TTD: జనసంద్రంగా మారిన తిరుగిరులు.. వీఐపీ బ్రేక దర్శన వేళల్లో మార్పులు.. కీలక నిర్ణయాలు తీసుకున్న ఈవో..

తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరుగుతోంది. దసరా సెలవులు ముగింపు దశకు రావడం, మొక్కులు తీర్చుకునేందుకు వచ్చిన భక్తులతో తిరుగిరులు జనసంద్రంగా మారాయి. ప్రస్తుతం తిరుమలకు భక్తులు భారీగా తరలి..

TTD: జనసంద్రంగా మారిన తిరుగిరులు.. వీఐపీ బ్రేక దర్శన వేళల్లో మార్పులు.. కీలక నిర్ణయాలు తీసుకున్న ఈవో..
Tirumala Srivari Temple

Updated on: Oct 09, 2022 | 5:31 PM

తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరుగుతోంది. దసరా సెలవులు ముగింపు దశకు రావడం, మొక్కులు తీర్చుకునేందుకు వచ్చిన భక్తులతో తిరుగిరులు జనసంద్రంగా మారాయి. ప్రస్తుతం తిరుమలకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు. స్వామి వారి దర్శనానికి దాదాపు 48 గంటల సమయం పడుతోంది. ఈ పరిస్థితులపై టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్పందించారు. డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో భక్తులతో మాట్లాడారు. పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తిరుమలలో ఉన్న గదుల కేటాయింపు వ్యవస్థను తిరుపతిలో చేపట్టాలని ఈవో నిర్ణయించారు. ఇలా చేయడం ద్వారా తిరుమలలో గదులు దొరకని భక్తులు తిరుపతిలో బస చేసే అవకాశం లభిస్తుందని చెప్పారు. ఈ విధానాన్ని త్వరలోనే ప్రయోగాత్మకంగా అమలు చేస్తామని వెల్లడించారు. కంపార్ట్‌మెంట్లలో రాత్రి వేళ నుంచి వేచి ఉండే సామాన్యులకు ఉదయం త్వరగా దర్శనం అయ్యేలా వీఐపీ బ్రేక్ దర్శనంలో మార్పులు తీసుకొస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సమయాన్ని ఉదయం 10 గంటలకు మారుస్తామని, ట్రయల్ ను నిర్వహిస్తామని చెప్పారు. అంతే కాకుండా త్వరలో టైమ్‌స్లాట్‌ టోకెన్లను ప్రారంభిస్తామని వివరించారు.

కొండపై ఉన్న యాత్రికుల వసతి సముదాయాలన్నీ భక్తులతో నిండిపోయాయి. దీంతో భక్తులు వసతి కోసం అవస్థలు పడుతున్నారు. గదులు ఖాళీ లేకపోవడంతో శ్రీవారి భక్తులకు ఇక్కట్లు తప్పడం లేదు. ఇదే విధంగా మరో నాలుగు రోజుల పాటు భక్తుల రద్దీ ఉండే అవకాశం ఉందని టీటీడీ అధికారులు చెబుతున్నారు. గంటల తరబడి స్వామివారి దర్శనం కోసం ఎదురు చేస్తున్న భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారు. భోజనం, మంచినీరు అందించేందుకు టీటీడీ యాజమాన్యం విస్త్రృతంగా ఏర్పాట్లు చేసింది.

తిరుమలలో స్వామివారికి జరిగే నిత్య, వార సేవలు, ఉత్సవాలను ఇతర ప్రాంతాల్లోనూ నిర్వహిస్తున్నారు. అక్కడి భక్తులు దర్శించేందుకు వీలుగా దేశ వ్యాప్తంగా శ్రీ వేంకటేశ్వరస్వామి వైభవోత్సవాలు నిర్వహిస్తున్నాం. అక్టోబరు 11 నుంచి 15 వరకు హైదరాబాద్‌ ఎన్టీఆర్‌ స్టేడియంలో ఈ ఉత్సవాలు జరగనున్నాయి. అక్టోబరు 11న వసంతోత్సవం, 12న సహస్ర కలశాభిషేకం, 13న తిరుప్పావడ, 14న నిజపాద దర్శనం, 15న సాయంత్రం 6.30 నుంచి 8.30 గంటల వరకు శ్రీనివాస కల్యాణం జరుగనున్నాయి. డిసెంబరులో ఒంగోలు, జనవరిలో దిల్లీలో వైభవోత్సవాలు నిర్వహిస్తాం. విశాఖపట్నం, కర్నూలు జిల్లా యాగంటిలో కార్తీక దీపోత్సవాలు నిర్వహిస్తాం. ఏజన్సీ ప్రాంతాలైన అనకాపల్లి, అరకు, రంపచోడవరం తదితర ప్రాంతాల్లో అక్టోబర్ లో శ్రీనివాస కల్యాణాలు నిర్వహిస్తాం.

ఇవి కూడా చదవండి

– ధర్మారెడ్డి, టీటీడీ ఈవో

మరో వైపు.. సెప్టెంబరు నెలలో శ్రీవారి హుండీకి రూ.122 కోట్లు ఆదాయం వచ్చింది. 21.12 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 98.44లక్షల లడ్డు ప్రసాదాలను విక్రయించారు. గరుడ సేవ నాడు దాదాపు 3 లక్షల మందికి పైగా భక్తులకు వాహనసేవ దర్శనభాగ్యం కల్పించారు. టీటీడీలోని అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది కృషితో సాలకట్ల బ్రహ్మోత్సవాలను ఎలాంటి అవాంతరాలు, అడ్డంకులు లేకుండా విజయవంతంగా పూర్తి చేశామని ఈవో ధర్మారెడ్డి ప్రశంసించారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us