
PBKS X-Factors: క్రికెట్ ప్రపంచంలో ఆర్సీబీ తన సుదీర్ఘ నిరీక్షణకు తెరదించి 2025లో టైటిల్ నెగ్గగా, పంజాబ్ కింగ్స్ మాత్రం మరోసారి తృటిలో అవకాశాన్ని చేజార్చుకుంది. అయితే, 11 ఏళ్ల తర్వాత ఫైనల్ చేరడం పంజాబ్ అభిమానుల్లో కొత్త ఆశలు చిగురింపజేసింది. 2026 సీజన్ కోసం కోర్ టీమ్ను నిలబెట్టుకున్న పంజాబ్, ఈసారి మరింత కసితో బరిలోకి దిగుతోంది. ముఖ్యంగా ముగ్గురు ఆటగాళ్లు ప్రత్యర్థి జట్ల పాలిట సింహస్వప్నంలా మారబోతున్నారు.
2025 వేలానికి ముందు పంజాబ్ రిటైన్ చేసుకున్న ఇద్దరు ఆటగాళ్లలో శశాంక్ సింగ్ ఒకరు. తన విలక్షణమైన బ్యాటింగ్ శైలితో జట్టుకు వెన్నెముకగా మారారు. గత సీజన్లో 14 ఇన్నింగ్స్ల్లో 50 సగటుతో 350 పరుగులు చేసిన శశాంక్, క్లిష్ట సమయాల్లో జట్టును ఆదుకోవడంలో సిద్ధహస్తుడు. ముఖ్యంగా సీఎస్కేపై అతను ఆడిన 52 పరుగుల నాటౌట్ ఇన్నింగ్స్ అతనిలోని మ్యాచ్ విన్నర్ను పరిచయం చేసింది. టాప్ ఆర్డర్ విఫలమైనప్పుడు లోయర్ ఆర్డర్లో వచ్చి భారీ షాట్లతో మ్యాచ్ను మలుపు తిప్పగల సత్తా శశాంక్ సొంతం.
ముంబై ఇండియన్స్ నుంచి పంజాబ్ కింగ్స్లో చేరిన నెహాల్ వధేరా, జట్టు మిడిల్ ఆర్డర్కు కొండంత బలాన్ని ఇస్తున్నాడు. గ్లెన్ మాక్స్వెల్, మార్కస్ స్టోయినిస్ వంటి దిగ్గజాలు ఉన్నప్పటికీ, నెహాల్ తనదైన దూకుడుతో స్పిన్, పేస్ను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నాడు. మిడిల్ ఓవర్లలో 146 స్ట్రైక్ రేట్తో పరుగులు సాధించే నెహాల్, పంజాబ్కు కీలక స్కోరు అందించడంలో ప్రధాన పాత్ర పోషించనున్నాడు.
కివీస్ వేగవంతమైన బౌలర్ లాకీ ఫెర్గూసన్, పంజాబ్ బౌలింగ్ విభాగానికి ప్రధాన ఆయుధం. 150 కిలోమీటర్ల వేగంతో యార్కర్లు, బౌన్సర్లు సంధించే ఫెర్గూసన్, డెత్ ఓవర్లలో అత్యంత ప్రమాదకరమైన బౌలర్. అర్ష్దీప్ సింగ్తో కలిసి ఇతను చేసే బౌలింగ్ దాడి ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేయడంలో కీలకం కానుంది. మిడిల్ ఓవర్లలో వికెట్లు తీస్తూ రన్ రేట్ను అదుపు చేయడంలో ఫెర్గూసన్ ‘ఎక్స్-ఫాక్టర్’గా నిలవనున్నాడు.
శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో పంజాబ్ కింగ్స్ ఈసారి సమతూకంతో కనిపిస్తోంది. ఈ ముగ్గురు ఆటగాళ్లు తమ ఫామ్ను కొనసాగిస్తే, 2026లో పంజాబ్ కింగ్స్ తొలి ఐపీఎల్ టైటిల్ సాధించడం అసాధ్యమేమీ కాదు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..