
Independence Day: 1947లో జరిగిన దేశ విభజన కేవలం సరిహద్దులను మాత్రమే కాకుండా మనుషుల జీవితాలను, ఆటను కూడా ముక్కలు చేసింది. మన దేశం తరపున అంతర్జాతీయ మ్యాచ్ల్లో బరిలోకి దిగి.. విడిపోయిన తర్వాత పాకిస్తాన్ జెండా పట్టిన ఆ ఆటగాళ్ల కథ ఏంటో తెలిస్తే గుండె తరిగిపోతుంది. ఆ చారిత్రక క్రికెటర్ల జ్ఞాపకాలు, విశేషాలు ఓసారి చూద్దాం..!
ఆగస్టు 14, 15 తేదీలు భారత చరిత్రలో మర్చిపోలేని రోజులు. బ్రిటిష్ పాలకుల కుట్రల వల్ల మన దేశం రెండుగా విడిపోయింది. ఆ విభజన వేలాది కుటుంబాలను రోడ్డున పడేసింది, ఎంతోమంది రక్తాన్ని ఏరులై పారించింది. ఆ కష్టకాలంలో క్రికెట్ ప్రపంచం తీవ్రంగా ప్రభావితమైంది. అప్పటివరకు భారత్ తరఫున ఆడిన కొందరు మేటి ఆటగాళ్లు, ఒక్కరాత్రిలోనే పరాయి దేశస్తులుగా మారిపోవాల్సి వచ్చింది. తమ సొంత ఊర్లు కొత్త దేశంలో కలవడంతో వారు పాకిస్తాన్ వైపు వెళ్లక తప్పలేదు.
మన దేశం తరఫున టెస్టుల్లో అరంగేట్రం చేసి ఆ తర్వాత పాకిస్తాన్ వెళ్లిన ఆటగాళ్లలో అబ్దుల్ హఫీజ్ కర్దార్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. 1946లో ఇంగ్లండ్తో జరిగిన సిరీస్లో ఆయన భారత్ తరఫున మూడు టెస్టు మ్యాచ్లు ఆడారు. విభజన సమయంలో ఆయన పుట్టిన లాహోర్ ప్రాంతం పాకిస్తాన్లోకి వెళ్లిపోవడంతో ఆయన ఆ దేశాన్ని ఎంచుకున్నారు. ఆ తర్వాత కొత్తగా ఏర్పడిన పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు ఆయనే మొదటి కెప్టెన్గా బాధ్యతలు చేపట్టడం విశేషం. మొత్తం 26 టెస్టులు ఆడిన కర్దార్ 927 పరుగులు సాధించారు.
కర్దార్తో పాటు ఆమిర్ ఇలాహీ అనే లెగ్ స్పిన్నర్ కూడా విభజనకు ముందే 1947లో భారత్ తరఫున ఒక టెస్టు మ్యాచ్ ఆడారు. విడిపోయిన తర్వాత ఆయన పాకిస్తాన్ జట్టులో చేరారు. 1952లో భారత్పైనే పాకిస్తాన్ ఆడిన తొలి టెస్టు సిరీస్లో ఆయన బరిలోకి దిగడం విశేషం. మరొక ఆసక్తికరమైన ఆటగాడు గుల్ మహమ్మద్. ఆయన భారత్ తరఫున ఏకంగా 8 టెస్టులు ఆడి, విభజన తర్వాత కూడా కొన్నేళ్ల పాటు భారత జట్టులోనే కొనసాగారు. 1956లో అనుకోకుండా పాకిస్తాన్కు వెళ్లి అక్కడ ఒక టెస్టు ఆడారు. రెండు దేశాల తరఫున ప్రాతినిధ్యం వహించిన అరుదైన ముగ్గురు క్రికెటర్లు వీరే కావడం గమనార్హం.
ఈ ముగ్గురే కాకుండా మన దేశవాళీ రంజీ ట్రోఫీలో సత్తా చాటి, ఆ తర్వాత పాకిస్తాన్కు వెళ్లి టెస్టుల్లో అరంగేట్రం చేసిన ఆటగాళ్లు చాలామందే ఉన్నారు. వారిలో ఫజల్ మహమూద్ అత్యంత ప్రతిభావంతుడైన ఫాస్ట్ బౌలర్. విభజనకు ముందు ఆయన నార్తర్న్ ఇండియా, పంజాబ్ జట్లకు ఆడారు. ఆ తర్వాత పాకిస్తాన్ తరఫున 34 టెస్టుల్లో 139 వికెట్లు పడగొట్టి ఆ దేశ దిగ్గజ బౌలర్గా మారారు. నజర్ మహమ్మద్, ఇంతియాజ్ అహ్మద్, మహమ్మద్ నిసార్ వంటి ఆటగాళ్లు కూడా భారత్ నేలపైన పరుగుల వరద పారించి, ఆ తర్వాత పాకిస్తాన్ క్రికెట్ పునాదులకు ఆధారం అయ్యారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..