సంజూ, అభిషేక్ కాదు.. మేం ఓడింది ఆ ఒక్కడి వల్లే.. ఆఫ్ఘాన్ కెప్టెన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!
Ibrahim Zadran Comments on T20 Series Defeat: ఆఫ్ఘనిస్తాన్ టీ20 సిరీస్ ఓటమిపై కెప్టెన్ ఇబ్రహీం జర్దాన్ విచారం వ్యక్తం చేశాడు. టీమిండియాపై 200+ లక్ష్యాన్ని నిర్దేశించడంలో విఫలమయ్యామని, ముఖ్యంగా పవర్ప్లేలో బ్యాటింగ్, బౌలింగ్లో జట్టు సరైన ప్రదర్శన చేయలేకపోయిందని వాపోయాడు. తెలుగోడి దెబ్బ గట్టిగానే పడిందంటూ చెప్పుకొచ్చాడు.

Ibrahim Zadran Comments on T20 Series Defeat: 2వ టీ20 మ్యాచ్లో భారత జట్టు చేతిలో ఆఫ్ఘనిస్తాన్ ఘోర ఓటమిని చవిచూసింది. దీంతో టీ20 సిరీస్ కోల్పోయింది. ఈ ఓటమిపై ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ ఇబ్రహీం జర్దాన్ మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ జట్టు లోపాలతోపాటు, ఆఫ్ఘాన్ ఓటమికి కారణాలు విశ్లేషించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ జట్టును భారత బౌలర్లు 159 పరుగులకే కట్టడి చేయగా, అనంతరం బ్యాటింగ్కు దిగిన టీమిండియా 14.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో భారత్ 3 మ్యాచ్ల టీ20 సిరీస్ను 2-0 తేడాతో కైవసం చేసుకుంది.
మ్యాచ్ అనంతరం పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్లో ఇబ్రహీం జర్దాన్ మాట్లాడుతూ, తాము టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగే సమయంలో 200కు పైగా టార్గెట్ ఉంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపాడు. అయితే, రెండు టీ20 మ్యాచ్లలోనూ ఆ అంచనాలని అందుకోలేకపోయామని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. టీమిండియా లాంటి బలమైన జట్టును ఎదుర్కోవాలంటే, అందులోని ఈ బ్యాటింగ్ పిచ్పై కనీసం 200కు పైగా టార్గెట్ ఉంటేనే గెలిచే అవకాశాలు ఉంటాయని జర్దాన్ స్పష్టం చేశాడు. తమ ప్రణాళికలు పూర్తిగా దెబ్బతిన్నాయని, ముఖ్యంగా టాప్ ఆర్డర్ వైఫల్యం మ్యాచ్ ఓటమిలో కీలక పాత్ర పోషించిందని ఆయన అంగీకరించాడు. ఈ సందర్భంగా నితీష్ కుమార్ రెడ్డి బౌలింగ్ను అభినందిస్తూ, తమ టాప్ ఆర్డర్ వైఫల్యానికి అతడి బౌలింగే కారణమని పేర్కొన్నాడు.
ఎక్కువమంది చదివినది: ఒకే ఓవర్లో 27 పరుగులు.. ఉతికారేసిన ఓపెనర్స్.. 20 బంతుల్లో ఇచ్చిపడేసిన శాంసన్..!
160 కంటే ఎక్కువ స్కోర్ సాధించలేకపోవడం తమకు పెద్ద సమస్యగా మారిందని జర్దాన్ వివరించాడు. 200 ప్లస్ పరుగులు ఎలా తీసుకెళ్లాలనే దానిపై ఎంత ప్రణాళికలు రచించుకున్నా, ఈ రెండు మ్యాచ్లలోనూ ఆ దిశగా సాగలేదని వాపోయాడు. సరైన ఉద్దేశ్యంతో ఆడి పవర్ ప్లేలో 60 పరుగులు సాధించగలిగితే 200కు పైగా స్కోర్ చేయడం సులభమవుతుందని, అయితే అలా జరగడం లేదని ఆయన అన్నాడు. భారత బౌలర్ల ప్రతిభను అభినందించాల్సిందేనంటూ జర్దాన్ పేర్కొన్నాడు.
తమ ఓటమి మొత్తం పవర్ ప్లే లోనే దాగి ఉందని ఇబ్రహీం జర్దాన్ విశ్లేషించాడు. బౌలింగ్లో పవర్ ప్లేలో వికెట్లు సాధించలేకపోతున్నామని, అలాగే బ్యాటింగ్లో పదికి మించి స్ట్రైక్ రేట్తో పరుగులు సాధించడం లేదని ఆయన వివరించాడు. ఈ బలహీనతలను సరిచేసుకుంటేనే టీమిండియాపై గెలుపు అవకాశాలు ఉంటాయని ఇబ్రహీం జర్దాన్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.
తొలుత బుమ్రా, ఆ తర్వాత నితీష్ కుమార్ ఇద్దరూ తమ జట్టును కోలుకోలేకుండా చేశారని తెలిపాడు. రాబోయే మ్యాచ్లలో ఈ లోపాలను సరిదిద్దుకొని మెరుగైన ప్రదర్శన చేయడానికి ప్రయత్నిస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
