తెలుగువారు ఉగాదిగా, మహరాష్టీయులు గుడిపాడ్వగా, మలయాళీలు విషుగా, తమిళులు పుత్తాండుగా జరుపుకునే సంవత్సరాది!

కాలాన్ని నియంత్రించేది ఆ సృష్టికర్తే...! కాల విభజన చేసింది కూడా ఆయనే! మూడు కాలాలు, ఆరు రుతువులు, పన్నెండు మాసాలు ఇచ్చి పండుగలు చేసుకోమన్నాడు.

తెలుగువారు ఉగాదిగా, మహరాష్టీయులు గుడిపాడ్వగా, మలయాళీలు విషుగా, తమిళులు పుత్తాండుగా జరుపుకునే సంవత్సరాది!
Follow us

| Edited By: Phani CH

Updated on: Apr 12, 2021 | 2:15 PM

కాలాన్ని నియంత్రించేది ఆ సృష్టికర్తే…! కాల విభజన చేసింది కూడా ఆయనే! మూడు కాలాలు, ఆరు రుతువులు, పన్నెండు మాసాలు ఇచ్చి పండుగలు చేసుకోమన్నాడు. చైత్రశుద్ధ పాడ్యమినాడే బ్రహ్మ సృష్టిని ఆరంభించాడు. అందుకే మనం ఆ రోజున యుగాది జరుపుకుంటాం. మనమే కాదు. పక్కనే ఉన్న కర్నాటక. పొరుగునే ఉన్న మహరాష్ర్ట కూడా ఇదే రోజున సంవత్సరాదిని జరుపుకుంటాయి.. మరికొన్ని ప్రాంతాలలో మేష సంక్రాంతి రోజున సంవత్సరాదిగా జరుపుకుంటారు. భిన్న సంస్కృతులతో, భిన్న నాగరికతలలో విలసిల్లుతోన్న మన భారతదేశంలో నూతన సంవత్సర వేడుకలు ఒక్కో చోట ఒక్కో రకంగా జరుగుతాయి. చైత్రమాసం చిగురువిచ్చుకోవడానికి సిద్ధమవుతోంది. మత్తకోయిలలు గొంతును శ్రుతి చేసుకుంటున్నాయి. మావిచిగురు హరితవర్ణాన్ని సంతరించుకోవడానికి ఉబలాటపడుతున్నాయి.. మల్లెలు ఘుమఘుమలను వెదజల్లడానికి తహతహలాడుతున్నాయి. ఆమని రాకకోసం అవని ఆత్రంగా ఎదురుచూస్తోంది.. ఈ శుభసమయం దగ్గరపడింది. కొత్త సంవత్సరానికి ముహూర్తం ఆస్నమయ్యింది..

Ugaadi (1)

ఉగాది- తెలుగువారికి సంవత్సరాది! కొత్త ఆశలనే లగేజ్‌ను, సరికొత్త ఆశయాలనే బ్యాగేజ్‌ను.. ఆకాంక్షలనే మంజూషాన్ని మోసుకుని ప్లవ నామ సంవత్సరం వచ్చేస్తోంది… ఆ అదృష్టదాయని రాకకోసం పల్లె…పట్నం అన్న తేడా లేకుండా అంతటా పండగశోభ పరుచుకుంది. తెలుగు లోగిళ్లు అందంగా ముస్తాబయ్యి కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతున్నాయి. పాడు కరోనా వచ్చి ప్రాణాలు తీసేస్తుంది కానీ లేకపోతే మాత్రం మన సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ కవి సమ్మేళనాలు, సాంస్కృతిక కార్యక్రమాలకు బోలెడన్ని జరిగేవి. ఆ విషయాన్ని వదిలేస్తే ఓటమి వెనుక గెలుపు. చీకటి వెనుక వెలుగు. విషాదం తర్వాత ఆనందం. దు:ఖం వెంటనే సంతోషం. ఇదే జీవితం. దానికి ప్రతీకే ఉగాది. అందుకే తీపి, చేదు, వగరు, పులుపు, ఉప్పు, కారం కలబోతతో ఉగాది పచ్చడిని తయారు చేస్తారు. తెలుగువారికి ఇది తొలి పండుగ. జీవితంలో తారసపడే ఆటు పోట్లను ఎదుర్కొనే మనోస్థయిర్యాన్ని, మనో ధైర్యాన్ని కల్పించాలని యుగ పురుషుడిని వేడుకునే రోజు ఇది!

