
Jay Shah and Najam Sethi: ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) అధ్యక్షుడు, భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కార్యదర్శి జైషా ప్రస్తుతం బహ్రెయిన్లో ఉన్నారు. ఏసీసీ కీలక సమావేశం కోసం బహ్రెయిన్ వెళ్ళాడు. ఆసియా కప్ 2023 ఆతిథ్యానికి సంబంధించి ఈ సమావేశం జరిగింది. ఇక్కడ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చీఫ్ నజామ్ సేథీ పాకిస్తాన్ హోస్టింగ్ హక్కుల విషయాన్ని జైషా ముందు ఉంచారు.
ఆసియా కప్ 2023కి ఆతిథ్యం ఇవ్వడం పాకిస్థాన్కు దాదాపు అసాధ్యం అనిపిస్తుంది. ఎందుకంటే భారత జట్టు పాకిస్థాన్కు వెళ్లే అవకాశం లేదు. ఇటువంటి పరిస్థితిలో ఆసియా కప్ను యూఏఈ లేదా శ్రీలంకకు మార్చవచ్చని తెలుస్తోంది.
‘జైషా ప్రస్తుతం బహ్రెయిన్లో ఏసీసీ సమావేశానికి వెళ్తున్నారు. బీసీసీఐ స్టాండ్ మారదు. ప్రభుత్వం నుంచి అనుమతి లభించనందున మేం పాకిస్తాన్కు వెళ్లం’ అంటూ బీసీసీఐ పేర్కొంది.
ఆసియా కప్ 2023 పాకిస్థాన్లో జరగాల్సి ఉంది, కానీ, బీసీసీఐ అభ్యంతరం కారణంగా, ఇప్పుడు దాని అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. గత దశాబ్దంన్నర కాలంగా భారత్, పాకిస్థాన్ల మధ్య సంబంధాల్లో పెద్దగా మార్పులు లేవు. ఈ దశాబ్దంన్నర కాలంలో భారత జట్టు ఒక్కసారి కూడా పాకిస్థాన్ పర్యటనకు వెళ్లలేదు. ఇలాంటి పరిస్థితుల్లో గత ఏడాది అక్టోబరులో పాకిస్థాన్లో ఆసియా కప్ జరుగుతుందనే చర్చ జరిగినప్పుడు.. భారత జట్టు పాకిస్థాన్కు వెళ్లేది లేదని జైషా ఓ ప్రకటనలో స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.
జైషా ప్రకటన తర్వాత ఈ అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. చాలా మంది పాకిస్థాన్ మాజీ క్రికెటర్లు బీసీసీఐ ఈ వైఖరిని తప్పుగా అభివర్ణించారు. ఆ సమయంలో పీసీబీ చీఫ్ రమీజ్ రాజా కూడా ఆసియా కప్ కోసం భారత జట్టు పాకిస్థాన్కు రాకపోతే, 2023లో భారత్లో జరగనున్న వన్డే ప్రపంచకప్లో పాకిస్థాన్ జట్టు కూడా పాల్గొనదని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ విషయమై బీసీసీఐని ఒప్పించేందుకు పీసీబీ కొత్త చీఫ్ ప్రయత్నిస్తున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..