
ధోని.. ఓ క్రికెటర్.. ఓ కెప్టెన్.. ఓ ఫినిషర్.. గ్రౌండ్లో రెండు సిక్సర్లు కొట్టి.. ఇద్దరు లేదా ముగ్గురిని ఫీల్డింగ్ స్పాట్స్ మారిస్తే.. ధోని అయ్యిపోరు.. మిస్టర్ కూల్ ఒకటే పీస్.. ఎవ్వరూ రీప్లేస్ చేయలేరు. సేమ్ నిన్నటి ఐపీఎల్ మ్యాచ్లోనూ హార్దిక్ పాండ్యా కూడా ధోనిని మ్యాచ్ చేయాలని చూశాడు. దెబ్బకు అతడి ఓవర్ యాక్షన్లు ముంబై కొంపముంచింది. ఇంతకీ గుజరాత్తో జరిగిన మ్యాచ్లో ముంబై ఓటమికి కారణాలు ఏంటో తెలుసా.?
ఐపీఎల్ 2024 సీజన్ను ముంబై ఇండియన్స్ ఓటమితో ఆరంభించింది. అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 6 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. జీటీ నిర్దేశించిన లక్ష్యాన్ని చేధించే క్రమంలో ఎంఐ ఇన్నింగ్స్ను ప్రారంభించిన తీరు చూసి అందరూ సునాయసంగా గెలుస్తుందనుకున్నారు. ఆఖరి 6 ఓవర్లలో ముంబై విజయానికి 48 పరుగులు కావాల్సి ఉండగా.. వరుస క్రమంలో వికెట్లు కోల్పోవడం ముంబై కొంపముంచింది. ఈ ఏడాది గుజరాత్ నుంచి ట్రేడ్ అయ్యి.. ముంబైకి కెప్టెన్గా మారిన హార్దిక్ పాండ్యా.. తొలి మ్యాచ్లో పెద్దగా ప్రభావం చూపించలేకపోయాడు. దీంతో నెటిజన్లు అందరూ కూడా అతడ్ని ఏకీపారేస్తున్నారు. హార్దిక్ తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్లే ముంబై ఓటమిపాలైందని అంటున్నారు. ఇంతకీ అవేంటో తెలుసుకుందామా..
సాధారణంగా ఏ టీం అయినా సరే.. ఇన్నింగ్స్ తొలి ఓవర్ను అనుభవమున్న సీనియర్ బౌలర్కు ఇస్తారు. అయితే ఇక్కడ హార్దిక్ అలా చేయలేదు. ముంబైకి ఎప్పటినుంచో జస్ప్రిత్ బుమ్రా బౌలింగ్ చేస్తూ వచ్చాడు. కానీ ఈసారి హార్దిక్ స్వయంగా అతడే బౌలింగ్ను ఆరంభించాడు. తొలి ఓవర్ మొదటి బంతికే ఫోర్.. ఆ తర్వాత కూడా ఫోర్.. ఇలా మొదటి ఓవర్లోనే 10 పరుగులు ఇచ్చాడు హార్దిక్. మొదటి మూడు ఓవర్లు పూర్తి అయ్యాక.. బుమ్రా బౌలింగ్కి దిగడం ముంబై కొంపముంచింది.
హార్దిక్ చేసిన మరో తప్పు బ్యాటింగ్లో కనిపించింది. 16వ ఓవర్ ఐదో బంతికి డెవాల్డ్ బ్రెవిస్ ఔట్ అయ్యాడు. ఆ సమయంలో ముంబై 25 బంతుల్లో 40 పరుగులు చేయాల్సి ఉండగా 6 వికెట్లు చేతిలో ఉన్నాయి. హార్దిక్ బ్యాటింగ్కు వస్తాడని అందరూ అనుకున్నారు. కానీ అతడి కంటే ముందు టిమ్ డేవిడ్ వచ్చాడు. ఆ తర్వాతి ఓవర్లోనే వచ్చిన రషీద్ ఖాన్.. డేవిడ్, తిలక్ వర్మలను ఇబ్బంది పెట్టాడు. ఆ ఓవర్లో కేవలం 3 పరుగులే వచ్చాయి. ఈ తరుణంలోనే భారత మాజీ పేసర్ ఇర్ఫాన్ పఠాన్ కూడా రషీద్ను ఎదుర్కొనేందుకు హార్దిక్ భయపడుతున్నాడని, అందుకే డేవిడ్ని పంపించాడని విమర్శలు గుప్పించాడు. కట్ చేస్తే.. ఆఖర్లో ధోనిలా ఎంట్రీ ఇచ్చాడు హార్దిక్. 20వ ఓవర్లో మ్యాచ్ను ముగిస్తాడని భావిస్తే.. 4 బంతుల్లో 11 పరుగులు చేసిన పెవిలియన్ చేరాడు.