ఒక్క తెలుగువారికే కాదు- మహరాష్ట్రీయులు, కన్నడిగులు కూడా ఇదే రోజును సంవత్సరాదిగా జరుపుకుంటారు. మహరాష్ర్టలో గుడి పాడ్వాగా జరుపుకుంటారు. పాడ్వా అంటే పాడ్యమి. బ్రహ్మదేవుడు ఈ రోజున సృష్టిని ఆరంభించినందుకు గుర్తుగా బ్రహ్మధ్వజాన్ని ఇంటి ముందు నిలబెడతారు. ఓ వెదురు కర్రకు జరీ ఉన్న ఎరుపు పసుపు కలగలిసిన పట్టు వస్ర్తం చుడతారు. మామిడాకులు, వేపాకులను అలంకరిస్తారు. పటిక బెల్లాన్ని లేదా బెల్లాన్ని అమర్చుతారు. ఓ ఎర్రని బంతిపూల దండను వేస్తారు. వెదురుకర్రపై భాగంలో వెండి చెంబును కానీ. రాగి చెంబును కాని బోర్లిస్తారు. ఆపై ఆ కర్రను నిటారుగా నిలబడతారు. అందరికీ కనిపించేట్టుగా ఇంటి గుమ్మం దగ్గర ఎత్తైన చోట ఈ గుడిని పెడతారు. ఇదే బ్రహ్మధ్వజం లేదా గుడి. ప్రకృతికి కృతజ్ఞతలు చెప్పడమే దీని వెనుకున్న పరమార్థం. నిజానికి గుడిపాడ్వా వేడుకలు ముంబాయిలో ఘనంగా జరుగుతాయి. రెండేళ్లుగా దుష్ట కరోనా ఆ వేడుకలను లేకుండా చేసింది. ఆ మహమ్మారి జాడ లేకుండా ఉండి ఉంటే మాత్రం బ్రహ్మండమైన ఊరేగింపు జరిగేది. అసలు ఆ ఊరేగింపు మామూలుగా ఉండదు.. చూసి తీరాల్సిందే! పండగకు చాలా రోజుల ముందు ఏర్పాట్లు చేసుకుంటారు మహారాష్ర్ట ప్రజలు. ఇదంతా ప్రీ కరోనా కాలంలో. అన్నట్టు ఇదే రోజున కొంకణ్‌ వాసులు కూడా పండుగ చేసుకుంటారు. గుడి పడ్వా రోజున షడ్రుచుల వంటకాలు చేస్తారు. శ్రీఖండ్‌ అనే వంటకాన్ని తప్పనిసరిగా చేస్తారు. కొంకణివాసులు కణగాచి ఖీర్‌ను ప్రత్యేకంగా వండుకుంటారు.

మలయాళీలకు కూడా కొత్త సంవత్సరం వేడుకలున్నాయి. కేరళీయులకు ఉగాది అంటే విషు. ప్రతి ఏడాది మేష సంక్రాంతి రోజును విషుగా జరుపుకుంటారు. ఈ రోజున సూర్యుడు మేషరాశిలో ప్రవేశిస్తాడు. సూర్యగమనాన్ని అనుసరించి ఏడాదిలో రెండు రోజులు పూర్తి భిన్నంగా ఉంటాయి.. రాత్రి కంటే పగలు ఎక్కువ సమయం ఉండేది జూన్‌ 21న. అలాగే పగటి కంటే రాత్రి ఎక్కువ సమయం ఉండేది డిసెంబర్‌ 21. మొదటిది ఉత్తరాయనంలో వస్తే.. రెండోది దక్షిణాయనంలో వస్తుంది.. వీటిని విషవత్తులు అని పిలుస్తారు అలాగే ఏడాదిలో రెండు రోజులు సూర్యుడు భూమధ్య రేఖకు సమాంతరంగా ఉదయిస్తాడు.. వాటిని తుల విషు.. మేడ విషు అంటారు. ఏప్రిల్‌లో వచ్చే మేడ విషు రోజును మలయాళీలు నూతన సంవత్సరంగా జరుపుకుంటారు.

