IPL 2021: రాజస్థాన్ను కట్టడి చేసిన జడ్డూ, అలీ.. చెన్నై ఖాతాలో మరో విజయం..
CSK vs RR highlights: చెన్నై సూపర్ కింగ్స్.. సూపర్ ఇన్నింగ్స్ ఆడి రెండో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. బ్యాట్స్మెన్ సమిష్టి కృషి..
CSK vs RR highlights: చెన్నై సూపర్ కింగ్స్.. సూపర్ ఇన్నింగ్స్ ఆడి రెండో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. బ్యాట్స్మెన్ సమిష్టి కృషి.. బౌలర్ల నిలకడ.. అద్భుత ఫీల్డింగ్ తో ఈ ఐపీఎల్ సీజన్లో చెన్నై మరో విజయాన్ని నమోదు చేసుకుంది. జట్టు సభ్యులంతా అందరూ రాణించడంతో భారీ స్కోరు చేసిన ధోనీ సేన.. బౌలింగ్లో గొప్ప ప్రదర్శనతో రాజస్థాన్ రాయల్స్ను కట్టిపడేసింది. జడేజా ఒకే ఓవర్లో రెండు వికెట్లు పడగొట్టి మ్యాచ్ను చెన్నై వైపు తిప్పగా.. మొయిన్ అలీ మూడు వికెట్లతో రాయల్స్ను పూర్తిగా కుప్పకూల్చాడు. ఫలితంగా కెప్టెన్గా 200వ మ్యాచ్లో ధోని విజయాన్ని నమోదు చేసుకున్నాడు. సోమవారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్.. 45 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్పై గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై 20 ఓవర్లలో 9 వికెట్లకు 188 పరుగులు చేసింది. డుప్లెసిస్ (33), రాయుడు (27), అలీ (26) రాణించగా.. మిగిలిన సభ్యులంతా తలా కొన్ని పరుగులు చేశారు. రాయల్స్ బౌలర్లలో కారియా 3, మోరిస్ 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో రాయల్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 143 పరుగులు మాత్రమే చేసింది. బట్లర్ (49) కాస్త పోరాడాడు. చెన్నై బౌలర్లలో మొయిన్ అలీ 3, సామ్ కరన్, రవీంద్ర జడేజా చెరో 2 వికెట్లు పడగొట్టారు. అలీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన చెన్నైకి శుభారంభం దక్కలేదు. ఇన్నింగ్స్ తొలి బంతికే ఔటయ్యే ప్రమాదం నుంచి బయటపడ్డ రుతురాజ్ గైక్వాడ్ (10) కాసేపటికే పెవిలియన్ చేరాడు. అయితే డుప్లెసిస్ ఉన్నంతసేపు ధాటిగా ఆడి ఆకట్టుకున్నాడు. ఉనాద్కత్ వేసిన నాలుగో ఓవర్లో 4,4,6,4 కొట్టిన డుప్లెసిస్ను మోరిస్ ఔట్ చేశాడు. దీంతో పవర్ప్లే ముగిసే సరికి ధోనీ సేన 46/2తో నిలిచింది. ఆ తర్వాత అలీ (26), రాయుడు (27) ఆడి ఔట్ కాగా.. రైనా (18) కూడా వెనుదిరిగాడు. కాసేపటికే కెప్టెన్ ధోనీ (18) కూడా ఔటయ్యాడు. ఆఖర్లో సామ్ కరన్ (13), బ్రావో (8 బంతుల్లో 20 నాటౌట్; 2 ఫోర్లు, ఒక సిక్సర్) ధాటిగా ఆడటంతో చెన్నై ఈ స్కోరు చేయగలిగింది.
భారీ లక్ష్యఛేదనతో దిగిన రాజస్థాన్ రాయల్స్.. ఓపెనర్ వోహ్రా (14) త్వరగానే డగౌట్ చేరినా.. బట్లర్ దంచికొట్టాడు. కెప్టెన్ శాంసన్ (1) త్వరగానే ఔటైనా.. దూబే (17) సహకారంతో బట్లర్ రాజస్థాన్ ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. ఫలితంగా 10 ఓవర్లు ముగిసే సరికి రాజస్థాన్ 81/2తో నిలిచింది. అనంతరం జడేజా ఒకే ఓవర్లో వీరిద్దరినీ ఔట్చేయడంతో రాజస్థాన్ కష్టాల్లో కూరుకుపోయింది. ఆ తర్వాత వచ్చిన డేవిడ్ మిల్లర్ (2), రియాన్ పరాగ్ (3), క్రిస్ మోరిస్ (0)లను మొయిన్ అలీ ఒకే ఓవర్లో ఔట్ చేసి పెవిలియన్ బాట పట్టించాడు. తెవాటియా (20), ఉనాద్కత్ (24) పోరాటం ఓటమి అంతరాన్ని తగ్గించేందుకే పనిచేసింది.
Also Read: