IND vs AUS: అభిమానులతో పాటు ఆ దేవుని ఆశీస్సులు కూడా.. విరాట్‌ కోహ్లీ సెంచరీల సీక్రెట్‌ ఇదే!

వన్డే, టీ20 ఫార్మాట్‌లో సెంచరీలు సాధించిన కోహ్లీ టెస్ట్‌ క్రికెట్‌లో మాత్రం మూడంకెల స్కోరుకు చేరుకోలేకపోయాడు. అతను చివరిసారిగా 2019లో బంగ్లాదేశ్‌పై టెస్ట్ సెంచరీ చేశాడు.

IND vs AUS: అభిమానులతో పాటు ఆ దేవుని ఆశీస్సులు కూడా.. విరాట్‌ కోహ్లీ సెంచరీల సీక్రెట్‌ ఇదే!
Virat Kohli

Updated on: Mar 12, 2023 | 5:38 PM

వన్డే, టీ20 ఫార్మాట్‌లో సెంచరీలు సాధించిన కోహ్లీ టెస్ట్‌ క్రికెట్‌లో మాత్రం మూడంకెల స్కోరుకు చేరుకోలేకపోయాడు. అతను చివరిసారిగా 2019లో బంగ్లాదేశ్‌పై టెస్ట్ సెంచరీ చేశాడు. ఆతర్వాత కోహ్లీ బ్యాట్‌ నుంచి సెంచరీ జాలువారలేదు. అయితే తాజాగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ భారీ సెంచరీ సాధించాడు . ఇది తన కెరీర్‌లో 75వ సెంచరీ కాగా టెస్టు కెరీర్‌లో 28వది. ముఖ్యంగా గత 2 నెలలుగా అద్భుత ఫామ్‌లో ఉన్న కోహ్లీ మొత్తం 3 సెంచరీలు సాధించాడు. ఈ 3 సెంచరీల ప్రత్యేకత ఏంటంటే.. ఈ మూడు సెంచరీలూ ఉజ్జయిని మహంకాళీ ఆలయాన్ని సందర్శించిన తర్వాత కోహ్లీ బ్యాట్ నుంచే వచ్చాయి. ఇది యాదృచ్చికమే అయినా నిజం. నిజానికి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో విరాట్ పెద్దగా రాణించలేదు. తొలి మూడు టెస్టుల్లో కనీసం ఒక అర్ధసెంచరీ కూడా సాధించలేదు. అయితే మొదటి రెండు టెస్టు మ్యాచ్‌ల్లో టీమిండియా గెలవడంతో కోహ్లీ పేలవ ఫామ్‌పై పెద్దగా విమర్శలు రాలేదు. అయితే ఇండోర్ టెస్టులో టీమిండియా ఘోర పరాజయాన్ని చవిచూసిన తర్వాత కోహ్లీని టెస్టు జట్టు నుంచి తప్పించాలని డిమాండ్లు వచ్చాయి.

ఈక్రమంలో 4వ టెస్టు ప్రారంభానికి ముందు కోహ్లి ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయాన్ని సందర్శించాడు. సతీమణి అనుష్కాశర్మతో కలిసి అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించాడు. అంతేకాదు విశిష్టమైన భస్మహారతిలో కూడా పాల్గొని దేవుడి సన్నిధిలో ఆశీస్సులు పొందాడు ఆతర్వాత జట్టులోకి వచ్చిన విరాట్ ఏకంగా 186 పరుగులతో చెలరేగాడు. ఇక ఈ ఏడాది ప్రారంభంలో, కోహ్లి బృందావన్‌లోని నీమ్ కరోలి బాబా ఆశ్రమాన్ని సందర్శించాడు. ఆ తర్వాత గౌహతిలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 113 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ చేశాడు. ఆ తర్వాత తిరువనంతపురంలో శ్రీలంకపై కూడా సెంచరీ సాధించిన కోహ్లి.. 166 పరుగులతో అజేయ ఇన్నింగ్స్ ఆడాడు. అంతకుముందు దాదాపు 3 సంవత్సరాల పాటు వన్డే ఫార్మాట్‌లో సెంచరీ చేయడంలో విఫలమైన కోహ్లీ, గతేడాది నవంబర్‌లో ఉత్తరాఖండ్‌లోని నీమ్ కరోలి బాబా ఆశ్రమాన్ని సందర్శించాడు. ఆ తర్వాత బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో కోహ్లీ సెంచరీ కొట్టాడు. మొత్తానికి అభిమానులతో పాటు దేవుని ఆశీస్సులు కూడా విరాట్ కోహ్లీపై ఉన్నాయన్నమాట.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..