విషు అంటే సమానమట! అందుకే కాబోలు ఈ పండుగను కులమతాలకు అతీతంగా అందరూ సంతోషంగా జరుపుకుంటారు. మలబారు ప్రాంతంలో అయితే మరింత శోభాయమానంగా నూతన సంవత్సర వేడుకలు జరుగుతాయి. అందరిలాగే మలయాళీలు కూడా కొత్త సంవత్సరం మంచిని తెస్తుందని ఆకాంక్షిస్తారు. సుఖశాంతులు తెస్తుందని ఆశిస్తారు. విషు పండుగకు సంబంధించిన పురాణగాధలు కూడా ఉన్నాయి.. నవగ్రహాలను.. అష్టదిక్పాలకులను తన చెప్పుచేతల్లో పెట్టుకుంటాడు లంకాధీశుడైన రావణాసురుడు.. ఫలితంగా సూర్యుడి గమనం గతి తప్పుతుంది. రావణ సంహారం జరిగిన తర్వాత ఆ మరుసటి రోజు సూర్యుడు తన పూర్తి శక్తితో తూర్పు నుంచి నిటారుగా ఉదయించాడట! ఆ రోజే విషు. కొన్ని వేల సంవత్సరాల నుంచి విషును మలయాళీయులు జరుపుకుంటున్నారు.

విషు ముందు రోజు రాత్రి ఇంటి ముందు రంగురంగుల రంగవల్లికలను వేస్తారు. ఆ ముగ్గులను పూలతో తీర్చిదిద్దుతారు. ఇంటిని శుభ్రం చేసుకుంటారు. పసుపుపచ్చటి పూలతో అరటి , మామిడి ఆకులతో చక్కగా అలంకరిస్తారు. దీపకాంతులు సరేసరి! మర్నాడు ఉదయం నిద్రలేవగానే విషుకన్నిని చూస్తారు. విషుకన్ని అంటే శుభం కలిగించే వస్తువులను చూడటమన్నమాట! ఓ రోజు ముందుగానే విషుకన్ని ఏర్పాట్లను చేసుకుంటారు మలయాళీలు.. పండుగ ముందు రోజు రాత్రి ఇంట్లోని పెద్ద ముత్తైదువ ఓ పెద్ద పళ్లెంలో అక్షితలు, పచ్చటి నిమ్మకాయలు, తమలపాకులు, వక్కలు పెడతారు. ఈ పళ్లాన్ని ఉర్లి అంటారు. అందులో భాగవత గ్రంథమో రామాయణ గ్రంథమో పెట్టి పూజామందిరంలో శ్రీకృష్ణుడి పటం ముందు ఉంచుతారు. అలాగే అష్టలక్ష్మి చెంబులో నూతన వస్త్రాన్ని అమర్చుతారు. దానిమీద ఓ అద్దాన్ని పెడతారు. పూజమందిరాన్ని కనికొన్న అనే పూలతో అలంకరిస్తారు. కేరళ రాష్ర్ట అధికారిక పుష్పాలు ఇవే! ఇవి కేవలం వేసవిలోనే పూస్తాయి..

