Cigarette Prices: సిగరెట్లు తాగేవారికి బ్యాడ్ న్యూస్.. మరోసారి పెరిగిన ధరలు.. ఒకేసారి ఎంతంటే..?
ధూమపానం చేసేవారికి బ్యాడ్ న్యూస్. సిగరెట్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఫిబ్రవరిలో కేంద్రం పొగాపు ఉత్పత్తులపై జీఎస్టీ, అదనపు ఎక్సైజ్ సుంకం పెంచిన దగ్గర నుంచి ధరలు పెరుగుతుండగా.. ఇప్పుడు మరోసారి పెరిగాయి. ఐటీసీ పలు బ్రాండ్లపై ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది.

సిగరెట్లు తాగేవారికి బ్యాడ్ న్యూస్. గతంలో కేంద్రం పొగాకు ఉత్పత్తులపై జీఎస్టీ, సుంకాలు పెంచడంతో సిగరెట్ ధరలు ఒకేసారి భారీగా పెరిగిన విషయం తెలిసిందే. కంపెనీలన్నీ సిగరెట్ ధరలు పెంచడంతో ధూమపానం చేసేవారిపై మరింత భారం పడింది. అయితే ఇప్పుడు మరోసారి సిగరెట్ ధరలు పెరిగాయి. ఈ మేరకు ఐటీసీ కంపెనీ పలు బ్రాండ్ల ధరలను పెంచుతున్నట్లు తాజాగా ప్రకటించింది. పెంచిన ధరలతో సిగరెట్ ప్యాక్లు ఇప్పటికే మార్కెట్లోకి కూడా వచ్చేశాయి. ఏయే బ్రాండ్లపై ధరలు పెరిగాయనేది ఒకసారి చూద్దాం.
పెరిగిన క్లాసిక్ కనెక్ట్, గోల్డ్ ఫేక్ సూపర్ స్టార్ ధరలు
క్లాసిక్ కనెక్ట్, గోల్డ్ ఫ్లేక్ సూపర్ స్టార్ సిగరెట్ల బ్రాండ్ల ధరలు మరోసారి పెరిగాయి. ఈ మేరకు ధరలను ఐటీసీ పెంచగా.. కొత్త ధరలతో ప్యాక్లు మార్కెట్లోకి వస్తున్నాయి. కేంద్రం జీఎస్టీ, సుంకాలు పెంచిన తర్వాత పలు దఫాలుగా ధరలను పెంచారు. ఇప్పుడు కొద్ది నెలల తర్వాత మరోసారి ధరలను పెంచడంతో సిగరెట్ ప్రియులకు షాక్ తగిలినట్లయింది. దీంతో ఇకపై సిగరెట్ తాగాలంటే మరింత ఎక్కువ వెచ్చించాల్సి వస్తుంది. తాజా పెంపుతో క్లాసిక్ కనెక్ట్ 20 సిగరెట్ల ప్యాక్ ధర ఇంతకుముందు రూ.390గా ఉండగా.. ఇప్పుడు రూ.428కి పెరిగింది. అంటే 9.7 శాతం పెరిగింది. ఇక 2026 ప్రారంభంలో దీని ధర రూ.300 నుంచి రూ.360కి పెరగ్గా.. ఆ తర్వాత రూ.390కి పెరిగాయి.
ధరలు ఎందుకు పెరుగుతున్నాయంటే..
ఇక గోల్డ్ ఫ్లేక్ సూపర్ స్టార్ బ్రాండ్ ధర కూడా పెరిగింది. గతంలో 10 సిగరెట్ల ప్యాక్ ధర రూ.79గా ఉండగా.. ఇప్పుడు రూ.89కి పెరిగింది. సుమారు 12.7 శాతం పెరిగినట్లయింది. మే నెలలో ఈ సిగరెట్ ధర రూ.70 నుంచి రూ.79కి పెంచారు. ఇప్పుడు ఏకంగా రూ.89కి పెరిగింది. ఈ ఏడాది ఫిబ్రవరి 1 నుంచి పొగాకు ఉత్పత్తులపై కేంద్రం పన్నులు పెంచింది. సిగరెట్లను 40 శాతం జీఎస్టీ పరిధిలోకి తెచ్చింది. అలాగే వాటిపై అదనపు ఎక్సైజ్ సుంకం కూడా విధిస్తోంది. ఈ ట్యాక్సులు సిగరెట్ తయారీ కంపెనీలపై పన్ను భారాన్ని పెంచగా.. వాటిని తాగేవారికి బదిలీ చేస్తున్నాయి. ఈ ధర పెంపుకు సంబంధించి వార్తలు వెలువడిన తర్వాత బుధవారం ఉదయం ట్రేడింగ్లో ఐటీసీ షేర్లు 2.13 శాతం వరకు పెరిగి రూ. 263.50కి చేరుకున్నాయి. కాగా రానున్న రోజుల్లో సిగరెట్ల ధరలు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ధూమపానం చేసేవారి సంఖ్య తగ్గించాలని ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగా అధిక పన్నులు విధిస్తోంది. దీని వల్ల కొంతమంది అయినా ధూమపానానికి దూరమవుతారని భావిస్తోంది.
