్నత స్థానంలో ఉన్న జట్టు మరుసటి రౌండ్‌కు అర్హత సాధిస్తుంది.

ప్రస్తుత అంతర్జాతీయ ర్యాంకింగ్స్‌లో భారత జట్టు మూడో స్థానంలో కొనసాగుతుండగా, ప్రత్యర్థి జపాన్ ఏకంగా 39వ ర్యాంకు వద్ద ఉంది. వర్షం వల్ల మ్యాచ్ రద్దయినప్పటికీ భారత్‌కు ఎలాంటి నష్టం వాటిల్లదు. మెరుగైన ర్యాంకింగ్ కారణంగా హర్మన్‌ప్రీత్ సేన నేరుగా సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. ఒకవేళ బంగ్లాదేశ్‌తో జరగబోయే సెమీస్ పోరుకు కూడా వర్షం అడ్డంకిగా మారి రద్దయినా, భారత్ ఇదే ర్యాంకింగ్ నిబంధన ఆధారంగా ఫైనల్ చేరుకుంటుంది.

స్మృతి మంధాన (Smriti Mandhana), షఫాలీ వర్మ (Shafali Verma) వంటి విధ్వంసకర ఓపెనర్లతో పాటు మిడిలార్డర్‌లో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ జట్టుకు కొండంత బలంగా ఉన్నారు. ఆసియా ఖండంలోని ప్రత్యర్థి జట్లపై భారత్‌కు అద్భుతమైన రికార్డు ఉంది. ఒంటిచేత్తో మ్యాచ్‌లను గెలిపించగల నాణ్యమైన బౌలింగ్ విభాగం ఉండటంతో స్వర్ణ పతకం సాధించే ఫేవరెట్‌గా భారత అమ్మాయిలు బరిలోకి దిగుతున్నారు. వాతావరణం సహకరించి ఆట సాగినా, లేక వర్షం అడ్డుపడినా తదుపరి దశకు చేరుకునే అవకాశం భారత్‌కే బలంగా ఉంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us