AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs ENG: ఆ 33 బంతులే కొంపముంచాయ్.. టీమిండియాకు శాపంలా మారిన మిడిలార్డర్..!

మంచి భాగస్వామ్యాలతో పటిష్టమైన స్థితిలో నిలిచిన టీమిండియా, మిడిల్ ఓవర్లలో ఆడిన ఆ 33 బంతుల మందకొడి ఆట వల్ల భారీ స్కోరు చేసే అవకాశాన్ని చేజేతులా జార్చుకుంది. ఏదేమైనా 191 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగుతున్న ఇంగ్లండ్‌ను మన బౌలర్లు ఏ మేరకు కట్టడి చేస్తారో వేచి చూడాలి.

IND vs ENG: ఆ 33 బంతులే కొంపముంచాయ్.. టీమిండియాకు శాపంలా మారిన మిడిలార్డర్..!
India Middle Order Collapse
Venkata Chari
|

Updated on: Jul 04, 2026 | 9:32 PM

Share

ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 190 పరుగుల భారీ స్కోరు సాధించింది. అయితే, ఒకానొక దశలో 200 పరుగులను అలవోకగా దాటేలా కనిపించిన భారత్, మిడిల్ ఓవర్లలో చేసిన కొన్ని చిన్నపాటి తప్పుల వల్ల ఆ మైలురాయిని అందుకోలేకపోయింది.

అదిరిపోయే ఆరంభం ఇచ్చిన ఓపెనర్లు..

మాంచెస్టర్‌లో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్‌కు యువ ఓపెనర్లు అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ అద్భుతమైన పునాది వేశారు. ఈ ఇద్దరు ఆటగాళ్లు తొలి వికెట్‌కు కేవలం ఐదు ఓవర్లలోనే 50 పరుగులు జోడించి ఇంగ్లండ్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. జట్టు స్కోరు 65 పరుగుల వద్ద ఉన్నప్పుడు సూర్యవంశీ, అభిషేక్ శర్మ ఇద్దరూ అవుట్ అయినప్పటికీ, వారు అందించిన వేగం జట్టుకు ఎంతగానో ఉపయోగపడింది.

శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ మెరుపులు..

పవర్‌ప్లే ముగిసిన తర్వాత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మైదానంలో పరుగుల వరద పారించాడు. కేవలం 22 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 37 పరుగులు చేసి భారత స్కోరును వేగంగా ముందుకు నడిపించాడు. ఇషాన్ కిషన్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దిన అయ్యర్, జట్టు స్కోరును 12.5 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 130 పరుగులకు చేర్చాడు. ఈ దశలో భారత్ కనీసం 210 పరుగులైనా చేస్తుందని అందరూ భావించారు.

ఇవి కూడా చదవండి

ఆ 33 బంతులు.. కొంపముంచిన తడబాటు

13వ ఓవర్ చివరి బంతికి శ్రేయస్ అయ్యర్ అవుట్ కావడంతో భారత ఇన్నింగ్స్ ఒక్కసారిగా మందగించింది. 13వ ఓవర్ నుండి 18.3 ఓవర్ల మధ్య భారత్ వరుసగా 4 వికెట్లు కోల్పోయింది. ఈ 33 బంతుల్లో భారత బ్యాటర్లు కేవలం 34 పరుగులు మాత్రమే చేయగలిగారు. ఇక్కడే రన్‌రేట్ ఘోరంగా పడిపోయింది. సామ్ కరన్ బౌలింగ్‌లో శివం దుబే కేవలం 5 పరుగులు (7 బంతులు) చేసి అవుట్ కాగా, ఇషాన్ కిషన్ 49 పరుగులు చేసినప్పటికీ దాని కోసం ఏకంగా 40 బంతులు తీసుకున్నాడు. అక్షర్ పటేల్ కూడా కేవలం 2 పరుగులకే రన్ అవుట్ కావడంతో భారత్ తీవ్ర ఒత్తిడిలో పడింది.

ఆదుకున్న తిలక్ వర్మ..

మిడిల్ ఆర్డర్ వైఫల్యంతో తక్కువ స్కోరుకే పరిమితం అవుతుందనుకున్న తరుణంలో తెలుగు కుర్రాడు తిలక్ వర్మ జట్టును ఆదుకున్నాడు. చివరి ఓవర్లో జోఫ్రా ఆర్చర్ వేసిన మొదటి మూడు బంతుల్లో 2 సిక్సర్లు, ఒక ఫోర్ బాది స్టేడియాన్ని హోరెత్తించాడు. తిలక్ కేవలం 11 బంతుల్లో 24 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవడంతోనే భారత్ 190 పరుగుల గౌరవప్రదమైన స్కోరునైనా అందుకోగలిగింది. ఇంగ్లండ్ బౌలర్లలో సామ్ కరన్ 3 వికెట్లతో భారత మిడిల్ ఆర్డర్‌ను దెబ్బతీశాడు.

Follow Us