ఆ రాత్రి పూజామందిరంలో పెద్ద ముత్తయిదువు పడుకొని తెల్లవారుజామునే నిద్రలేస్తుంది..కళ్లు తెరవకుండానే భగవద్గీత శ్లోకాలను చదువుతూ దీపాలను వెలుగిస్తుంది.. ఈ దీపాలను నీలవిలక్కు అంటారు. దీపాలు వెలిగిన తర్వాత కళ్లు తెరచి అన్ని వస్తువులను కలియచూస్తుంది.. కృష్ణపరమాత్ముడిని భక్తితో ధ్యానించి ఇంట్లోని వారందరిని ఒక్కొక్కరిగా నిద్రలేపి కళ్లు మూసి పూజామందిరానికి నడిపించి తీసుకొస్తుంది.. అలా కుటుంబసభ్యులంతా విషుకన్ని దర్శనం చేసుకుంటారు. విషు కన్నిని దర్శించుకోన్నాక అన్నం, కొబ్బరి పాలు, బెల్లం తో చేసిన పాయసం విషు కన్హిని కుటుంబ సభ్యులంతా స్వీకరిస్తారు. గుళ్లో కూడా ఇదే ప్రసాదంగా ఇస్తారు.ఆ తర్వాత అభ్యంగనస్నానమాచరించి కొత్త బట్టలు ధరిస్తారు. ఇంటి పెద్ద పిల్లలకు.. పనివాళ్లకు.. పేదలకు నగదు బహుమతి ఇస్తాడు. దీన్ని విషుక్కైనీట్టం అంటారు. పండుగ రోజున కొత్త దుస్తులు ధరించిన చిన్నారులు వీధుల్లోని ప్రతి ఇంటికి వెళ్లి విషు కన్నియే అంటూ ముద్దు ముద్దు మాటలతో పండుగరాకను తెలుపుతారు. ఆ ఇంటి ఇల్లాలు ఆ చిన్నారులకు తీపి వంటకాన్ని కానుకగా ఇస్తుంది.. కొందరు డబ్బులు కూడా ఇస్తారు.. దీన్ని విషు కన్నివిల్లి అంటారు. ఆ తర్వాత గ్రామపురోహితుడు పంచాంగ శ్రవణం చేస్తాడు.. వ్యవసాయ కుటుంబాలు అందంగా ముస్తాబు చేసిన నాగలికి పూజలు చేస్తాయి.. ఇంటి పెద్ద ఆ నాగలితో పొలానికి వెళ్లి చాలులు తీస్తాడు. వాటిల్లో ఎండుగడ్డి.. ఆవు పేడ వేసి మట్టితో కప్పేస్తాడు.. ఇలా చేయడం వల్ల పంటలు బాగా పండుతాయన్నది వారి నమ్మకం. విషు రోజున ఆలయాలన్ని కొత్త శోభను సంతరించుకుంటాయి.. భక్తులతో కిటకిటలాడతాయి. విషు రోజున చేసే భోజనాన్ని విషుసద్ది అంటారు. సద్దిలో తీపి.. పులుపు.. చేదు.. వగరు.. కారపు పదార్ధాలు తప్పనిసరి.. వంటకాల్లో ఉప్పు ఎలాగూ ఉంటుంది.. విషు ముందు రోజు రాత్రి .. పండుగ రోజు ఉదయం పిల్లలు బాణాసంచా కాలుస్తారు. ఈ వేడుకను విషు పాదక్కమ్‌ అంటారు..

Ugaadi (6)

