యాదాద్రిలో తిరుమల వైభవం.. పంచనారసింహ క్షేత్రంలో కొలువుదీరిన దివ్య పాదాలు..!
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి భక్తులకు దేవస్థానం అదిరిపోయే ఆధ్యాత్మిక కానుకను అందించింది. తెలంగాణ తిరుపతిగా వెలుగొందుతున్న ఈ పుణ్యక్షేత్రంలో, తిరుమల తరహాలోనే 'నృసింహ పాదాల'ను ప్రతిష్ఠించారు. లోక సంరక్షణార్థం ఉగ్ర నరసింహుడు ఐదు రూపాలలో వెలసిన ఈ పంచ నారసింహ క్షేత్రంలో, భక్తుల సౌకర్యార్థం ఈ నూతన ఘట్టాన్ని ఆవిష్కరించారు.

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి భక్తులకు దేవస్థానం అదిరిపోయే ఆధ్యాత్మిక కానుకను అందించింది. తెలంగాణ తిరుపతిగా వెలుగొందుతున్న ఈ పుణ్యక్షేత్రంలో, తిరుమల తరహాలోనే ‘నృసింహ పాదాల’ను ప్రతిష్ఠించారు. లోక సంరక్షణార్థం ఉగ్ర నరసింహుడు ఐదు రూపాలలో వెలసిన ఈ పంచ నారసింహ క్షేత్రంలో, భక్తుల సౌకర్యార్థం ఈ నూతన ఘట్టాన్ని ఆవిష్కరించారు.
సాధారణంగా తిరుమలలో అలిపిరి వద్ద శ్రీవారి పాదాల దర్శనం చేసుకుని భక్తులు కొండపైకి ఎలా వెళ్తారో, ఇకపై యాదగిరిగుట్టలోనూ అదే సంప్రదాయం కొనసాగనుంది. కొండపైకి వెళ్లే మెట్ల మార్గం ప్రారంభంలో ఉండే వైకుంఠ ద్వారం కూడలి వద్ద ఈ దివ్య పాదాలను ప్రతిష్ఠించారు. దాదాపు రెండున్నర అడుగుల వెడల్పు, రెండు అడుగుల ఎత్తుతో కృష్ణరాతి శిలతో ఈ పాదాలను అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. భక్తులు కొండ ఎక్కే ముందే స్వామివారి పాదాలను దర్శించుకుని, భక్తిభావంతో నమస్కరించుకుని తమ యాత్రను ప్రారంభించే వీలు కలుగుతుంది.
స్వామివారి జన్మ నక్షత్రం (స్వాతి నక్షత్రం) పురస్కరించుకుని ఈ పాదాలకు ఆలయ అధికారులు శాస్త్రోక్తంగా ప్రతిష్ఠాపన మహోత్సవం నిర్వహించారు. అనంతరం జరిగిన తొలి అభిషేక పూజల్లో స్థానిక ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, ఆలయ ఈవో భవానీశంకర్ తదితరులు పాల్గొన్నారు. కొండ చుట్టూ గిరిప్రదక్షిణ చేసే భక్తులు కూడా ఈ పాదాల వద్ద ఆగి, స్వామివారికి అభిషేకం చేసుకునే అవకాశం కల్పించడం విశేషం.
పునర్నిర్మాణం తర్వాత యాదాద్రికి భక్తుల రద్దీ గణనీయంగా పెరిగింది. ప్రతిరోజూ వేల సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ఆలయ అభివృద్ధిలో భాగంగా తిరుమల తరహా ఆచారాలను, ఆధ్యాత్మిక హంగులను జోడించడంపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొండ కింద వైకుంఠ ద్వారం వద్దే పాదదర్శనం లభించడం వల్ల, అనారోగ్య కారణాల వల్ల కొండపైకి వెళ్లలేకపోయేవారికి కూడా ఇది ఒక గొప్ప వరమని భక్తులు భావిస్తున్నారు. ఈ ఏర్పాటుతో యాదగిరిగుట్టలో ఆధ్యాత్మిక శోభ మరింత సంతరించుకుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…
