ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన కృష్ణ దేవాలయం ఇదే.. మేఘాల మధ్య కొలువైన కన్నయ్య!

Yulla Kanda Krishna Temple: హిమాచల్ ప్రదేశ్‌లోని కిన్నౌర్ జిల్లాలో సముద్ర మట్టానికి 12,778 అడుగుల ఎత్తులో శ్రీకృష్ణుడు కొలువై ఉన్నాడు. సరస్సు మధ్యలో ఉన్న ఈ అరుదైన ఆలయానికి మహాభారత కాలంతో సంబంధం ఉందని నమ్మకం. ఈ దివ్యక్షేత్రం విశేషాలేంటో తెలుసుకుందాం.

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన కృష్ణ దేవాలయం ఇదే.. మేఘాల మధ్య కొలువైన కన్నయ్య!
World's Highest Krishna Temple

Updated on: Sep 04, 2026 | 3:47 PM

Yulla Kanda Krishna Temple Telugu: హిమాలయ పర్వతాల ఒడిలో, మేఘాలను తాకేంత ఎత్తులో శ్రీకృష్ణుడు కొలువై ఉన్న అరుదైన పుణ్యక్షేత్రం ఒకటి ఉంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శ్రీకృష్ణ దేవాలయంగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయం హిమాచల్ ప్రదేశ్‌లోని కిన్నౌర్ జిల్లాలోని యుల్లా కంద ప్రాంతంలో ఉంది. సముద్ర మట్టానికి సుమారు 12,778 అడుగుల (3,895 మీటర్లు) ఎత్తులో ఉన్న ఈ ఆలయం ప్రకృతి అందాల మధ్య భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

హిమాలయాల్లోని రోరా లోయ ప్రాంతంలో ఉన్న ఒక చిన్న సరస్సు మధ్యలో ఈ శ్రీకృష్ణ ఆలయం గంభీరంగా నిలిచి ఉంటుంది. చుట్టూ ఎత్తైన పర్వతాలు, మంచుతో కప్పబడిన శిఖరాలు, స్వచ్ఛమైన ప్రకృతి మధ్య కొలువైన కన్నయ్య దర్శనం భక్తులకు అపూర్వమైన ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుందని చెబుతారు. ముఖ్యంగా కృష్ణ జయంతి సందర్భంగా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడికి చేరుకుంటారు.

మహాభారత కాలంతో సంబంధం..

ఈ ఆలయానికి మహాభారత కాలంతో సంబంధం ఉందని స్థానిక కథనాలు చెబుతున్నాయి. పాండవులు తమ వనవాస సమయంలో హిమాలయ ప్రాంతాల్లో సంచరించినప్పుడు శ్రీకృష్ణుడిని ఆరాధించేందుకు ఇక్కడ ఒక చిన్న సరస్సును నిర్మించి, ఆలయాన్ని ఏర్పాటు చేశారని విశ్వసిస్తారు. ఆలయంలో ఉన్న శ్రీకృష్ణుని విగ్రహం స్వయంభూగా వెలసిందని భక్తుల నమ్మకం.

ఇవి కూడా చదవండి

కిన్నౌరీ టోపీ వెనుక ఆసక్తికరమైన నమ్మకం

ఈ ఆలయ సరస్సుకు సంబంధించిన ఒక ప్రత్యేక సంప్రదాయం కూడా ఉంది. భక్తులు తమ సంప్రదాయ కిన్నౌరీ టోపీని తలక్రిందులుగా సరస్సులో ఉంచుతారు. అది నీటిలో మునిగిపోకుండా తేలితే, రాబోయే రోజుల్లో అదృష్టం, సుఖశాంతులు కలుగుతాయని స్థానికులు విశ్వసిస్తారు. ఈ ఆసక్తికరమైన ఆచారం ఈ దేవాలయ ప్రత్యేకతల్లో ఒకటిగా నిలిచింది.

12 కిలోమీటర్ల కఠినమైన ట్రెక్కింగ్..

ఈ దివ్యక్షేత్రానికి చేరుకోవడం అంత సులభం కాదు. వాహనాలు ఆలయం వరకు వెళ్లే అవకాశం లేకపోవడంతో భక్తులు కొంత దూరం వరకు ప్రయాణించి, అక్కడి నుంచి సుమారు 11 నుంచి 12 కిలోమీటర్ల మేర కఠినమైన పర్వత మార్గంలో ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. ఎత్తైన కొండలు, కఠినమైన దారులు దాటుకుని చేరుకునే ఈ ప్రయాణం భక్తులకు ఒక ప్రత్యేక అనుభూతిని ఇస్తుంది.

భారీగా మంచు కురిసే శీతాకాలంలో ఈ ప్రాంతం పూర్తిగా మంచుతో కప్పబడిపోతుంది. దీంతో ఆలయాన్ని మూసివేస్తారు. సాధారణంగా మే నుంచి అక్టోబర్ వరకు భక్తుల దర్శనం, పూజల కోసం ఆలయం అందుబాటులో ఉంటుంది.

ప్రకృతి అందాలు, పురాణ విశ్వాసాలు, కఠినమైన పర్వత ప్రయాణం, శ్రీకృష్ణుడిపై అపారమైన భక్తి.. ఇలా ఎన్నో విశేషాల సమ్మేళనంగా యుల్లా కంద శ్రీకృష్ణ దేవాలయం నిలుస్తోంది. మేఘాల మధ్య కొలువైన ఈ కన్నయ్యను దర్శించుకోవడం భక్తులకు జీవితంలో మర్చిపోలేని ఆధ్యాత్మిక అనుభూతిగా మారుతుందని చెప్పడంలో సందేహం లేదు.

(Disclaimer: ఈ కథనంలోని చారిత్రక, పురాణ సంబంధిత వివరాలు స్థానిక విశ్వాసాలు, ప్రచారంలో ఉన్న కథనాల ఆధారంగా అందించబడ్డాయి. భక్తుల నమ్మకాలు ప్రాంతాన్నిబట్టి మారవచ్చు.)

Loading...
Unable to load recommendations.
Follow Us