సమతా మహాకుంభ్ బ్రహ్మోత్సవాల్లో ఆధ్యాత్మిక వైభవం..అట్టహాసంగా శాంతి కల్యాణోత్సవం….
ముచ్చింతల్లో సమతా కుంభ్ 2026 ఉత్సవాలు, శ్రీరామానుజాచార్య 108 దివ్యదేశాల 4వ బ్రహ్మోత్సవాలు ఆధ్యాత్మిక శోభను నింపుతున్నాయి. చిన్నజీయర్ స్వామి పర్యవేక్షణలో వేలాది భక్తులు వసంతోత్సవం, అశ్వవాహన సేవ, గరుడ వాహన సేవలతో పాటు శాంతి కల్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. దివ్యదేశాల ప్రాశస్త్యాన్ని స్వామీజీ వివరించగా, భక్తులు పులకించిపోయారు. ఈ వేడుకలు భక్తుల మనస్సుల్లో చిరస్థాయిగా నిలిచిపోయే ఆధ్యాత్మిక అనుభూతిని మిగిల్చాయి.

ముచ్చింతల్లో సమతాకుంభ్-2026 ఉత్సవాలు కన్నుల పండులా జరుగుతున్నాయి. సమతామూర్తి స్ఫూర్తి కేంద్రంలో జరుగుతున్న శ్రీరామానుజాచార్య-108 దివ్యదేశాల 4వ బ్రహ్మోత్సవాలకు భక్తులు పెద్దసంఖ్యలో తరలివస్తున్నారు. శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి పర్యవేక్షణలో ఈ వేడుకలు జరుగుతున్నాయి. సమతాకుంభ్-2026 వేడుకల్లో భాగంగా ఏడవరోజు ఉదయం సుప్రభాతం అష్టాక్షరీ మంత్ర జపం ఆరాధన, సేవా కాలం, హోమాలు,తీర్థ ప్రసాద గోష్టి, నిత్య పూర్ణాహుతి కార్యక్రమాలు జరుగుతాయి. ఈ ఉదయం పదిన్నరకు వసంతోత్సవం నిర్వహిస్తారు. ఈ సాయంత్రం సాకేత రామచంద్ర ప్రభువుకు అశ్వవాహన సేవ ఉంటుంది. 73 నుంచి 90 దివ్యదేశాల దేవత మూర్తులకు..18 గరుడ వాహన సేవలు జరుగుతాయి.
ముచ్చింతల్ శ్రీరామనగరంలోని సమతామూర్తి స్ఫూర్తి కేంద్రంలో బుధవారం జరిగిన శాంతికళ్యాణ మహోత్సవం..ఇల వైకుంఠపురాన్ని తలపించింది. సమతా మూర్తి ప్రాంగణం ఆధ్యాత్మిక వైభవంతో పరిమళించగా..వేలాది భక్తులు ఈ పుణ్యకార్యానికి తరలివచ్చారు. ఈ సందర్భంగా శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామీజీ..108 దివ్యదేశాల ప్రాశస్త్యం, వాటి విశిష్టతను భక్తజనులకు వివరించారు. దివ్యదేశాల మహాత్మ్యాన్ని వివరిస్తూ శ్రీరామానుజాచార్యుల దివ్య సందేశాన్ని గుర్తు చేశారు. ముచ్చింతల్లో నిర్వహించిన ఈ శాంతి కల్యాణోత్సవం..భక్తుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచే ఆధ్యాత్మిక అనుభూతిని మిగిల్చిందని శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి తెలిపారు.
శాంతి కల్యాణోత్సవం పూర్తిగా శాస్త్రోక్త విధానంలో, వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ అంగరంగ వైభవంగా సాగింది. ఉత్సవాల్లో భాగంగా 108 భగవాన్ మూర్తుల మాంగళ్యధారణ ఘట్టం నిర్వహించగా..భక్తులతో కలిసి గోత్ర నామాల ఉచ్చారణ చేయించారు. జేజేలు, మంగళ వాయిద్యాల మధ్య శాంతి కల్యాణోత్సవం పరమ భక్తిరసంతో కొనసాగింది. ఈ శాంతి కల్యాణోత్సవంలో మై హోమ్ గ్రూప్ అధినేత డా. జూపల్లి రామేశ్వర రావు కుటుంబ సమేతంగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే సమతామూర్తి సహస్రాబ్ది ఉత్సవ కమిటీ సభ్యులు, ప్రముఖులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై వేడుకలను విజయవంతం చేశారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం క్లిక్ చేయండి..
