PCB: పాకిస్తాన్ క్రికెట్ జట్టులో భారీ మార్పులు! ఆజాముడితో పాటు ఆ ఇద్దరిని పీకిపారేసిన సెలక్టర్లు!
పాకిస్తాన్ క్రికెట్ జట్టులో బాబర్ అజామ్, మహ్మద్ రిజ్వాన్, షాహీన్ అఫ్రిదిలను తప్పిస్తూ సెలక్షన్ కమిటీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇటీవల డీలా ప్రదర్శన, ఫామ్ లోపం, మేనేజ్మెంట్తో అసహకారం వంటి కారణాలతో వీరిని తాత్కాలికంగా వైట్ బాల్ టూర్లకు ఎంపిక చేయలేదు. T20I సిరీస్లను దృష్టిలో ఉంచుకుని యువ ఆటగాళ్లను ప్రోత్సహించేందుకు ఈ మార్పులు జరిగినట్టు తెలుస్తోంది. విండీస్, శ్రీలంక వంటి సిరీస్లకు ముందుగా బ్యాకప్ బలోపేతానికి పాక్ సీరియస్గా ఆలోచన చేస్తోంది.

పాకిస్తాన్ క్రికెట్లో మరోసారి భారీ సంచలనం చోటు చేసుకుంది. జాతీయ సీనియర్ పురుషుల సెలక్షన్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుని, టీంలో పెద్ద మార్పులకు శ్రీకారం చుట్టింది. ఈ నిర్ణయంతో బాబర్ అజామ్, మహ్మద్ రిజ్వాన్, షాహీన్ అఫ్రిదిలు తాత్కాలికంగా జట్టులోకి ఎంట్రీ పొందలేకపోయారు. దక్షిణాఫ్రికాలో మహ్మద్ రిజ్వాన్ నేతృత్వంలో పాకిస్తాన్ 2-0 తేడాతో T20 సిరీస్ను కోల్పోయింది, ఆ సిరీస్లో బాబర్ కూడా ఉన్నాడు. ఆ తరువాత న్యూజిలాండ్ పర్యటన, బంగ్లాదేశ్తో స్వదేశంలో జరిగే సిరీస్ల నుండి ఈ ఇద్దరినీ తొలగించారు. షాహీన్ అఫ్రిది న్యూజిలాండ్ పర్యటనలో ఉన్నప్పటికీ, తన పేలవ ప్రదర్శన కారణంగా నాలుగు మ్యాచ్ల్లో కేవలం రెండు వికెట్లు మాత్రమే తీసి చివరి మ్యాచ్కు డ్రాప్ అయ్యాడు. అంతేకాదు, జట్టు మేనేజ్మెంట్తో సహకరించని వ్యవహారశైలీపై కూడా విమర్శలు వచ్చాయి.
టెలికాం ఆసియా స్పోర్ట్ నివేదిక ప్రకారం, వైట్-బాల్ హెడ్ కోచ్ మైక్ హెస్సన్, కెప్టెన్ సల్మాన్ అఘాతో సంప్రదించిన అనంతరం, ఈ ముగ్గురు సీనియర్ ఆటగాళ్లను వైట్-బాల్ టూర్లకు ఎంపిక చేయకూడదని సెలక్షన్ కమిటీ నిర్ణయించింది. T20Iల్లో ఈ ఆటగాళ్ల స్ట్రైక్ రేట్, బ్యాటింగ్ ఫామ్ కూడా ఈ నిర్ణయంలో ప్రధాన పాత్ర పోషించాయి. అయితే బంగ్లాదేశ్ సిరీస్లో బాబర్, రిజ్వాన్లను తీసుకోవాలని హెస్సన్ అభిప్రాయపడినప్పటికీ, మాజీ స్టార్ ఆకిబ్ జావేద్, సులభమైన హోమ్ సిరీస్ కావడంతో యువ ఆటగాళ్లను పరీక్షించాలని సూచించి వారిని పక్కన పెట్టాడు. బంగ్లాదేశ్తో జూలై 20, 22, 24 తేదీల్లో మూడు మ్యాచ్ల T20I సిరీస్ తర్వాత, పాకిస్తాన్ వెస్టిండీస్తో ఐదు మ్యాచ్ల సిరీస్ కోసం ఫ్లోరిడా పయనించనుంది.
అలాగే, లాహోర్లో సన్నాహక సెషన్ల సందర్భంగా హెస్సన్ ఈ ముగ్గురు స్టార్ ఆటగాళ్లతో ప్రత్యేకంగా సమావేశమై ఎంపిక వ్యూహాలపై చర్చించారని, తన ప్రణాళికలను వారికి వివరించారని సమాచారం. అయితే, కెప్టెన్ సల్మాన్ అఘా మాత్రం షాహీన్ను జట్టులోకి తీసుకోవడాన్ని వ్యతిరేకించి యువ ఆటగాళ్లకు అవకాశాలివ్వాలని, బ్యాకప్ను బలోపేతం చేయాలని అభిప్రాయపడ్డాడు. వచ్చే ఏడాది భారత్ మరియు శ్రీలంకలో జరిగే వరల్డ్ కప్ను దృష్టిలో ఉంచుకుని పాకిస్తాన్ ఇప్పటికే ఆఫ్ఘనిస్తాన్, ఐర్లాండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, ఆస్ట్రేలియా వంటి జట్లతో T20I సిరీస్లను ఆడేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ నేపథ్యంలో, పాకిస్తాన్ జట్టు పూర్తిగా కొత్త రక్తంతో ముందుకు సాగాలని స్పష్టంగా సంకేతాలు ఇచ్చింది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..