
ప్రపంచ ప్రఖ్యాత పూరి జగన్నాథ రథయాత్ర కేవలం మతపరమైన ఆచారం మాత్రమే కాదు. ఐక్యత, భక్తికి చిహ్నంగా కూడా పరిగణించబడుతుంది. ఈ పవిత్ర రథ ప్రయాణంలో జగన్నాథుడు, అతని సోదరుడు బాలభద్రుడు, సోదరి సుభద్ర తమ రథాలపై నగరాన్ని పర్యటించడానికి వెళతారు. ఈ సమయంలో మూడు రథాలు ఒక ప్రత్యేక ప్రదేశం ముందు ఆగుతాయి. ఈ ప్రదేశం జగన్నాథుని ముస్లిం భక్తుడు సాలబేగ సమాధి. ఇది జగన్నాథ రథయాత్ర సంప్రదాయం. ఇది శతాబ్దాలుగా కొనసాగుతోంది. దీని వెనుక ఒక పౌరాణిక కథ కూడా ఉంది. అది ఏమిటో తెలుసుకుందాం.
జగన్నాథ రథయాత్ర పూరీ జగన్నాథ ఆలయం నుంచి దాదాపు 200 మీటర్ల దూరంలో ఆగుతుంది. అక్కడ కొంత సమయం ఆగిన తర్వాత.. ఈ మూడు రథాలు మళ్ళీ ముందుకు కదులుతాయి. ఇలా చేయడం వెనుక ఉన్న రీజన్ ఏమిటంటే..
సమాధి ముందు జగన్నాథ రథయాత్ర ఆగుతుందా?
పూర్వీకుల కథనం ప్రకారం సాలబేగ ఒక మొఘల్ సుబేదార్ కుమారుడు. అతను ఏదో పని కోసం పూరీ చేరుకున్న తర్వాత.. అక్కడ అతను జగన్నాథుని మహిమ గురించి విన్నాడు. అది విన్న తర్వాత అతనికి భగవంతుని దర్శనం చేసుకోవాలనే కోరిక కలిగింది. అయితే పురీ ఆలయ సాంప్రదాయ నిబంధనల ప్రకారం.. సాలబేగ ముస్లిం కావడం వల్ల.. అతనిని పూరీ జగన్నాథ ఆలయంలోకి ప్రవేశించడానికి అనుమతించలేదు. అయినప్పటికీ.. అతనికి స్వామిమీద కలిగిన భక్తి తగ్గలేదు. అతను నిరంతరం జగన్నాథుని పూజిస్తూ భజనలు, కీర్తనలు పాడటం కొనసాగించాడు.
అనారోగ్య బారిన పడిన సాలబేగ
ఒకసారి సాలబేగ అనారోగ్యానికి గురయ్యాడు. అప్పుడు తనకు పూరీ రథయాత్రలో పాల్గొనాలని ఉంది. తనకు అనారోగ్యాన్ని తగ్గించమని జగన్నాథుడిని ప్రార్థించాడట. అయితే జగన్నాథ రథయాత్ర ప్రారంభమయ్యే సమయానికి సాలబేగ ఆలయానికి చేరుకోలేకపోయాడు. అటువంటి పరిస్థితిలో జగన్నాథుని రథం అకస్మాత్తుగా సాలబేగ నివసిస్తున్న ఇంటి ముందు ఆగిపోయింది. లక్షలాది మంది ప్రయత్నించినా, రథం ఒక్క అంగుళం కూడా కదలలేదు. ఇది చూసి అందరూ చాలా కలత చెందారు. అప్పుడు ఆలయ ప్రధాన పూజారికి ఒక కల వచ్చింది.. అందులో జగన్నాథుడు ‘తన ప్రియమైన భక్తుడు సాలబేగ కోసం వేచి ఉండటానికి ఆగిపోయానని’ చెప్పాడు.
ఆ రథం ఏడు రోజులు అక్కడే ఉంది.
మత విశ్వాసాల ప్రకారం జగన్నాథుని రథం ఏడు రోజుల పాటు అక్కడే ఉండిపోయింది. ఆలయ ఆచారాలన్నీ రథంలోనే పూర్తి చేశారు. సాలబేగ కోలుకుని భగవంతుని దర్శనం చేసుకున్న తర్వాత రథం ముందుకు కదలిందట.
ఈ సంప్రదాయం నేటికీ పాటిస్తున్నారు
సాలబేగ భక్తిని గౌరవించటానికి.. నేటికీ ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. ప్రతి సంవత్సరం రథయాత్ర సమయంలో జగన్నాథుడు, బాలభద్రుడు, సుభద్రల రథాలు సాలబేగ సమాధి ముందు కొద్దిసేపు ఆగుతాయి. ఈ చర్య సాలబేగ కు నివాళి అర్పించడానికి ఒక మార్గం మాత్రమే కాదు.. దేవుని దయ, ప్రేమ అందరిపైన ఒకేలా ఉంటుందని కూడా నిరూపిస్తుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు