AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs IRE : ఐర్లాండ్ చేతిలో ఘోర పరాజయం.. టీమిండియా కొంపముంచిన ఆ ఐదుగురు ప్లేయర్లు వీళ్లే

IND vs IRE : ఐర్లాండ్‌ తో తొలి టీ20లో భారత్ 34 పరుగుల తేడాతో చారిత్రాత్మక ఓటమి చవిచూసింది. ప్రసిద్ధ్ కృష్ణ, శ్రేయస్ అయ్యర్, తిలక్ వర్మ, వాషింగ్టన్ సుందర్, ఇషాన్ కిషన్ పేలవ ప్రదర్శనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

IND vs IRE : ఐర్లాండ్ చేతిలో ఘోర పరాజయం.. టీమిండియా కొంపముంచిన ఆ ఐదుగురు ప్లేయర్లు వీళ్లే
Ind Vs Ire
Rakesh
|

Updated on: Jun 27, 2026 | 10:15 AM

Share

IND vs IRE : టీ20 వరల్డ్ కప్ 2026 గెలిచిన ఊపులో ఉన్న భారత జట్టుకు ఐర్లాండ్ గట్టి షాక్ ఇచ్చింది. బెల్ఫాస్ట్ వేదికగా జరిగిన మొదటి టీ20 మ్యాచ్‌లో ఆతిథ్య ఐర్లాండ్ జట్టు 34 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించి చరిత్ర సృష్టించింది. అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో ఏ ఫార్మాట్‌లోనైనా భారత్‌పై ఐర్లాండ్ గెలవడం ఇదే తొలిసారి. టాస్ గెలిచిన భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. అయితే ఐర్లాండ్ బ్యాటర్లు లార్కాన్ టక్కర్ (50), గారెత్ డెలానీ (49) అద్భుతంగా రాణించడంతో ఆ జట్టు 20 ఓవర్లలో 182 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో తడబడిన భారత్ 18.5 ఓవర్లలో 148 పరుగులకే ఆలౌట్ అయి ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ ఓటమికి ముఖ్యంగా ఐదుగురు భారత ఆటగాళ్ల ప్రదర్శన కారణమని విమర్శలు వస్తున్నాయి.

ధారాళంగా పరుగులు సమర్పించుకున్న ప్రసిద్ధ్ కృష్ణ

భారత జట్టు ఓటమికి ప్రధాన కారణం ఫాస్ట్ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ వేసిన పేలవమైన బౌలింగ్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ మ్యాచ్‌లో తన నాలుగు ఓవర్ల కోటాలో ఏకంగా 57 పరుగులు సమర్పించుకున్నాడు. కనీసం ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. మ్యాచ్ మధ్యలో ఆయన వేసిన ఒకే ఓవర్లో ఐర్లాండ్ బ్యాటర్లు 27 పరుగులు పిండుకోవడంతో ఐర్లాండ్ స్కోరు బోర్డు ఒక్కసారిగా దూసుకెళ్లింది. ప్రసిద్ధ్ కృష్ణ తన లైన్ అండ్ లెంగ్త్‌ను నియంత్రించడంలో పూర్తిగా విఫలమయ్యాడు. ఆయన కాస్త పొదుపుగా బౌలింగ్ చేసి ఉంటే మ్యాచ్ ఫలితం మరోలా ఉండేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

బ్యాటింగ్‌లో విఫలమైన శ్రేయస్ అయ్యర్

భారత జట్టుకు కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌కు ఇది మొదటి మ్యాచ్. కానీ తొలి ప్రయత్నంలోనే ఆయన తీవ్రంగా నిరాశపరిచాడు. మైదానంలో కెప్టెన్‌గా ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాలు జట్టుకు శాపంగా మారాయి. ధారాళంగా పరుగులు ఇస్తున్నప్పటికీ వాషింగ్టన్ సుందర్, ప్రసిద్ధ్ కృష్ణలకు వరుసగా ఓవర్లు ఇవ్వడం వ్యూహాత్మక తప్పిదంగా మారింది. ఇక బ్యాటింగ్‌లో బాధ్యతాయుతంగా ఆడాల్సిన కెప్టెన్, కేవలం 7 బంతులు ఎదుర్కొని 3 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. ఒక వైపు వికెట్లు పడుతున్నా ఇన్నింగ్స్‌ను చక్కదిద్దడంలో అయ్యర్ ఘోరంగా విఫలమయ్యాడు.

వైస్ కెప్టెన్ తిలక్ వర్మ బాధ్యతారాహిత్యం

టీ20 జట్టుకు వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న తెలుగు తేజం తిలక్ వర్మ సైతం ఈ కీలక మ్యాచ్‌లో ప్రభావం చూపలేకపోయాడు. సాధారణంగా ఒత్తిడి సమయాల్లో అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడే తిలక్ వర్మ, ఈ మ్యాచ్‌లో మాత్రం చాలా నెమ్మదిగా ఆడాడు. ఆయన 21 బంతులు ఎదుర్కొని కేవలం 19 పరుగులు మాత్రమే చేశాడు. అన్నింటికంటే ఎక్కువగా ఆయన అవుట్ అయిన విధానం అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో అనవసరంగా రివర్స్ స్వీప్ షాట్ ఆడబోయి ఈజీ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.

ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌పై వేటు ఖాయం

ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ ప్రదర్శన పూర్తిగా నిరాశాజనకంగా సాగింది. బౌలింగ్‌లో కేవలం ఒకే ఓవర్ వేసిన ఆయన 19 పరుగులు సమర్పించుకున్నాడు. ఇక బ్యాటింగ్‌లో లోయర్ ఆర్డర్‌లో వచ్చి జట్టును గెలిపిస్తాడనుకుంటే, 12 బంతులు ఆడి కేవలం 9 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. రెండు విభాగాల్లోనూ ఘోరంగా ఫ్లాప్ అవ్వడంతో, ఆదివారం జరగబోయే రెండో టీ20 మ్యాచ్ ప్లేయింగ్ ఎలెవన్ నుంచి ఆయనను తప్పించడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఆయన స్థానంలో మరో యువ ఆటగాడికి అవకాశం ఇచ్చే యోచనలో కోచ్ గంభీర్ ఉన్నారు.

కీలక సమయంలో చేతులెత్తేసిన ఇషాన్ కిషన్

మంచి ఫామ్‌లో ఉన్న ఓపెనర్ ఇషాన్ కిషన్ ఈ మ్యాచ్‌లో పెద్ద ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. సంజూ శాంసన్ త్వరగానే అవుట్ అయిన తర్వాత, అభిషేక్ శర్మతో కలిసి ఇషాన్ కిషన్ ఇన్నింగ్స్ నిర్మిస్తాడని మేనేజ్‌మెంట్ ఆశించింది. కానీ ఇషాన్ కిషన్ అనవసర తొందరపాటుతో బాధ్యతారహితమైన షాట్ ఆడి వికెట్ పారేసుకున్నాడు. ఆయన ఔట్ కావడంతో భారత జట్టుపై ఒత్తిడి మరింత పెరిగింది. మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు ఒకరి తర్వాత ఒకరు పెవిలియన్‌కు క్యూ కట్టడంతో మ్యాచ్ పూర్తిగా ఐర్లాండ్ వశమైంది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us