
2027 World Cup: వన్డే ప్రపంచకప్ సన్నాహకాల్లో భాగంగా దక్షిణాఫ్రికాతో ప్రత్యేక వన్డే సిరీస్ ఆడేందుకు టీమిండియా ఆసక్తి చూపుతోంది. ఈ క్రమంలో కెప్టెన్ శుభ్మన్ గిల్, ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ నేతృత్వంలోని టీమ్ మేనేజ్మెంట్ చేసిన అభ్యర్థన మేరకు బీసీసీఐ.. క్రికెట్ సౌత్ ఆఫ్రికాతో చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రపంచకప్లో ఎక్కువ మ్యాచ్లు దక్షిణాఫ్రికాలోనే జరగనున్న నేపథ్యంలో అక్కడే 4 నుంచి 6 వన్డేల సిరీస్ నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తున్నారు. ఐపీఎల్ 2027 తర్వాత భారత పర్యటనల షెడ్యూల్ ఇంకా పూర్తిగా ఖరారు కాలేదు. దీంతో ఫ్యూచర్ టూర్స్ ప్రోగ్రామ్లో ఈ సిరీస్కు అవకాశం కల్పించే వెసులుబాటు ఉందని సమాచారం.
2027 వన్డే ప్రపంచకప్కు ప్రధాన ఆతిథ్యం దక్షిణాఫ్రికాదే. ఈ నేపథ్యంలో టోర్నీకి ముందు అక్కడే వన్డేలు ఆడటం ద్వారా పరిస్థితులకు అలవాటు పడే అవకాశం టీమ్ఇండియాకు లభిస్తుంది. బీసీసీఐ, క్రికెట్ సౌత్ ఆఫ్రికా మధ్య ప్రస్తుతం జరుగుతున్న చర్చలు 4-6 మ్యాచ్ల వన్డే సిరీస్ చుట్టూనే సాగుతున్నాయి. అయితే సిరీస్ తేదీలు, పూర్తి షెడ్యూల్ ఇంకా ఖరారు కాలేదు.
ప్రపంచకప్ ప్రణాళికలో మ్యాచ్లతో పాటు ఆటగాళ్ల ఫిట్నెస్కు కూడా భారత జట్టు మేనేజ్మెంట్ ప్రాధాన్యం ఇస్తోంది. టీమ్ స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్ అడ్రియన్ లె రూక్స్ ఆటగాళ్ల కోసం ఫిట్నెస్ ప్రణాళికను రూపొందించినట్లు నివేదిక తెలిపింది. బీసీసీఐ సమీక్షా సమావేశానికి శుభ్మన్ గిల్ను కూడా ఆహ్వానించి, ఆటగాళ్ల ఫిట్నెస్ తెలుసుకునే ప్రయత్నం జరిగింది.
ఆటగాళ్ల ఫిట్నెస్కు సంబంధించి బీసీసీఐ, టీమ్ మేనేజ్మెంట్, ఇతర సంబంధిత విభాగాల మధ్య సమన్వయం పెంచాలని భావిస్తోంది. ముఖ్యంగా జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా ఫిట్నెస్పై దృష్టి ఉంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..