ఇక తమిళనాడులో ఉగాదిని పుత్తాండుగా జరుపుకుంటారు. వరుడ పిరాప్పుగా పిలుచుకునే పుత్తాండు కూడా విషు రోజే వస్తుంది.. వేనవేల వత్సరాల నుంచి తమిళులు ఇదే రోజున నూతన సంవత్సరారంభాన్ని జరుపుకుంటున్నారు. మధ్యలో డీఎంకే ప్రభుత్వం గడబిడ చేసింది.. ఇది ఆర్యుల పండగంటూ సంక్రాంతి సమయాన్నే కొత్త సంవత్సర ఆరంభంగా భావించాలని చట్టం చేసింది.. ఏప్రిల్‌లో వచ్చే పుత్తాండును చిత్తిరై తిరునాళ్‌గా జరుపుకోవాలని ఆదేశించింది.. అనాదిగా వస్తున్న సంప్రదాయాలను చట్టాలు నిరోధించలేవు కాబట్టే తమిళ ప్రజలు ప్రభుత్వ ప్రకటనను తేలిగ్గా తీసుకున్నారు.. పుత్తాండునే ఉగాదిగా జరుపుకుంటున్నారు. ఒక్క ఉగాది పచ్చడి అక్కడ ఉండదు కానీ పండుగ వైభవమంతా ఉంటుంది. పంచాంగ శ్రవణాలు. పిండి వంటలు. విందు భోజనాలు మామూలే! కొన్ని చోట్ల ఎడ్ల పందాలు కూడా జరుగుతాయి.

కేరళలోలాగే ఇక్కడా ఓ పెద్ద పళ్లెంలో మామిడి, అరటి, పనసపండ్లను పెడతారు. తమలపాకు, వక్క, బియ్యం, బంగారం వెండి ఆభరణాలు. నగదు, పూలు, అద్దం వీటన్నింటినీ ఆ పళ్లెంలో చక్కగా అమరుస్తారు. పండుగ రోజు పొద్దున్నే నిద్రలేచి మొదట దైవదర్శనాన్ని, తర్వాత వీటి దర్శనాన్ని చేసుకుంటారు. సంపద వృద్ధికి ఇది సూచికన్నది వారి నమ్మకం. దీన్ని కన్ని అంటారు. అంటే శుభ దృష్టి అన్నమాట! దక్షిణ తమిళనాడులో ఇదే పండుగను చిత్తిరై విషుగా జరుపుకుంటారు. ఇంటినంతా చక్కగా అలంకరించుకుంటారు. ఇంటి ముందు రంగవల్లికలను తీర్చి దిద్దుతారు. ముగ్గు మధ్యలో కుట్టివిలాకు అని ఓ దీపాన్ని వెలిగిస్తారు. ఆ వెలుగులో చెడు అనే చీకటి తొలగిపోవాలని ప్రార్థిస్తారు. కొత్త ఏడాదిని పురస్కరించుకుని పిల్లలకు పెద్దలు కొంత నగదును కానుకగా ఇస్తారు.. దీన్ని కై విశేషమ్‌ అంటారు. పండుగ రోజున కుంభకోణం దగ్గర తిరువాడమరుదూర్‌లో రథాల పోరు జరుగుతుంది. కొన్ని చోట్ల ఎడ్ల పందేలు కూడా జరుగుతాయి. శ్రీలంకలో ఉన్న తమిళులు కూడా ఇదే రోజున నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటారు. ఆ రోజున అక్కడ సెలవుదినం. వన మూలికలతో చేసిన తైలాన్ని నీటిలో కలుపుతారు.. ఆ నీటితో అభ్యంగన స్నానం ఆచరిస్తారు. ఇలా చేయడం ఆరోగ్యానికి మంచి చేస్తుందన్నది వారి నమ్మకం.

Ugaadi (7)

పంజాబ్‌లో కూడా ఇదే రోజున కొత్త సంవత్సర ఉత్సవాలు జరుగుతాయి. దీన్ని వారు వైశాఖీగా జరుపుకుంటారు. మనకు సంక్రాంతి ఎలాగో వారికి ఇది పంటల పండుగ కూడా! రబీ పంట నూర్పిడి సమయం ఇదే. అందుకే వారిలో అంత అనందం.. తమ సంప్రదాయ నృత్యాలతో ఆ సంబరాలను పంచుకుంటారు. కొత్తగా పండిన గోధుములను పట్టించి, ఆ పిండితో రొట్టెలను, తీపిని చేసుకుంటారు.. పంజాబ్‌లోనే కాదు, హర్యానాలోనూ వైశాఖి పండుగ ఘనంగా జరుగుతుంది.. భాంగ్రా నృత్యాలు.. గిద్దాలతో ఉత్సవాలను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. పండుగ జాతరల గురించి ఎంత చెప్పినా తక్కువే! పాకిస్తాన్‌ పంజాబ్‌లోనూ వైశాఖి ఉత్సవాలు గ్రాండ్‌గా జరుగుతాయి..

