
తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) బోర్డు తరహాలో యాదాద్రి (Yadadri Temple) లక్ష్మీనరసింహ స్వామి ఆలయ నిర్వహణ, పాలన కోసం ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేసేందుకు అధికారులు యోచిస్తు్నారు. పాలన సాఫీగా సాగేలా పాలకమండలిని ఏర్పాటు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. మహాకుంభ సంప్రోక్షణ పర్వం తర్వాత ఇందుకు సంబంధించిన అంశంపై దృష్టి సారించే అవకాశం కనిపిస్తోంది. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించి ఆలయ విస్తరణ చేపట్టింది. భక్తులకు అనుగ్రహం కలిగేలా, ఆధ్యాత్మికత ఉట్టిపడే విధంగా దేవాలయాన్ని విస్తరించారు. భక్తులకు కావాల్సిన వసతులు, సౌకర్యాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. వీటిలో చాలా వరకు పనులు పూర్తయ్యాయి. ప్రముఖుల విడిది కోసం ప్రెసిడెన్షియల్ విల్లాల నిర్మాణం పూర్తి కాగా భక్తుల విడిది కోసం కాటేజీల నిర్మాణం జరగాల్సి ఉంది. యాదాద్రి ఆలయ ప్రాజెక్టును దేవాదాయశాఖతో పాటు యాదాద్రి ఆలయ అభివృద్ధి సంస్థ చేపడుతోంది. ప్రస్తుతం దేవాదాయశాఖ ఆధ్వర్యంలో ఆలయ నిర్వహణ జరుగుతోంది. భారీస్థాయిలో అభివృద్ధి, విస్తరణ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న విధానం ఆలయ నిర్వహణ, పాలనకు సరిపోదని పలువురు అభిప్రాయ పడుతున్నారు.
టీటీడీ తరహాలో ప్రత్యేక ఆలయ బోర్డు ఏర్పాటు చేయాలని, పాలకమండలి అదే రకంగా ఉండాలని అంటున్నారు. టీటీడీ తరహాలో ఐఏఎస్ అధికారిని కార్యనిర్వహణాధికారిగా నియమించే విధానం పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. జేఈఓ, డిప్యూటీ ఈఓ, ఏఈఓ తదితర పోస్టుల సంఖ్యను పెంచి, దేవాదాయశాఖ పరిధిలోనే టీటీడీ తరహా వ్యవస్థ, విధానాన్ని తీసుకొచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. మహాకుంభ సంప్రోక్షణ అనంతరం ఆలయ నిర్వహణకు సంబంధించిన అంశాలపై ప్రభుత్వం దృష్టి పెట్టనుంది. 108 మంది పండితులతో ఏడు రోజులపాటు సాగే పంచకుండాత్మక యాగం తర్వాత ఈ నెల 28న మహాకుంభ సంప్రోక్షణ నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు మిథున లగ్నం సుముహూర్తంలో మహాకుంభాభిషేకం, శాంతి కళ్యాణంతో మహాక్రతువు ముగియనుంది.
యాగం కోసం బాలాలయంలో ఐదువిధాలుగా కుండాలను ఏర్పాటుచేశారు. తూర్పున చతురస్రాకారాంలో, పడమర వృత్తాకారంలో, ఉత్తరంలో త్రికోణం, దక్షిణంలో అర్ధచంద్రకారం, ఈశాన్యంలో పద్మాకారంలో హోమగుండాలను ఏర్పాటు చేశారు. యాగం కోసం 24 రకాల ద్రవ్యాలతో పాటు స్వచ్ఛమైన నెయ్యిని వినియోగిస్తున్నారు.
Also Read
Tears: ఆనంద భాష్పాలు ఎందుకు వస్తాయో తెలుసా.. వాటి వెనక ఉన్న సైంటిఫిక్ రీజన్ ఏమిటంటే..
Know This: పుతిన్ ఫ్యామిలీపై యుద్ధం ఎఫెక్ట్.. కుప్పకూలిన పుతిన్ కూతురి కాపురం !!