
మహాశివరాత్రి హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన పర్వదినాలలో ఒకటి. ప్రతి సంవత్సరం మాఘ మాసంలో వచ్చే ఈ పండుగ 2025లో ఫిబ్రవరి 26న జరుపుకుంటారు. ఈ రోజు భక్తులు ఉపవాసం పాటిస్తూ, శివుని ఆరాధన చేస్తారు. కానీ ఈ ఉపవాస సమయంలో మహిళలకు పీరియడ్స్ వస్తే ఏమి చేయాలి అనే సందేహం చాలా మందికి ఉంటుంది.
మహాశివరాత్రి ఉపవాస సమయంలో పీరియడ్స్ వస్తే వ్రతాన్ని మానేయాల్సిన అవసరం లేదు. కానీ ఉపవాసం మొదలయ్యే ముందు నుంచే పీరియడ్స్ ఉన్నట్లయితే ఉపవాసం చేయకపోవడం మంచిది. అయితే దీక్ష కొనసాగించాలని అనుకుంటే శరీర శుద్ధి ముఖ్యమైనదని గుర్తు పెట్టుకోవాలి. ఈ సమయంలో ప్రత్యక్షంగా పూజ చేయకుండా మనసులో భగవంతుని ధ్యానం చేయవచ్చు.
ఈ సమయంలో శివుని మూర్తిని లేదా పూజా సామగ్రిని తాకకుండా భక్తిభావంతో శివుని ధ్యానం చేయాలి. మంత్రోచ్చారణ, భజనలు చెప్పడం ద్వారా భక్తి మార్గాన్ని కొనసాగించవచ్చు. కుటుంబ సభ్యులు లేదా ఇతర భక్తుల ద్వారా పూజ చేయించడం కూడా మంచి మార్గం.
హిందూ సంప్రదాయాల ప్రకారం పీరియడ్స్ సమయంలో మహిళలు శరీరంలో ఎనర్జీ మార్పులను అనుభవిస్తారు. పురాణ కధనాల ప్రకారం దేవతలు కూడా ఈ శక్తిని తట్టుకోలేరని చెప్పబడింది. అందుకే పీరియడ్స్ సమయంలో ప్రత్యక్ష పూజను నివారించడం ఉత్తమం.
ఒక సాధారణ నిబంధన ప్రకారం పీరియడ్స్ ఐదవ రోజు శుద్ధి స్నానం చేసి పూజ చేయొచ్చు. కొంతమందికి మూడు రోజులకే పూర్తయితే నాలుగో రోజు స్నానం చేసి పూజ ప్రారంభించవచ్చు. ఏడు రోజుల వరకూ ఉన్నవారు ఎనిమిదో రోజు నుండి సాధారణ పూజలు చేయవచ్చు.
హిందూ పురాణాల ప్రకారం మహాశివరాత్రి రోజున శివుడు, పార్వతీ దేవిని వివాహం చేసుకున్నాడు. అందువల్ల ఈ రోజు శివుని అనుగ్రహం కోసం ఉపవాసాలు, రాత్రి జాగరణలు నిర్వహిస్తారు. ఇది భక్తుల కోసం శరీర శుద్ధి, ఆధ్యాత్మిక ఆరాధనకు అంకితమైన ప్రత్యేకమైన రోజు.