బెంగాల్‌ వాసులు ఈ పండుగను పొయ్‌లా బైశాఖ్‌గా పిల్చుకుంటారు. వీరికి కొత్త సంవత్సరం వైశాఖ మాసంతో ప్రారంభమవుతాయి. వారి క్యాలండర్‌ ప్రకారం చైత్రం ఏడాదిలో చివరి మాసం. వైశాఖ పాడ్యమి రోజున వారు కొత్త సంవత్సరం వేడుకలు జరుపుకుంటారు. వారి ఆర్ధిక సంవత్సరం కూడా ఈ రోజు నుంచే మొదలవుతుంది.. వ్యాపారులు కొత్త ఖాతా పుస్తకాలు తెరిచేది ఇప్పుడే! ఇళ్ల ముందు వైవిధ్యమైన రంగవల్లికలు దర్శనమిస్తాయి. ఈ ముగ్గులను అల్పనాలు అంటారు. మహిళలు ఎర్ర అంచున్న తెల్లని సంప్రదాయ చీరను ధరిస్తారు.. పురుషులు ధోతి కుర్తా వేసుకుంటారు. ఉదయాన్నే గుంపులు గుంపులుగా ప్రభాత్‌ ఫేరీ అనే ఊరేగింపులో పాల్గొంటారు. అలా వీధుల్లో తిరుగుతూ అందరికీ కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతారు. చెట్ల కిందకు చేరుకుని సూర్యోదయాన్ని తిలకిస్తారు. బంగ్లాదేశ్‌లోనూ బైశాఖ్‌ వేడుకలు జరుగుతాయి. ఒడిషా ప్రజలను ఉగాదిని మహా బిశుబ అంటారు. ఉగాది పచ్చడిలాగే అక్కడ పటిక బెల్లంతో చేసిన పానకాన్ని సేవిస్తారు. పండ్లు, పాలు, బెల్లం, పెరుగు, చింతపండు రసాలతో కలిపి చేసిన పానకంతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతారు. ఉత్సవాలు, ఊరేగింపులు మామూలే! అస్సామీలు కొత్త సంవత్సర వేడుకను బొహాగ్‌ బిహు అంటారు. అస్సాం భిన్న జాతులకు, విభిన్న తెగలకు నెలవు. ఈ పండుగ మాత్రం అందరని ఒక్కటి చేస్తుంది. పంట చేతికొచ్చిన ప్రతి సందర్భంలోనూ అస్సామీలు పండుగ చేసుకుంటారు. సంవత్సరాదిగా జరుపుకునే రొంగాలి బిహూ కూడా పంటల పండుగే! అందుకే పొలంలోనే ఉత్సవాలను ప్రారంభిస్తారు. వ్యవసాయ పనిముట్లను..పశువులను పూజిస్తారు. ఆట పాటలలో మునిగి తేలుతారు. మణిపూర్‌లో సంవత్సరాదిని చైరావోబా అంటారు.. మనం ఉగాది జరుపుకునే రోజునే వీరు చైరావోబాను జరుపుకుంటారు. కశ్మీరీలకు కూడా ఇదే రోజు సంవత్సరాది.. ఇక మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌.. ఉత్తరప్రదేశ్‌.. హర్యానా.. ఉత్తరాఖండ్‌… బిహార్‌.. హిమాచల్‌ప్రదేశ్‌.. జార్ఖండ్‌.. చత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలలో అక్కడక్కడ రంగులు చల్లుకునే సంప్రదాయం కూడా ఉంది..

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..