Amarnath Yatra: అమ‌ర్‌నాథ్ గుహవద్ద పెను ఉప్పెన.. పదుల సంఖ్యలో భక్తులు గల్లంతు.. పలువురు మృతి

మంచు లింగం ఉన్న గుహ వద్ద జలప్రళయం విరుచుకుపడింది. అమర్‌నాథ్ గుహ సమీపంలోని కొన్ని టెంట్లు, గుడారాలను వరద ముంచేసింది. ఈ ప్రవాహంలో చిక్కుకొని కొంత మంది భక్తులు కొట్టుకుపోయారు.

Amarnath Yatra: అమ‌ర్‌నాథ్ గుహవద్ద పెను ఉప్పెన.. పదుల సంఖ్యలో భక్తులు గల్లంతు.. పలువురు మృతి
Amarnath Cave

Updated on: Jul 09, 2022 | 7:16 AM

Amarnath Yatra: జమ్మూ కశ్మీర్‌లోని అమర్‌నాథ్ గుహ వద్ద పెను ప్రమాదం సంభవించింది. ఊహించని ఉప్పెన ఒక్కసారిగా విరుచుకుపడింది. అమర్‌నాథ్ గుహ వద్ద సంభవించిన వరదల్లో దాదాపు 13మంది భక్తులు మృత్యువాతపడ్డారు. 40మంది వరకు గల్లంతైనట్టు క‌శ్మీర్ ఐజీపీ విజ‌య్ కుమార్ స్ప‌ష్టం చేశారు. స్థానిక పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు స‌హాయ‌క చ‌ర్య‌ల‌ను ముమ్మ‌రం చేశాయ‌ని తెలిపారు. గాయ‌ప‌డ్డ వారిని హెలికాప్ట‌ర్ల ద్వారా చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రుల‌కు త‌ర‌లిస్తున్నామ‌ని పేర్కొన్నారు. ప్ర‌స్తుతానికి ప‌రిస్థితి అదుపులోనే ఉంద‌న్నారు. మృతుల సంఖ్య పెరిగే అవ‌కాశం ఉంద‌ని ఐటీబీపీ సూచించింది. యాత్రికుల‌ను హెలికాప్ట‌ర్ల ద్వారా సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించేందుకు చ‌ర్య‌లు చేప‌ట్టిన‌ట్లు తెలిపారు. విపత్తు నేపథ్యంలో అమర్‌నాథ్‌ యాత్రకు తాత్కాలిక వాయిదా వేశారు.

అమర్‌నాథ్‌ గుహవద్ద ఒక్కసారిగా వరద పోటెత్తింది. మంచు లింగం ఉన్న గుహ వద్ద జలప్రళయం విరుచుకుపడింది. అమర్‌నాథ్ గుహ సమీపంలోని కొన్ని టెంట్లు, గుడారాలను వరద ముంచేసింది. ఈ ప్రవాహంలో చిక్కుకొని కొంత మంది భక్తులు కొట్టుకుపోయారు. ఒక్కసారిగా జలప్రళయం విరుచుకుపడటంతో వందలాది మంది యాత్రికులు చిక్కుకుపోయారు. శుక్రవారం (జులై 8) సాయంత్ర 5.30 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆకాశం బద్ధలైనట్లుగా.. 2 కిలోమీటర్ల మేర వరద ఒక్కసారిగా కొండపై నుంచి కిందకు పోటెత్తిందని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. పెను విషాదంగా మారే అవకాశాలు లేకపోలేదని అధికారులు అంచనా వేస్తున్నారు. వర్షం తగ్గడంతో.. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.  ఐటీబీపీ, ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు లైట్ల వెలుతురులో రెస్క్యూ ఆపరేషన్‌ నిర్వహిస్తోంది.

జరిగిన ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. ఆయన ట్వీట్ చేస్తూ, అమర్‌నాథ్ గుహ వద్ద జరిగిన ఘటన బాధాకరం అన్నారు. మృతుల కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. అటు అమర్ నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తూ అధికారులు ప్రకటించారు.

 

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us