AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ ఏడాది తిరుమల శ్రీవారికి రెండుసార్లు బ్రహ్మోత్సవాలు.. సాలకట్ల, నవరాత్రి ఉత్సవాల ప్రత్యేకత ఇదే

Tirumala Brahmotsavam 2026 Telugu: 2026లో అధిక మాసం కారణంగా తిరుమల శ్రీవారికి రెండుసార్లు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. సెప్టెంబర్‌లో సాలకట్ల, అక్టోబర్‌లో నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ రెండు ఉత్సవాల మధ్య ఉన్న తేడాలేంటి? ఏ రోజు ఏ వాహనసేవ జరుగుతుంది? పూర్తి వివరాలు తెలుసుకోండి.

ఈ ఏడాది తిరుమల శ్రీవారికి రెండుసార్లు బ్రహ్మోత్సవాలు.. సాలకట్ల, నవరాత్రి ఉత్సవాల ప్రత్యేకత ఇదే
Tirumala Brahmotsavam 2026 Telugu
Rajashekher G
|

Updated on: Sep 09, 2026 | 8:50 AM

Share

Tirumala Brahmotsavam 2026 Telugu: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంటే భక్తులకు అత్యంత పవిత్రమైన ఆధ్యాత్మిక వేడుక. ప్రతి ఏడాది జరిగే ఈ మహోత్సవాలను దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు తిరుమలకు తరలివస్తారు. అయితే అధిక మాసం కారణంగా కొన్ని సంవత్సరాల్లో శ్రీవారికి రెండుసార్లు బ్రహ్మోత్సవాలు నిర్వహించడం విశేషం. 2026లో కూడా ఇదే విధంగా సాలకట్ల, నవరాత్రి బ్రహ్మోత్సవాలు రెండూ జరగనున్నాయి.

సాలకట్ల, నవరాత్రి బ్రహ్మోత్సవాలు అంటే?

సాధారణంగా భాద్రపద మాసంలో జరిగే బ్రహ్మోత్సవాలను సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంటారు. ఇవి ధ్వజారోహణంతో ప్రారంభమై ధ్వజావరోహణంతో ముగుస్తాయి. ధ్వజారోహణ సమయంలో గరుడధ్వజాన్ని ఎగురవేసి దేవతలను, అష్టదిక్పాలకులను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించడం సంప్రదాయం.

ఇక ఆశ్వయుజ మాసంలోని నవరాత్రుల సమయంలో నిర్వహించే ఉత్సవాలను నవరాత్రి బ్రహ్మోత్సవాలు అంటారు. వీటిలో ధ్వజారోహణం, ధ్వజావరోహణం ఉండవు. సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో జరిగే పెద్ద రథోత్సవానికి బదులుగా నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో స్వామివారు స్వర్ణ రథంపై భక్తులకు దర్శనమిస్తారు.

సెప్టెంబర్‌లో సాలకట్ల బ్రహ్మోత్సవాలు

2026లో అధిక మాసం రావడంతో సెప్టెంబర్ 15 నుంచి 23 వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. సెప్టెంబర్ 14న రాత్రి అంకురార్పణ కార్యక్రమంతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు. సెప్టెంబర్ 15న సాయంత్రం ధ్వజారోహణం నిర్వహిస్తారు. తొమ్మిది రోజుల పాటు మలయప్ప స్వామివారు పెద్దశేష, చిన్నశేష, హంస, సింహ, ముత్యపుపందిరి, కల్పవృక్ష, సర్వభూపాల, మోహినీ, గరుడ, హనుమంత, గజ, సూర్యప్రభ, చంద్రప్రభ, అశ్వ తదితర వాహనాలపై తిరుమాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు.

గరుడసేవ.. రథోత్సవం ప్రత్యేక ఆకర్షణ

బ్రహ్మోత్సవాల్లో గరుడసేవకు అత్యంత విశిష్టమైన స్థానం ఉంది. గరుడ వాహనంపై కొలువుదీరిన శ్రీమలయప్ప స్వామివారిని దర్శించుకుంటే పుణ్యం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. అలాగే స్వర్ణ రథోత్సవం, రథోత్సవం, చక్రస్నానం వంటి ఘట్టాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటాయి. సెప్టెంబర్ 23న శ్రవణా నక్షత్రాన్ని పురస్కరించుకుని పవిత్ర పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహిస్తారు. అనంతరం ధ్వజావరోహణంతో సాలకట్ల బ్రహ్మోత్సవాలు శాస్త్రోక్తంగా ముగుస్తాయి.

అక్టోబర్‌లో మరోసారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు

సాలకట్ల బ్రహ్మోత్సవాలు ముగిసిన కొద్ది రోజులకే అక్టోబర్ 12 నుంచి 20 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. దీంతో 2026లో తిరుమలలో శ్రీవారి వైభవాన్ని రెండుసార్లు ప్రత్యక్షంగా వీక్షించే అరుదైన అవకాశం భక్తులకు లభించనుంది. శ్రీవారి వాహనసేవలను భక్తిశ్రద్ధలతో దర్శించుకుని, స్వామివారి సేవలో పాల్గొంటే ఆయన అనుగ్రహం లభిస్తుందని భక్తుల విశ్వాసం. అందుకే తిరుమల బ్రహ్మోత్సవాలు కేవలం ఉత్సవాలు మాత్రమే కాకుండా భక్తి, ఆధ్యాత్మికత, సంప్రదాయాల సమ్మేళనంగా నిలుస్తాయి.

(Disclaimer: ఈ కథనంలోని ఆధ్యాత్మిక విశేషాలు, భక్తుల విశ్వాసాలు సంప్రదాయాలు, పురాణాల ఆధారంగా పేర్కొనబడ్డాయి. వీటిని విశ్వాసపరమైన విషయాలుగా మాత్రమే పరిగణించాలి.)

Follow Us