IND vs SL: శ్రీలంకపై సత్తా చాటితే చరిత్రే.. గిల్, జడేజా, కుల్దీప్ ముందు అరుదైన రికార్డులు
IND vs SL: శ్రీలంకతో టెస్టు సిరీస్లో శుభ్మన్ గిల్ సచిన్ టెండూల్కర్ రికార్డు పై కన్నేశాడు. రవీంద్ర జడేజా 350 టెస్టు వికెట్లకు చేరువగా ఉండగా, కుల్దీప్ యాదవ్ 250 అంతర్జాతీయ వికెట్ల మైలురాయికి ఒక్క వికెట్ దూరంలో ఉన్నాడు.

IND vs SL: భారత్, శ్రీలంక జట్ల మధ్య ఆగస్టు 15 నుంచి రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. గాళ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరగనున్న తొలి టెస్టుతో ఈ సిరీస్కు తెరలేవనుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల పరంగా ఈ సిరీస్ టీమిండియాకు ఎంతో కీలకం. అదే సమయంలో భారత ఆటగాళ్లకు వ్యక్తిగతంగా కూడా ఇది ప్రత్యేకమైన సిరీస్గా మారనుంది. కెప్టెన్ శుభ్మన్ గిల్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్లు పలు కీలక మైలురాళ్లకు చేరువలో ఉన్నారు.
గిల్ టార్గెట్లో సచిన్ టెండూల్కర్ రికార్డు
టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ ఈ సిరీస్లో రెండు కీలక రికార్డులపై కన్నేశాడు. ప్రస్తుత WTC సైకిల్లో గిల్ ఇప్పటికే ఐదు సెంచరీలు చేశాడు. శ్రీలంకపై మరో సెంచరీ సాధిస్తే ఈ WTC సైకిల్లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్గా జో రూట్ను అధిగమించే అవకాశం ఉంది. అదే సమయంలో కెప్టెన్గా మరో రెండు సెంచరీలు సాధిస్తే టెస్టుల్లో భారత కెప్టెన్గా అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్ల జాబితాలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రికార్డును గిల్ అధిగమించే అవకాశం ఉంది. సచిన్ కెప్టెన్గా ఏడు టెస్టు సెంచరీలు సాధించగా, గిల్ ఇప్పటికే ఆరు సెంచరీలతో ఉన్నాడు.
జడేజా టార్గెట్లో 350 టెస్టు వికెట్లు
టీమిండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా కూడా ఈ సిరీస్లో చారిత్రాత్మక మైలురాయికి చేరువలో ఉన్నాడు. శ్రీలంకతో జరిగే టెస్టుల్లో మరో రెండు వికెట్లు తీస్తే జడేజా టెస్టు క్రికెట్లో 350 వికెట్ల మార్క్ను అందుకుంటాడు. ఈ ఘనత సాధిస్తే 350 లేదా అంతకంటే ఎక్కువ టెస్టు వికెట్లు తీసిన భారత బౌలర్ల జాబితాలో అనిల్ కుంబ్లే, రవిచంద్రన్ అశ్విన్, కపిల్ దేవ్, హర్భజన్ సింగ్ వంటి దిగ్గజాల సరసన జడేజా నిలుస్తాడు.
శ్రీలంకపై ఇషాంత్ శర్మ రికార్డుపై కూడా జడేజా కన్ను
శ్రీలంకపై టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్ల జాబితాలో జడేజా ప్రస్తుతం 33 వికెట్లతో ఆరో స్థానంలో ఉన్నాడు. ఈ సిరీస్లో మరో నాలుగు వికెట్లు సాధిస్తే 36 వికెట్లతో ఉన్న ఇషాంత్ శర్మను అధిగమించి టాప్-5లోకి ప్రవేశించే అవకాశం ఉంది. అంటే జడేజాకు ఈ సిరీస్లో ఒకేసారి రెండు కీలక మైలురాళ్లు అందుకునే ఛాన్స్ ఉంది. 350 టెస్టు వికెట్లతో పాటు శ్రీలంకపై భారత బౌలర్లలో తన స్థానాన్ని మరింత మెరుగుపరుచుకోవచ్చు.
కుల్దీప్కు ఒక్క వికెట్ చాలు
టీమిండియా చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కూడా ఓ అరుదైన మైలురాయికి కేవలం ఒక్క వికెట్ దూరంలో ఉన్నాడు. ఆసియా గడ్డపై అంతర్జాతీయ క్రికెట్లో కుల్దీప్ ఇప్పటివరకు 249 వికెట్లు సాధించాడు. శ్రీలంకతో టెస్టులో ఒక్క వికెట్ తీస్తే ఆసియాలో అంతర్జాతీయ క్రికెట్లో 250 వికెట్లు పూర్తి చేసిన బౌలర్గా కుల్దీప్ మరో ప్రత్యేక ఘనతను అందుకోనున్నాడు.
కెప్టెన్గా గిల్కు మరో రికార్డు ఛాన్స్
శ్రీలంకతో టెస్టు సిరీస్ను టీమిండియా 2-0తో క్లీన్స్వీప్ చేస్తే శుభ్మన్ గిల్ కెప్టెన్సీ రికార్డులో మరో మైలురాయి చేరుతుంది. గిల్ నాయకత్వంలో భారత్ ఇప్పటివరకు తొమ్మిది టెస్టులు ఆడి ఐదు విజయాలు సాధించింది. సిరీస్లో రెండు విజయాలు సాధిస్తే కెప్టెన్గా భారత్కు అత్యధిక టెస్టు విజయాలు అందించిన వారిలో బిషన్ సింగ్ బేడీని అధిగమించే అవకాశం గిల్కు ఉంటుంది. బేడీ నాయకత్వంలో భారత్ 22 టెస్టుల్లో ఆరు విజయాలు సాధించింది.
శ్రీలంక సిరీస్లో అసలు పోటీ ఇదే
శ్రీలంకతో జరగనున్న రెండు టెస్టుల్లో టీమిండియా ప్రధాన లక్ష్యం సిరీస్ను గెలిచి WTC పాయింట్లు సాధించడమే అయినప్పటికీ.. గిల్, జడేజా, కుల్దీప్ల వ్యక్తిగత మైలురాళ్లు కూడా అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. గిల్ సచిన్ రికార్డును అందుకుంటాడా? జడేజా 350 వికెట్ల క్లబ్లో చేరతాడా? కుల్దీప్ 250 వికెట్ల మైలురాయిని అందుకుంటాడా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
